తెలంగాణ

telangana

కాంగ్రెస్​ పగ్గాలు ఎవరికి? నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ

By

Published : Aug 24, 2020, 5:24 AM IST

దశాబ్దాల చరిత్రగల కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యువనేత రాహుల్​ గాంధీకే తిరిగి కాంగ్రెస్​ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పార్టీలోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. సోనియాగాంధీయే ఆ పదవిలో కొనసాగాలని కొందరు నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న సీడబ్ల్యూసీ భేటీకి ప్రాధాన్యం సంతరించకుంది. పార్టీ అధిష్ఠానం ఏదైనా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందేమో అనే ఉత్కంఠ నెలకొంది.

congress cwc to meet today to decide new parties new chief
కాంగ్రెస్​ పగ్గాలు ఎవరికి? నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ

కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ముదిరి పాకాన పడింది. పార్టీ నాయకత్వంపై గుంభనంగా ఉన్న గళాలు బయటకు వస్తున్నాయి. పగ్గాలను క్రియాశీలక నేత చేతికి ఇవ్వాలని నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తన వయోభారం దృష్ట్యా తాత్కాలిక అధ్యక్షురాలి బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు సోనియాగాంధీ ప్రకటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అందరి దృష్టి సోమవారం జరగనున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంపైనే ఉంది. రాహుల్‌ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపడతారా? పార్టీ అధిష్ఠానం ఏదైనా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. దశాబ్దాల చరిత్ర గల పార్టీ.. నాయకత్వ లోపంతో దేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గాంధీ కుటుంబం చేతిలోనే పగ్గాలు ఉండాలని ఒక వర్గం పట్టుపడుతోంది. అందులోనూ సోనియాగాంధీయే ఆ పదవిలో కొనసాగాలని కొందరు, యువనేత రాహుల్​నే అధ్యక్షుణ్ని చేయాలని మరికొందరు గళమెత్తుతున్నారు. వారిద్దరూ విముఖతను వీడకపోయినట్లయితే ఉమ్మడిగా నాయకత్వ బాధ్యతల్ని ఒక బృందానికి అప్పగించాలనే వాదనా ఉంది. ఏఐసీసీ సమూల ప్రక్షాళనను కోరుతూ కొందరు కేంద్ర మాజీ మంత్రులు సహా 23 మంది నేతలు సోనియాగాంధీకి రెండు వారాల క్రితం రాసిన లేఖ పార్టీలో ప్రధాన చర్చనీయాంశమైంది.

ఆదివారం ఈ లేఖ బయటకు వచ్చింది. కాంగ్రెస్‌ పునరుద్ధరణకు చేపట్టాల్సిన ఐదు అంశాలను నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ దయనీయ పరిస్థితిపై, కాంగ్రెస్‌కు యువత దూరమవుతున్న తీరుపై వారు ప్రశ్నల వర్షం కురిపించారు. చిత్తశుద్ధితో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బ్లాక్‌ నుంచి సీడబ్ల్యూసీ వరకు అన్ని స్థాయిల్లో పార్టీకి అంతర్గత ఎన్నికలు నిర్వహించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పార్టీలో క్రియాశీల నాయకత్వ ఆవశ్యకతను వివరించారు. దానిపై సంతకాలు చేసిన వారిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, సీనియర్‌ నేతలు ఆనంద్‌ శర్మ, కపిల్‌ సిబల్‌, మనీశ్‌ తివారీ, శశిథరూర్‌, జితిన్‌ ప్రసాద, వీరప్ప మొయిలీ, సందీప్‌ దీక్షిత్‌, ప్రమోద్‌ తివారీ, పీజే కురియన్‌, రేణుకా చౌదరి, మిలింద్‌ దేవ్‌రా వంటివారు ఉన్నారు. సోనియా-రాహుల్‌లపై ఎవరూ ప్రత్యక్షంగా విమర్శలు చేయనప్పటికీ.. పార్టీ హైకమాండ్‌పై తమ అసంతృప్తి, అవిశ్వాసాన్ని అందులో వెలిబుచ్చినట్లు తెలుస్తోంది.

