రాజస్థాన్లో మరో 127 కరోనా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 1478కి పెరిగింది. మరో ఇద్దరు మరణించగా.. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 23కు చేరింది.
రాజస్థాన్లో మరో 127 కరోనా కేసులు.. రెండు మరణాలు - కరోనా వైరస్
22:01 April 19
21:59 April 19
ఫ్రాన్స్లో కరోనా మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరో 395 మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 19 వేల 718కి చేరింది. కొత్తగా 785 కేసులే నమోదుకావడం గమనార్హం.
20:37 April 19
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రికార్డుస్థాయిలో ఇవాళ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 552 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబయిలోనే 456 కేసులు బయటపడ్డాయి.
20:24 April 19
గుజరాత్లో 68 మరణాలు
గుజరాత్లో కరోనాకాటుకు 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 మృతుల సంఖ్య 68కి చేరింది.
20:19 April 19
బుకింగ్స్ ఆపండి
విమానయాన సంస్థలు బుకింగ్స్ ఆపాలని ఆదేశించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). మే 4 నుంచి ఎయిర్ ఇండియా బుకింగ్స్ ప్రారంభించిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
20:09 April 19
కొవిడ్-19 డాష్ బోర్డు
కొవిడ్-19ను ఎదుర్కోవడానికి మానవ వనరుల ఆన్లైన్ డేటా పూల్ను ప్రారంభించింది కేంద్రం. కరోనాను ఎదుర్కొనే క్రమంలో జిల్లాలు, రాష్ట్రాల వారీ డాష్ బోర్డు ఏర్పాటు చేసింది. వివిధ కార్యకలాపాలకు మానవ వనరుల అవసరం ఉన్న నేపథ్యంలో డాష్ బోర్డు ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది.
19:24 April 19
- దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమర్థ అమలుకు సైనిక బలగాలు దింపాలని పిటిషన్
- లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని సుప్రీంకోర్టులో కమలాకర్ షెనోయ్ పిటిషన్
- దేశంలో వైద్య సిబ్బంది, పోలీసులపై దాడులు జరుగుతున్నాయన్న పిటిషనర్
- మే 3 వరకు జనాలు గుమికూడకుండా ఆర్మీ రంగంలోకి దించేలా అదేశాలివ్వాలన్న పిటిషనర్
19:17 April 19
బ్రిటన్లో 16వేలు
బ్రిటన్లో కరోనా మృత్యుఘోష ఆగట్లేదు. ఇవాళ ఒక్కరోజే 596 కొత్త కేసులు గుర్తించినందున దేశవ్యాప్తంగా కొవిడ్-19 మరణాలు 16,060కి చేరుకున్నాయి. మొత్తం 120,067 మంది వైరస్ బారినపడ్డారు.
19:11 April 19
తమిళనాడులో 105 కొత్త కేసులు
తమిళనాడులో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇవాళ 105 కొత్త కేసులు గుర్తించినందున.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1477కు చేరింది.
ధారావిలో 20 కొత్త కేసులు
అటు ముంబయిలోని ధారావిలో 20 కొత్త కేసులను గుర్తించారు అధికారులు.
19:03 April 19
పార్లమెంట్ ఉభయసభల సెక్రటేరియట్లలో కార్యకలాపాలు షురూ
రేపటి నుంచి పార్లమెంట్ ఉభయసభల సెక్రటేరియట్లలో పాక్షికంగా కార్యకలాపాలు పునఃప్రారంభంకానున్నాయి. 25 శాతం మంది ఉద్యోగులతో పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. మే చివరి వారంలో సెక్రటేరియట్ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు.
18:50 April 19
దేశంలో 16,116 కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 519కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నూతన కేసులు కూడా పెరిగినందున కొవిడ్-19 మొత్తం కేసుల సంఖ్య 16,116కు పెరిగినట్లు పేర్కొంది. ఇందులో 13,295 యాక్టివ్ కేసులుండగా.. 2302 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
18:11 April 19
ఐకమత్యంతో..
ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్కు జాతి, కుల, మత, రంగు వంటి భేదాలు లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అందువల్ల కరోనాపై పోరులో దేశ ప్రజలు ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. ఇకపై భారత్ చేపట్టే చర్యలు.. ప్రపంచ దేశాలు ప్రశంసించే విధంగా ఉండాలన్నారు. దేశప్రజలతో పాటు యావత్ మానవాళి.. భారత్ చర్యల వల్ల సానుకూల దృక్పథం పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
17:54 April 19
కరోనా వైరస్ మానసికంగానూ ప్రభావం చూపిస్తోంది. దిల్లీలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. కరోనా పాజిటివ్ వచ్చిందని దిల్లీలోని సఫ్తార్ గంజ్ ఆస్పత్రి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అక్కడి సిబ్బంది స్పందించి అతడిని కాపాడారు.
17:48 April 19
పాకిస్థాన్లో 514 మందికి కరోనా
కరోనా వైరస్ పాకిస్థాన్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో 514 కొత్త కేసులు నమోదైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,993కి చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు మొత్తం 159 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది
17:14 April 19
యువత మార్గనిర్దేశం చేయగలదు
ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో.. ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన భవిష్యత్కు శక్తిమంతమైన, వినూత్నంగా ఆలోచించే భారత యువత మార్గ నిర్దేశం చేయగలదని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
17:08 April 19
యూపీలో కొత్తగా 110 కేసులు
ఉత్తర్ప్రదేశ్లో కొత్తగా మరో 110 కేసులు బయటపడినందున రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1000 దాటింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17 మంది మరణించారు.
16:41 April 19
గోవాలో కేసుల్లేవ్..
గోవా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సున్నాకు చేరినట్లు ఆ రాష్ట అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఆరుగురికి వైరస్ సోకగా.. వారందరూ కోలుకున్నట్లు వెల్లడించారు.
16:16 April 19
- వైద్య బృందాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించాలి: కేంద్రం
- వ్యాక్సిన్ అభివృద్ధికి చర్యలు ముమ్మరం చేశాం: కేంద్రం
- వ్యాక్సిన్ అభివృద్ధి పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు: కేంద్రం
- నిబంధనల ప్రకారమే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి: కేంద్రం
- గడిచిన 28 రోజుల్లో పుదుచ్చేరి, కొడగులో కొత్తగా కేసులు నమోదు కాలేదు: కేంద్రం
- కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవు: కేంద్రం
- కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని రకాల మినహాయింపులు: కేంద్రం
- పారిశ్రామిక ఉత్పత్తి నిలిచిపోకూడదని భావిస్తున్నాం: కేంద్రం
- ఇప్పటివరకు 3,86,971 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు: కేంద్రం
- 54 జిల్లాల్లో రెండు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదు: కేంద్రం
15:52 April 19
ఇవాళ ఒక్కరోజే 410 మంది
కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న స్పెయిన్లో రోజువారీ మరణాల సంఖ్య ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. రోజూ 500 మందికిపైగా మృత్యువాత పడుతుండగా.. ఇవాళ 410 మంది మాత్రమే మరణించారు. అయితే కేసులు మాత్రం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 4,218 కొత్త కేసులు గుర్తించారు అధికారులు. దీంతో స్పెయిన్ వ్యాప్తంగా మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది.
15:45 April 19
మాస్క్ లేదా.. అయితే పెట్రోల్ కూడా లేదు
కొవిడ్-19 వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమవంతు సాయం చేస్తున్నారు దిల్లీలోని మయూర్ విహార్ ఫేస్-1లోని ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ అధికారులు. వాహనదారులు మాస్క్ వేసుకోకపోతే.. బండికి పెట్రోల్ పట్టమని చెబుతున్నారు.
14:57 April 19
దేశవ్యాప్తంగా నిర్బంధ కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నవారు అక్కడే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు మాత్రం వెళ్లేందుకు అనుమతిచ్చింది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లేందుకు కార్మికులకు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేసింది.
