లాక్డౌన్ 3.0లో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడం తప్పనిసరి అయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవటం క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతుందని పేర్కొన్నారు.
ఓ వైపు కరోనాపై పోరాడేందుకు లాక్డౌన్ను మే 17 వరకు కొనసాగించినా.. ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు వెంకయ్య.
"లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం కరోనాపై సమష్టిగా పోరాడేందుకు సహకరిస్తుంది. సడలింపులతో రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు, వాణిజ్య, పరిశ్రమ వర్గాలు కలిసి వస్తాయని నా అభిప్రాయం. లాక్డౌన్ 3.0లో కరోనా పూర్వ స్థితికి పరిస్థితులు వచ్చే లక్ష్యంతో పనిచేయాలి.
ఈ రెండువారాలు మన కాలాన్ని నిర్ణయిస్తాయి. ఇది ఒక రకంగా పరీక్ష వంటిదే. మనం అందరం ఇందులో ఉత్తీర్ణులం కావాలి. ఫెయిల్ అనే అవకాశం లేనందువల్ల మనం సాధించగలమనే నమ్మకం నాకుంది."
- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి