భారత్ జనవరి 26న 71వ గణతంత్ర వేడుకలు జరుపుకోబోతుంది. స్వాతంత్య్రానంతరం స్వయంపరిపాలన కోసం మన రూపొందించుకున్న రాజ్యాంగం.. 70 ఏళ్లు పూర్తిచేసుకోబోతుంది.
ఈ నేపథ్యంలో విశ్రాంత మాజీ ఐఏఎస్ అధికారి వీకే అగ్నిహోత్రితో ఈటీవీ భారత్ మాట్లాడింది. 1968 బ్యాచ్ అధికారి అయిన అగ్నిహోత్రి.. 2007-12లో రాజ్యసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. భారత రాజ్యాంగం బలాలు, బలహీనతలతో పాటు వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఎన్నో ఆశలు, ఆశయాలతో మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ 70 ఏళ్ల కాలంలో వాటిని మనం సాధించుకున్నామా?
రాజ్యాంగం అనేది నా దృష్టిలో ప్రభుత్వ వ్యవస్థను నడిపించే ఒక పత్రం. పార్లమెంటు, న్యాయవ్యవస్థ, కార్యనిర్వహణ శాఖలు సమర్థంగా పని చేసేందుకు కావాల్సిన మార్గదర్శకాలు, ఆశయాలు, సూచనలు పొందుపరిచి ఉంటాయి. మన రాజ్యాంగానికి విస్తృతమైన ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అయినప్పటికీ చాలా విషయాలను సూచించదు. మొదట 395 అధికరణలు ఉండగా వాటి సంఖ్య ప్రస్తుతం 470కి చేరువలో ఉంది. రాజ్యాంగ సభ ఎంతో శ్రమకోర్చి మన రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ 70 ఏళ్లలో ఎన్నో సవరణలను మనం తీసుకొచ్చాం. ఎందుకంటే.. కాలానుగుణంగా మారుతున్న సమాజం, ఆలోచనలు, అవసరాల మేరకు రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. ఒకవేళ కొన్ని సవరణలు, చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తితో లేనట్లయితే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని వాటిని మార్చాలని శాసన వ్యవస్థకు ఆదేశాలు ఇస్తుంది.
ఎప్పటికప్పుడు మార్పు కోరుకునే కారణంతోనే మన రాజ్యాంగాన్ని సజీవ పత్రంగా పిలుస్తారా?
అవును.. భారత రాజ్యాంగం సజీవ పత్రం. ఏదైనా కఠిన నిబంధనను సడలించాలంటే.. రాజ్యాంగాన్ని మార్చకుండా అధికరణను సవరిస్తే సరిపోతుంది. ఉదాహరణకు అధికరణ 370. ఆ సమయంలో రాజ్యాంగాన్ని సవరించలేదు. అయితే అన్నింటికి ఇదే సూత్రం వర్తించదు. కొన్ని సవరణలకు ద్విసభలు వేర్వేరుగా ఆమోదించాలి. మరికొన్ని సవరణలకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం లభించాలి.
అయినప్పటికీ మన రాజ్యాంగం ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ తరహాలో కఠినమైనది కాదు. అక్కడి తరహాలో భారత రాజ్యాంగ సవరణకు ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు. అమెరికాలోనూ ప్రతి సవరణకు ద్విసభల ఆమోదం తర్వాత 75 శాతం రాష్ట్రాలు ఆమోదించాలి. కానీ మనం సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే సరిపోతుంది. ఉదాహరణకు.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పొడగించేందుకు 104 సవరణ చేశారు. అధికరణ 334ను 10 ఏళ్లు పొడగించేందుకు పార్లమెంటుతో పాటు రాష్ట్రాల ఆమోదమూ అవసరమైంది. ఇప్పటికీ ఈ బిల్లు పెండింగ్లోనే ఉంది. రాజ్యాంగ సవరణలన్నింటికీ అంత సులువుగా ఆమోదం లభించదు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సుమారు 60 రిట్లు దాఖలయ్యాయి. అందులో ఎక్కువ శాతం సీఏఏ రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కును ఉల్లంఘించారని ప్రశ్నించినవే. ఈ విషయాన్ని మీరు ఎలా పరిగణిస్తారు?
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంలో భాగం కాదు. ఇది సాధారణ శాసనం కావటం వల్ల దాన్ని సవరించారు. సీఏఏ అనేది రాజ్యాంగానికి సవరణ కాదు. కానీ ప్రాథమికంగా రెండు కారణాలతో ఈ చట్టానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి లౌకికవాదం.. ఎందుకంటే ఈ చట్టంలో ముస్లింలను మినహాయించారు. రెండోది సమానత్వపు హక్కు. చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం ప్రకటిస్తుంది.
అయితే ఈ విషయంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే.. ప్రభుత్వం, పార్లమెంటు అన్ని చట్టాలను పరిగణనలోకి తీసుకునే సవరణను తీసుకొచ్చాయి. పార్లమెంటు ఆమోదం పొందిన చట్టాన్ని రాజ్యాంగ చట్రంలోకి వస్తుందా? లేదా? అని పరిశీలించాల్సిన పని న్యాయవ్యవస్థకు ఉంటుంది. చట్టం చెల్లదని న్యాయస్థానం నిర్ధరించే వరకు దానిని అమలు చేయమని రాష్ట్రాలకు చెప్పే అధికారం లేదు.
అధికరణ 246 ప్రకారం కొన్ని చట్టాలను రాష్ట్రాలు అమలు చేయలేమని చెప్పవచ్చు. కానీ పౌరసత్వమనే అంశం కేంద్ర జాబితాలోనిది. అందువల్ల పౌరసత్వ నిబంధనలను సవరించే పూర్తి అధికారం పార్లమెంటుకే ఉంది.
రెండోది.. అధికరణ 256 ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేసేందుకు కట్టుబడి ఉండాలి. అందువల్ల చట్టాన్ని అమలు చేయలేమని రాష్ట్రాలకు చెప్పే అధికారం లేదు. అప్పుడు అధికరణ 365 ప్రకారం.. పార్లమెంటు చేసిన చట్టాలు రాష్ట్రాలు అమలు చేయకపోతే.. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన విఫలమైనట్టుగా గుర్తిస్తారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో అధికరణ 356తో రాష్ట్రపతి పాలనను విధిస్తారు.