తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2020, 4:08 PM IST

ETV Bharat / bharat

'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'

కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ సానుకూల ఫలితాలిస్తోందని తెలిపారు వైద్యులు.​ దిల్లీలో కొవిడ్​ బారినపడి ప్రాణాంతక స్థితిలో ఉన్న ఓ వ్యక్తి.. ప్లాస్మా థెరపీ తర్వాత కోలుకుంటున్నాడని స్పష్టం చేశారు.

COVID-19 patient given plasma therapy at pvt hospital shows improvement, weaned off ventilator
'ప్లాస్మా థెరపీతో కరోనా నుంచి కోలుకుంటున్నారు!'

ప్రపంచ వ్యాప్తంగా లక్షకు మించి ప్రాణాలు బలిగొన్న కరోనాపై ప్లాస్మా థెరపీ మెరుగ్గా పనిచేస్తోందంటున్నారు వైద్యులు. దక్షిణ దిల్లీ, సాకేత్​లోని మ్యాక్స్​ ఆసుపత్రిలో​ చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీ సత్ఫలిచ్చిందని ప్రకటించారు.

సాధారణ జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వ్యకికి.. ఏప్రిల్​ 4న వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ​ఆ తర్వాత పరిస్థితి విషమించి.. నిమోనియా లక్షణాలు కనిపించాయి. ఏప్రిల్​ 8న అతడిని వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు. అయితే, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ప్లాస్మా థెరపీ చేశారు. అనూహ్యంగా కరోనా నుంచి కోలుకోవడం మొదలెట్టాడు ఆ బాధితుడు.

"బాధితుడి కుటుంబ సభ్యులు ప్లాస్మా దాతను ఏర్పాటు చేశారు. మూడు వారాల క్రితం కరోనాను జయించిన ఆ వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించి, బాధితుడి శరీరంలోకి పంపించాం. ప్లాస్మా థెరపీ చేసిన నాలుగు రోజులకే, అతడి శరీరంలో గణనీయమైన మార్పు వచ్చింది. వెంటిలేటర్​ లేకుండా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన నోటితో ఆహారం తీసుకుంటున్నారు. ప్లాస్మా థెరపీ అతడు కోలుకోవడానికి దోహదపడింది."

-మ్యాక్స్​ ఆసుపత్రి వైద్యులు

అయితే, కేవలం ప్లాస్మా థెరపీ మాత్రమే కరోనా నుంచి ఉపశమనం ఇచ్చిందని చెప్పలేమని.. దానితోపాటు ఇతర వైద్య సేవలూ అందించడం వల్లే బాధితుడు కోలుకోగలుగుతున్నారని స్పష్టంచేశారు వైద్యులు.

ప్లాస్మా థెరపీ అంటే?

వైరస్‌ బారినపడి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాను.. మరొకరికి ఎక్కించే విధానమే కాన్వలసెంట్‌ ప్లాస్మా థెరపీ. సాధారణంగా మన శరీరంలోకి బయట నుంచి వైరస్‌ ప్రవేశించినప్పుడు దాంతో పోరాడేందుకు రోగనిరోధకాలు(యాంటీబాడీస్​) విడుదలవుతాయి. అప్పుడు శరీరం తట్టుకుని నిలబడుతుంది. తట్టుకోలేని శరీరాలు రోగం బారిన పడతాయి. మనకు నయమైన తర్వాత కూడా యాంటీబాడీస్‌ రక్తంలో ఉండిపోతాయి.

అలా, కోలుకున్న వ్యక్తిలోని ప్లాస్మాను మరో వైరస్​ బాధితుడి శరీరంలోకి ఎక్కిస్తారు. ఫలితంగా అతడిలోనూ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్​ నుంచి కోలుకుంటాడు. ఈ ప్లాస్మా థెరపీ ఒకరకంగా రక్తమార్పిడి లాంటిదేనని వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:కన్నబిడ్డను విడిచి ఒకరు.. కడుపులో బిడ్డతో మరొకరు!

ABOUT THE AUTHOR

...view details