చర్చ జరగాలి... పరిష్కారం కావాలి..

లేఖలో ఉన్న అన్ని అంశాలకూ అందరూ అంగీకరించినట్టు కాదని, నాయకత్వ లోపంపై కచ్చితంగా చర్చ జరిగి, ఓ పరిష్కారాన్ని కనుక్కోవాలని తామందరూ భావిస్తున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని నేత ఒకరు పేర్కొన్నారు. ఇంతవరకు మౌనంగా ఉన్న సోనియాగాంధీ ఆదివారం ఈ లేఖపై రాతపూర్వకంగా స్పందిస్తూ.. బాధ్యత నుంచి వైదొలగేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా మాత్రం దీనిని తోసిపుచ్చారు.

రాహుల్‌ ఉండాల్సిందే..

రాహుల్‌కు సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు సీడబ్ల్యూసీకి లేఖ రాసి, ఆయన్నే పార్టీ అధ్యక్షుడిని చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ డిమాండ్లు కూడా భేటీలో బలంగా వినిపించే అవకాశముంది. కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి చల్లా వంశీ చంద్‌ రెడ్డి.. సీడబ్ల్యూసీ సభ్యులకు లేఖ రాశారు. రాహుల్‌ గాంధీని అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవాలని డిమాండ్‌ చేశారు. గాంధీ కుటుంబానికి చెందిన వారే ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని.. వారే శాశ్వత అధ్యక్షులుగా కొనసాగాలని సీనియర్‌ నేత వి.హన్మంతరావు అభిప్రాయపడ్డారు. దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక పీసీసీల నుంచి, ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొందరు నేతల నుంచీ ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయి. గాంధీల కుటుంబ నాయకత్వమే అవసరమని చెప్పినవారిలో పంజాబ్‌తో పాటు, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు- అధీర్‌ రంజన్‌ చౌధురి, అశ్వనీకుమార్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, కె.కె.తివారీ వంటివారు ఉన్నారు. సీడబ్ల్యూసీ భేటీని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నారు.

తాత్కాలిక సభ్యులకు ఆహ్వానం అందుకేనా?

ఈసారి భేటీలో సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులతో పాటు తాత్కాలిక సభ్యులూ పాల్గొంటారు. కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పీసీసీల అధ్యక్షులు, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతలు సీడబ్ల్యూసీలో తాత్కాలిక సభ్యులుగా ఉంటారు. వీరిలో అత్యధికులు.. రాహుల్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమితులైన వారే. వీరిని భేటీకి ఆహ్వానించటమంటే రాహుల్‌ను బలపరిచే వారి సంఖ్యను పెంచి.. పార్టీ పగ్గాలు చేపట్టేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దిల్లీ వచ్చిన సమయంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది.

సంస్థాగత ప్రక్షాళన అవసరం

అధికారాలను వికేంద్రీకరించి, పీసీసీలను శక్తిమంతం చేయాలని, దీంతోపాటు ఐదు దశాబ్దాల క్రితం ఉన్న మాదిరిగా కేంద్ర పార్టీమెంటరీ బోర్డును నెలకొల్పాలని నేతలు లేఖలో కోరినట్లు సమాచారం. గాంధీ కుటుంబాన్ని అంతర్గత భాగంగానే ఉంచి, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని ఆ నేతలు ప్రతిపాదించారు. తాత్కాలిక ప్రాతిపదిక కాకుండా పూర్తిస్థాయి నేత పార్టీకి సారథిగా ఉండాలని, పార్టీ శ్రేణులకు ఆ నేత అందుబాటులో ఉండాలని వారు స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఇలాంటి లేఖను రాయడంలో ఔచిత్యమేమిటని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రశ్నిస్తున్నారు. నాయకత్వాన్ని మార్చాలనడం ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా!

ABOUT THE AUTHOR

...view details