- వలస కూలీల విషయంలో మరోసారి మార్గదర్శకాలు జారీ చేసిన హోం మంత్రిత్వ శాఖ.
- ప్రస్తుతం క్యాంపుల్లో తలదాచుకున్న వారిని స్వస్థలాలకు, పని ప్రదేశాలకు అనుమతించే విషయంపై స్పష్టత ఇచ్చిన కేంద్రం
- స్వరాష్ట్రంలో వారికి మాత్రం పని ప్రదేశాలకు వెళ్లేందుకు తగిన జాగ్రత్తలతో అనుమతించవచ్చని పేర్కొన్న
- రాష్ట్రం దాటి వెళ్లేందుకు అనుమతులు లేవని ఆదేశాలు ఇచ్చిన కేంద్రం.
- క్యాంపుల్లో ఉన్న వారి వివరాలు, ఏ పని చేయగలుగుతారో నమోదు చేయాలని సూచన.
- అవకాశం ఉంటే... వారికి క్యాంపు సమీపంలో వారు చేయదగిన పని ఉంటే చేయవచ్చని సూచించవచ్చు.
- స్వరాష్ట్రంలో పని ప్రదేశాలకు తరలించే సందర్భంలో... ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పించి.. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు విడుదల చేసిన హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
- ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ పంపిన హోం శాఖ కార్యదర్శి
14:02 April 19
జీవితకాలంలోనే అతిపెద్ద యుద్ధం...
కంటికి కనపడని శత్రువుతో జరుగుతున్న ఈ పోరాటం... జీవితకాలంలోనే అతిపెద్ద యుద్ధమని రక్షణమంత్రి రాజ్నాథ్ అభిప్రాయపడ్డారు. మానవాళి మనుగడకు వ్యతిరేకంగా ఈ యుద్ధం జరుగుతోందన్నారు.
అయితే కరోనాపై పోరులో భారత ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపారు రాజ్నాథ్. వైద్య సదుపాయాలు, సమాచారం, సరకు పంపిణీ వ్యవస్థల్లో రక్షణశాఖ నైపుణ్యాన్ని వినియోగిస్తున్నట్టు వెల్లడించారు.
13:51 April 19
మహారాష్ట్రలో ఇలా...
రాష్ట్రంలో ఇప్పటివరకు 66వేలకుపైగా కరోనా పరీక్షలు జరిగినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. వీరిలో 95శాతం మందికి వైరస్ నెగటివ్గా తేలిందన్నారు. దాదాపు 3,600 మందికి వైరస్ సోకిందన్నారు. వీరిలో 52మంది ప్రాణాలు విషమంగా ఉన్నట్టు తెలిపిన ఉద్ధవ్.. వారి రక్షించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు.
13:41 April 19
పింఛనులో కోత లేదు...
కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఉద్యోగుల పింఛనులో ఎలాంటి కోత విధించబోమని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసింది.
13:15 April 19
మే 3వరకు ఉద్యోగులకు సెలవులు
లాక్డౌన్ కారణంగా విమాన సర్వీసులన్నీ రద్దయినందున.. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేమని గోఎయిర్ స్పష్టం చేసింది. అందుకే మే 3 వరకు ఉద్యోగులందరికీ జీతాలు లేని సెలవులు (లీవ్ వితౌట్ పే) ఇస్తున్నట్లు వెల్లడించింది.
12:54 April 19
44 కొత్త కేసులు
మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో ఇవాళ కొత్తగా 44 కరోనా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా జిల్లాలో కొవిడ్-19 కేసుల సంఖ్య 364కు పెరిగింది.
12:43 April 19
వార్డెన్కు కరోనా..
హరియాణాలోని భోండ్సీ జైలు వార్డెన్కు కరోనా పాజిటివ్గా తేలింది. సదరు వ్యక్తి తన ఇంటి నుంచి తిరిగి జైలుకొచ్చిన అనంతరమే వైరస్ పాజిటివ్గా తేలినట్లు అధికారులు తెలిపారు. అయితే అతనితో ఎవరూ సన్నిహితంగా మెలగలేదని స్పష్టం చేశారు.
12:25 April 19
దిల్లీలో లాక్డౌన్పై మినహాయింపులేదు
దిల్లీలో లాక్డౌన్పై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రంలో లాక్డౌన్ నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. వారం తర్వాత పరిస్థితి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్న ఆయన.. దిల్లీని సురక్షిత ప్రాంతంగా ఉంచడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు.
12:21 April 19
'పునరుద్ధరణా.. ఇంకా ఏమీ నిర్ణయించలేదు'
విమాన సేవల పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దేశంలో మే 4 నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియా శనివారమే బుకింగ్స్ ప్రారంభించింది. జూన్ 1 నుంచి అంతర్జాతీయ సేవలు కూడా పునరుద్ధరించనున్నట్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
11:49 April 19
గుజరాత్లో 58కి చేరిన మృతులు
గుజరాత్లో కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో మరో ఐదుగురు ఈ మహమ్మారి బారినపడి మరణించారు. ఫలితంగా గుజరాత్లో కొవిడ్-19 మృతుల సంఖ్య 58కి చేరింది.
గుజరాత్లో ఇవాళ కొత్తగా మరో 228 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వైరస్ కేసులు 1604కు చేరాయి. ఒక్క అహ్మదాబాద్లోనే వెయ్యి దాటడం గమనార్హం.
11:46 April 19
అనవసరమైన వాటి సరఫరాపై నిషేధం
ఈ-కామర్స్ సంస్థల నుంచి అనవసర వస్తువుల సరఫరాపై నిషేధాన్ని యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది కేంద్ర హోంశాఖ.
- ఈ-కామర్స్ సంస్థలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ
-
అత్యవసరంకాని వస్తువుల విక్రయాన్ని నిషేధించిన కేంద్రం
గత మార్గదర్శకాల్లో మొబైల్ ఫోన్స్, టీవీ ఆన్లైన్ విక్రయాలకు అనుమతి - ఏప్రిల్ 20 తర్వాత నిత్యావసరాల సరఫరాకు మాత్రమే అనుమతి
11:07 April 19
దిల్లీలో 1,893కు చేరిన కేసులు
దిల్లీలో కరోనా కేసులు 1893కు చేరుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 186 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఒకవారంలో 42వేల మందికి కరోనా పరీక్షలు చేయడమే లక్షంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.
10:53 April 19
కరోనాతో 45రోజుల చిన్నారి మృతి
దిల్లీలో కరోనాతో 45రోజుల చిన్నారి మృతి చెందింది. మహమ్మారి సోకి మృతి చెందిన వారిలో అత్యంత తక్కువ వయస్సు ఈ చిన్నారిదే..
10:34 April 19
రాజస్థాన్లో మహమ్మారికి మరొకరు బలి
రాజస్థాన్లో కరోనాతో మరొకరు మృతి చెందారు. అలాగే మరో 44మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 22కు చేరగా.. కేసులు 1395కు పెరిగాయి.
10:26 April 19
నాగపుర్లో మరో 9మందికి కరోనా
మహారాష్ట్ర నాగపుర్లో మరో తొమ్మిది మందికి కరోనా సోకింది. దీంతో నాగపుర్లో కేసుల సంఖ్య 72కు చేరింది.
09:59 April 19
ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు నర్సులకు కరోనా పాజిటివ్
దిల్లీలో లేడీ హార్డింగ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు నర్సులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ఈ నేపథ్యంలో వారితో కలిసి పనిచేసిన సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. వారితో సంబంధం ఉన్న ఇతరులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
08:55 April 19
భారత్లో 500 దాటిన కరోనా మృతుల సంఖ్య
దేశంలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,334 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.
- మొత్తం కేసులు: 15,712
- యాక్టివ్ కేసులు: 12,974
- మరణాలు: 507
- కోలుకున్నవారు: 2,230
- వలస వెళ్లిన వారు: 1