నోట్లరద్దు సమయంలో అహ్మదాబాద్లోని ఓ భాజపా నేత 40 శాతం కమిషన్ తీసుకుని నగదు మార్పిడీ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. దీనికి సంబంధించిన 30 నిమిషాల నిడివి గల వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు.
"అక్కడ జరిగిన లావాదేవి ఏంటంటే... రూ.5కోట్ల విలువ చేసే పాత 500ల నోట్లిస్తే వాటికి బదులుగా 3కోట్లకు సరిపడా కొత్త 2వేల నోట్లను ఇచ్చారు. సంప్రదింపులు ఒక హోటల్లో జరిగాయి. 40 శాతం కమిషన్ ఎక్కువని ఎదుటి వ్యక్తి అడిగితే తనపైనున్న కీలక వ్యక్తులకే ఎక్కువ చెల్లించాలని చెప్పారు. ఈ సంఘటన 2016 డిసెంబరు 31 తర్వాత జరిగింది.. అప్పటికి నోట్ల మార్పిడి లేదు. రూ.2వేల నోట్ల కట్టలు వారికి ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు తీసుకొచ్చారు. ఏ బ్యాంకు నుంచి వచ్చాయి. అవి రిజర్వు బ్యాంకు డబ్బు అయితే వాటిని దొంగిలించిందెవరు. దొంగ ఎవరు? కాపలాదారు ఎవరు? దేశ భక్తులెవరు? దేశ ద్రోహులెవరు? ప్రజలకు తెలియాలి"
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
నోట్ల రద్దు సమయంలో దేశ వ్యాప్తంగా భాజపా నేతలంతా ఇదే తరహా అక్రమాలకు పాల్పడ్డారని సిబల్ ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకొని పార్టీకి నిధులు సమకూర్చారని అన్నారు.
మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియోను ధ్రువీకరించేందుకు నిరాకరించారు సిబల్. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వివరాలు బహిర్గతం అయినందు వల్ల ఎవరైనా నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించవచ్చని సూచించారు.