తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట కరోనా కేసుల కంటే రికవరీలే ఎక్కువ - Covid-19 cases latest news

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​, ఒడిశా, కేరళలో వైరస్​ విజృంభిస్తోంది. మరోవైపు రికవరీ రేటు కూడా పెరుగుతోంది. ఇప్పటికే 77శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Coronavirus fresh cases and deaths in India
తమిళనాట కరోనా కేసుల కంటే రికవరీలే ఎక్కువ

By

Published : Sep 7, 2020, 7:55 PM IST

Updated : Sep 7, 2020, 10:22 PM IST

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తమిళనాడులో కొత్తగా 5,776 మందికి వైరస్​ సోకగా.. 89మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,69,256కి చేరింది. మృతుల సంఖ్య 7,925కు పెరిగింది. అయితే వరుసగా రెండోరోజు కేసుల కంటే రికవరీలే(5,930) అధికంగా ఉండటం గమనార్హం.

కర్ణాటకలో కొవిడ్​ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా 5,773 కేసులు వెలుగుచూశాయి. మరో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,04,324మందికి వైరస్​ సోకింది. 6,534మంది వైరస్​ ధాటికి మరణించారు.

5 వేలపైనే...

ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 5,649 కేసులు నమోదయ్యాయి. మరో 56 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 71 వేలు దాటింది.

  • ఒడిశాలో తాజాగా 3,861 మంది కరోనా బారిన పడగా.. మరో 10 మంది వైరస్​కు బలయ్యారు. ఆ రాష్ట్ర పర్యటక మంత్రి జేపీ పాణిగ్రహీకి కరోనా పాజిటివ్​గా తేలింది.
  • పంజాబ్​, హరియాణాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఇవాళ ఒక్కరోజే 2 వేలకు పైనే కేసులు నమోదయ్యాయి. పంజాబ్​లో 61మంది, హరియాణాలో 23 మంది మరణించారు.
  • దిల్లీలో ఒక్కరోజే 2,077 కేసులు నమోదవగా... 32 మంది చనిపోయారు.
  • మధ్యప్రదేశ్​లో 1,885 కేసులు బయటపడగా.. మరో 17మంది కొవిడ్​కు బలయ్యారు.
  • జమ్ముకశ్మీర్​లో తాజాగా 1,013 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 17 మంది మృతిచెందారు.

రికవరీ రేటు...

దేశవ్యాప్తంగా కొవిడ్​ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 32 లక్షల మందికి పైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 77.31శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.7శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

5 కోట్లకు చేరువలో కరోనా పరీక్షలు

దేశవ్యాప్తంగా వైరస్​ నిర్ధరణ పరీక్షల సంఖ్య 5 కోట్లకు చేరువైనట్లు అధికారులు వెల్లడించారు. రోజూ నిర్వహిస్తున్న పరీక్షల సామర్థ్యం 11.70లక్షలకు పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 7.20 లక్షల మందికిపైగా పరీక్షించినట్లు సమాచారం.

ఇదీ చూడండి:యాంటీబాడీలు ఉన్నా కరోనా నుంచి రక్షణ కష్టమే!

Last Updated : Sep 7, 2020, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details