వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టానికి చాపచుట్టేయాల్సిందేనంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరిస్తున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు పౌరసత్వ (సవరణ) బిల్లు రాజ్యసభామోదం పొంది చట్టరూపం దాల్చితే తమ గతేమిటన్న భయసందేహాలతో ఈశాన్య భారతం అట్టుడికింది. పదహారో లోక్సభ కాలగర్భంలో కలసిపోవడంతో బిల్లు మురిగిపోయిందని సంతసించే లోగానే అది కాస్తా పదిహేడో పార్లమెంటు ఉభయ సభల్లో భారీ మెజారిటీతో నెగ్గి చట్ట రూపం దాల్చేయడంతో- రాగల సంక్షోభాన్ని రెండు కోణాల్లో వీక్షిస్తూ అటు ఈశాన్యం, ఇటు తక్కిన దేశం తీవ్రాందోళన చెందుతున్నాయి. అక్రమ వలసదారుల ఏరివేత లక్ష్యంగా అసోమ్లో చేపట్టిన జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) కసరత్తు ఫలితాల్ని పౌరసత్వ (సవరణ) చట్టం కొరగాకుండా చేసి కొత్త వలసలకూ అది లాకులెత్తే ప్రమాదం ఉందని ఈశాన్యం భీతిల్లుతోంది. లోగడ కశ్మీర్ తరహాలో భూ క్రయ విక్రయాలు ‘భూమి పుత్రుల’ మధ్యే జరిగేలా అసోమ్ కొత్త చట్టాల్ని రూపొందిస్తుండటానికి కారణం అది.
పౌరసత్వ (సవరణ) చట్టం ద్వారా పాక్, బంగ్లాదేశ్, అఫ్గాన్లనుంచి మతపర విచక్షణకు గురై వలస వచ్చినవారిలో ముస్లిములకు తప్ప తక్కిన వారికి పౌరసత్వం కల్పిస్తామనడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి గండికొట్టే చర్యగా విపక్ష శిబిరంతోపాటు భిన్న పౌర, సామాజిక వర్గాలు భావిస్తున్నాయి. అసోమ్లో జరిగిన పౌర పట్టిక క్రతువును రద్దు చేసి దాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తామనడంతో- పౌరసత్వ (సవరణ) చట్టంలోని విచక్షణాపూరిత ధోరణే అందులోనూ ప్రతిఫలించి, భారతీయులుగా తమ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుందన్న భయాందోళనలు క్రమేణా విస్తరిస్తున్నాయి. పదేళ్లకోమారు విధిగా చేపట్టే జనగణన, దాని వెన్నంటి జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) మార్పుచేర్పుల మహాయజ్ఞం వచ్చే ఏప్రిల్ నుంచి పట్టాలకు ఎక్కనుంది. అందుకోసం కేంద్రమంత్రి వర్గం తాజాగా దాదాపు రూ.12,700కోట్లు కేటాయించింది. జనాభా పట్టికను వెన్నంటే జాతీయ పౌర పట్టిక రూపకల్పనా సాగుతుందన్న అంచనాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తమవుతున్న జనాందోళనను ఉపశమింపజేసేందుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాలి!
ఆరు నిర్బంధ కేంద్రాలు !
పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన సుదీర్ఘ చర్చ సందర్భంగా- పౌరసత్వ (సవరణ) బిల్లు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదన్న కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలకు, విపక్షాల అభ్యంతరాలకు లంగరందలేదు. ఈ రాజ్యాంగ మీమాంస సుప్రీంకోర్టు సముఖానికి చేరినా, తుది నిర్ణయం వెలువడేలోగా- ప్రజానీకంలో పెల్లుబుకుతున్న ఆందోళన సమసిపోయేలా లేదు. ఎన్డీఏ సర్కారు తొలిసారి అధికారం చేపట్టినప్పటినుంచి ఎన్నడూ దేశవ్యాప్త ఎన్ఆర్సీపై చర్చ జరపలేదని, అసోమ్లో కూడా ‘సుప్రీం’ ఉత్తర్వుల కారణంగానే దీన్ని అమలు చేయాల్సి వచ్చిందని మూన్నాళ్ల క్రితం ప్రధాని మోదీ బహిరంగ సభాముఖంగా ప్రకటించారు. అసత్యాలతో ప్రజలను రెచ్చగొట్టి విపక్షాలు విభజించి పాలించే రాజకీయం చేస్తున్నాయనీ విమర్శించారు.