దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాపకింద నీరుగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళల్లో విపరీతంగా ఈ అంటువ్యాధి ప్రబలుతోంది.
400 దాటిన కేసులు...
మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 416కి చేరుకుంది. తాజా కేసుల్లో ముంబయిలోనే 57 ఉన్నాయి.
ఇప్పటివరకు మహారాష్ట్రలో 19 మంది కరోనాతో మరణించగా, 42 మంది ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్.. రాష్ట్రంలోని 30 ప్రభుత్వ ఆసుపత్రులకు కొవిడ్-19 ఆసుపత్రులుగా ప్రకటించింది. వీటిలో మొత్తం 2,305 పడకలు అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
తమిళనాడులో 75..
దేశంలో మహారాష్ట్ర తర్వాత అంతగా కరోనా వ్యాపిస్తున్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ఇవాళ అక్కడ కొత్తగా 75 మంది బాధితులు చేరారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 309కి చేరింది.
ఇవాళ నమోదైన 75 కరోనా కేసుల్లో 74 మంది.. ఇటీవల దిల్లీ నిజాముద్దీన్లో జరిగి తబ్లీగీ ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారేనని ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్ తెలిపారు.
దిల్లీ:
నిజాముద్దీన్ తబ్లీగీ తరువాత దేశరాజధాని దిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 208 మంది కరోనా బారిన పడగా, వీరిలో 108 మంది మర్కజ్కు వెళ్లినవారే. ఇక్కడ ఇద్దరు కరోనాతో మరణించగా... ఆరుగురు కోలుకున్నారు.
కేరళలో..
కేరళలో ఇవాళ తాజాగా 21 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం యాక్టివ్ కేసులు 256కి చేరుకున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేరళలో ఇప్పటి వరకు కరోనాతో ఇద్దరు మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు.