తెలంగాణ

telangana

కమల్​నాథ్​ రాజీనామా- ఎంపీలో ఇక కమలం సర్కార్​!

By

Published : Mar 20, 2020, 1:33 PM IST

Updated : Mar 20, 2020, 2:53 PM IST

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు ప్రకటించారు. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు తమకు అవకాశం కల్పిస్తే... వారి ఆశలను భాజపా వమ్ము చేసిందని కమల్​నాథ్​ విమర్శించారు.

CM Kamal Nath: I have decided to tender my resignation to the Governor today.
కమల్​నాథ్​ రాజీనామా- ఎంపీలో ఇక భాజపా సర్కార్!

మధ్యప్రదేశ్‌లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం కమల్​నాథ్​ తన పదవికి రాజీనామా చేశారు. ప్రజల నమ్మకాలను భాజపా దెబ్బకొట్టిందని భోపాల్​లో మీడియా సమావేశంలో ఆరోపించారు కమల్​నాథ్​.

కమల్​నాథ్​ రాజీనామా- ఎంపీలో ఇక భాజపా సర్కార్!

"15 నెలల పాటు రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడి పనిచేశాం. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. 2018 డిసెంబరులో మా ప్రభుత్వం ఏర్పడింది. మెజార్టీ స్థానాలు గెలుచుకుని మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ రైతులు మాపై ఎంతో విశ్వాసం ఉంచారు. వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాం, 20లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ప్రజల విశ్వాసానికి అనుకూలంగా పరిపాలించాలని భావించాం. కానీ, మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రజల నమ్మకాన్ని భాజపా వమ్ము చేసింది. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక కుట్రలు పన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పనిచేయడం భాజపాకు నచ్చలేదు."

- కమల్‌నాథ్‌

తీవ్ర ఉత్కంఠ...

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తగిన సంఖ్యాబలం లేకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్టు కమల్‌నాథ్‌ ప్రకటించారు. అనంతరం గవర్నర్​ లాల్జీ టాండన్​కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు కమల్​నాథ్. గత రెండు వారాలుగా మధ్యప్రదేశ్​లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య విలువల్ని బలహీనపరిచాయని లేఖలో ఆయన పేర్కొన్నారు. కమల్​నాథ్​ రాజీనామాతో రాష్ట్రంలో భాజపా సర్కార్​ కొలువుతీరేందుకు మార్గం సుగమం అయింది.

సంక్షోభం...

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం వల్ల ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో మొదట ఆరుగురి రాజీనామాల్ని స్పీకర్‌ ప్రజాపతి ఇప్పటికే ఆమోదించారు.

అయితే బలపరీక్ష వెంటనే నిర్వహించాలంటూ భాజపా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బల పరీక్ష నిర్వహించేందుకు శుక్రవారం 5 గంటల వరకు డెడ్‌లైన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

గురువారం మరో 16 మంది రాజీనామాల్ని స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించారు. ఈరోజు ఒక భాజపా ఎమ్మెల్యే రాజీనామాకు స్పీకర్​ ఆమోదముద్ర వేశారు.

లెక్కల వివరాలు...

సంక్షోభానికి ముందు 230 శాసనసభ స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 228 మంది ఎమ్మెల్యేలుండేవారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 22 మంది కాంగ్రెస్​, ఒక భాజపా ఎమ్మెల్యే రాజీనామాలు స్పీకర్‌ ఆమోదం పొందడం వల్ల శాసనసభ్యుల సంఖ్య 205కు చేరింది. బలపరీక్షలో ఏ పార్టీ నెగ్గాలన్నా 103 మంది ఎమ్మెల్యేలు అవసరం. భాజపాకు 106 మంది సంఖ్యా బలం ఉంది. గతంలో 114 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్‌ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో 92కు చేరింది. మరో ఏడుగురు ఇతర పార్టీల సభ్యులు ఉన్నారు.

Last Updated : Mar 20, 2020, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details