కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆడం మాలిక్ సాబా, 22 సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రుల చెంతకు చేరాడు. అతని రాక ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపింది.
అసలేమైంది..?
మాలిక్ సాబా బాగవానా- బదిమా దంపతులకు నలుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. వారి స్వస్థలం కర్ణాటక గదగ్ జిల్లాలోని గొగేరీ గ్రామం. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆడం మాలిక్ సాబా పైచదువులు చదవకుండానే తన సోదరుడితో కలిసి పుణెలోని ఓ హోటల్లో పని చేయాల్సివచ్చింది. 1998లో తన స్నేహితులతో విహారయాత్రకు ముంబయి వెళ్లిన సమయంలో ఆడం తప్పిపోయాడు. అతని తల్లిదండ్రులు పుణె, ముంబయిలో 6 సంవత్సరాలు వెతికి ఆశలు వదులుకున్నారు. అయితే అప్పుడు అదృశ్యమైన ఆడం.. సోలాపూర్లోని ఓ హోటల్లో పని ప్రారంభించాడు.
ఉపాధి పోయింది ఊరు గుర్తొచ్చింది..
ఇన్నాళ్లూ సాఫీగా సాగిపోయిన మాలిక్ సాబా జీవితానికి.. లాక్డౌన్ కారణంగా బ్రేక్ పడింది. హోటల్లో ఉపాధి కోల్పోయిన అతని చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉపాధి కరవైంది. పూట గడవని పరిస్థితిలో మాలిక్కు.. తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, సొంత ఊరు గుర్తొచ్చాయి. ఈ తరుణంలో సోలాపూర్ నుంచి గొగేరీ గ్రామంలోని తన తల్లిదండ్రుల చెంతకు పయనమయ్యాడు.