తెలంగాణ

telangana

By

Published : Apr 15, 2020, 7:31 AM IST

ETV Bharat / bharat

న్యాయవ్యవస్థపై లాక్​డౌన్​ ప్రభావం- కీలక కేసుల విచారణలో ఆలస్యం

దేశంలో లాక్​డౌన్​ ప్రభావం కోర్టుల్లో కీలక కేసుల విచారణపై పడింది. సుప్రీంకోర్టుతో సహా అన్ని న్యాయస్థానాలు అత్యవసర కేసుల విచారణను మాత్రమే చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏ, అధికరణ 370 రద్దుకు సంబంధించిన విచారణలు నిలిచిపోయాయి. సీఏఏ అల్లర్లు, ఐఎన్​ఎక్స్ మీడియా కేసు, ఆగస్టా వెస్ట్​ లాండ్ వంటి కీలక కేసులూ పెండింగ్​లో పడ్డాయి.

COURTS-VIRUS-LOCKDOWN
న్యాయవ్యవస్థపై లాక్​డౌన్​ ప్రభావం

దేశంలో మే 3వ తేదీ వరకు లాక్​డౌన్ పొడిగింపు కారణంగా సుప్రీంకోర్టులో ముఖ్యమైన కేసుల విచారణ ఆలస్యం కానుంది. పలు కీలకమైన కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉన్నాయి. లాక్​డౌన్ కారణంగా సుప్రీం ఇప్పటికే దాని కార్యకలాపాలను పరిమితం చేసింది. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అత్యవసర కేసులను విచారిస్తోంది.

సుప్రీంకోర్టులో పౌరసత్వం సవరణ చట్టం, ఆర్టికల్ 370 నిబంధనల రద్దుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన వ్యాజ్యాలు పరిశీలనలో ఉన్నాయి. వీటితోపాటు మత సంప్రదాయాలకు సంబంధించిన సమస్యలు న్యాయ పరిశీలనలో ఉన్నాయి. హోలీ తరువాత శబరిమలకు సంబంధించి మత స్వేచ్ఛ అంశాన్ని విచారించేందుకు తొలుత సిద్ధమయింది సుప్రీం కోర్టు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..

అయితే దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కారణంగా వీటన్నింటిని విచారణను నిలిపేసింది కోర్టు. ధర్మాసనాల సంఖ్యను కూడా తగ్గించింది. విచారణలను అత్యవసర కేసులకే పరిమితం చేసింది. భౌతిక దూరం నిబంధన వల్ల వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే కేసుల విచారణ చేయాలని నిర్ణయించింది అత్యున్నత న్యాయస్థానం. తాజాగా లాక్​డౌన్​ పొడిగింపు వల్ల ఈ కేసులపై విచారణ మరింత ఆలస్యం కానుంది.

మరిన్ని కేసులు..

లాక్​డౌన్​ కారణంగా ఐఎన్​ఎక్స్ మీడియా కేసు విచారణ నిలిచిపోయింది. ఈ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, అతని కుమారుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సునంద పుష్కర్ హత్య కేసు, వీవీఐపీ ఛాపర్ కేసులూ పెండింగ్​లో పడ్డాయి.

దిల్లీ హైకోర్టులోనూ..

దిల్లీ హైకోర్టులోనూ పలు కీలక కేసుల విచారణపై లాక్​డౌన్ ప్రభావం పడింది. ఈశాన్య దిల్లీ అల్లర్లు, జామియా నగర్​లో చెలరేగిన హింసకు సంబంధించి విచారణ ఏప్రిల్​ 21కు వాయిదా వేశారు. అగస్టా వెస్ట్​లాండ్​ కుంభకోణానికి సంబంధించిన కేసును ఏప్రిల్ 20కి వాయిదా వేసింది కోర్టు.

ఈశాన్య దిల్లీ అల్లర్లకు విచారణలను దిల్లీ ట్రయల్ కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ విచారణలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.

పోక్సో కేసులు..

పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి విచారణ చేపట్టే ఫాస్ట్రాక్ కోర్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాకపోకలపై నిషేధం కారణంగా ఇలాంటి సున్నితమైన కేసులను కూడా మే వరకు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెండింగ్ సమస్య..

జిల్లా కోర్టుల్లో కేసుల వాయిదా కారణంగా పెండింగ్​లు పెరిగే అవకాశం ఉంది. కరోనా సంక్షోభానికి కొన్ని రోజుల ముందు జరిగిన దిల్లీ అల్లర్లకు సంబంధించి 690 ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. 800 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరందరు న్యాయనిర్బంధంలో ఉన్న కారణంగా వారిపై ఉన్న మధ్యంతర ఉత్తర్వులు మే 15వరకు పొడిగించారు.

పూచీకత్తుకు మినహాయింపు..

అంతేకాకుండా.. మార్చి 16 తర్వాత గడువు తీరిపోయే మధ్యంతర ఉత్తర్వులను మే 15 వరకు పొడిగించింది దిల్లీ హైకోర్టు. రిమాండ్​లో ఉన్న ఖైదీలకు బెయిల్​ విషయంలో లాక్​డౌన్​ కారణంగా పూచీకత్తు ఇవ్వలేని వారికి మినహాయింపు ఇచ్చింది. అలాంటి వారిని వ్యక్తిగత పూచీకత్తు కింద విడుదల చేసేందుకు అంగీకరించింది.

ఎన్​జీటీలోనూ..

లాక్​డౌన్ వల్ల జాతీయ హరిత ట్రైబ్యునల్​ కూడా న్యాయసమీక్షలను నిలిపేసింది. పర్యావరణం, గంగా యమున ప్రక్షాళనకు సంబంధించి అనేక ముఖ్యమైన కేసులు ఎన్​జీటీ పరిశీలనలో ఉన్నాయి.

లాక్​డౌన్ విరామం వల్ల దిల్లీ హైకోర్టు సహా సబార్డినేట్ కోర్టులు వేసవి సెలవులను రద్దు చేసుకున్నాయి. సుప్రీంకోర్టులోనూ వేసవి సెలవులను రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బొబ్డేను బార్ అసోసియేషన్ కోరింది.

ఇదీ చూడండి:కరోనాపై పోరు: మే 3 వరకు లాక్​డౌన్​లోనే దేశం

ABOUT THE AUTHOR

...view details