తెలంగాణ

telangana

మిషన్​ 2022: సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ!

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. గత రెండు లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలు యువకిరణం ప్రియాంక గాంధీ వైపు చూస్తున్నారు. దేశంలో కాంగ్రెస్​ పునరుద్ధరణ ఉత్తర్​ప్రదేశ్ ​నుంచే ప్రారంభం కావాలని, ప్రియాంకను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

By

Published : Jul 5, 2020, 3:16 PM IST

Published : Jul 5, 2020, 3:16 PM IST

Updated : Jul 5, 2020, 3:38 PM IST

Clamour grows in Congress to declare Priyanka Gandhi as UP CM candidate
'ప్రియాంకను యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సిందే!'

1989..ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ అధికారానికి దూరమైన ఏడాది. మూడు దశాబ్దాలు దాటాయి. అధికారం కాదు కదా... ప్రధాన ప్రతిపక్షంగా అయినా నిలవలేని దుస్థితి. ఈ పరిస్థితి మారేదెలా? యోగి ఆదిత్యనాథ్​ వంటి శక్తిమంతమైన నేతను ఎదుర్కొనేదెవరు? యూపీ కోటపై జెండా ఎగరేసి... దిల్లీ పీఠానికి బాటలు పరిచేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్న సమాధానం... ప్రియాంక గాంధీ.

కేంద్రం నోటీసులతో మళ్లీ...

ఉత్తర్​ప్రదేశ్​ శాసనఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్లు సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశంపై కాంగ్రెస్​లో చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది.

ప్రియాంక పేరు ఈ సమయంలో ఇంతలా మార్మోగడానికి ప్రధాన కారణం... కేంద్రప్రభుత్వం ఇచ్చిన నోటీసులు. దిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది మోదీ సర్కార్. ఈ నేపథ్యంలో ఆమె లఖ్​నవూకు మకాం మార్చుతారన్న వార్తలు వెల్లువెత్తాయి.

నిజానికి మార్చిలోనే తన నివాసాన్ని యూపీకి మార్చాలని ప్రియాంక ప్రణాళికలు వేసుకున్నట్లు పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కానీ లాక్​డౌన్​ వల్ల వాయిదా పడిందని అంటున్నాయి.

పట్టుకోసం ఆశ

1989 నుంచి యూపీలో నామమాత్రంగా ఉండిపోయింది కాంగ్రెస్. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మినహా పూర్తిస్థాయిలో అధికారం చేపట్టలేదు. కాబట్టి ప్రియాంక పూర్తిస్థాయిలో యూపీ రాజకీయ రణక్షేత్రంలోకి దిగితే... కాంగ్రెస్​కు పూర్వవైభవం తీసుకురావచ్చని ఆశిస్తున్నారు పార్టీ నేతలు.

"రాష్ట్రానికి ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రియాంక గాంధీని ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయం రావాల్సిందే. ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలు సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్ పార్టీల పాలనను చూశారు. 30 ఏళ్ల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన పోటీలో విఫలమవుతోంది. ఈ అంతరాలన్నీ ప్రియాంక గాంధీ ద్వారా భర్తీ అవుతాయి."

-అన్షు అవస్థి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సైతం ఇదే డిమాండ్ వినిపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పునరుద్ధరణకు ఉత్తర్​ప్రదేశ్​ ఒక మార్గమని పేర్కొన్నారు. ప్రియాంకను ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

ఆదిలోనే ఎదురుదెబ్బ

2017 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఓటమి మూటగట్టుకుంది కాంగ్రెస్. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీతో పొత్తుపెట్టుకున్నప్పటికీ... కేవలం ఏడంటే ఏడు సీట్లకే పరిమితమైంది.

2019 లోక్​సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. అదే ఏడాది జనవరిలో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, యూపీపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినా... ఫలితం లేదు. సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్​ పార్టీ చేతులు కలపడం వల్ల రాష్ట్రంలో హస్తం పార్టీ ఒంటరైంది. ఏకంగా అప్పటి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ పడిన అమేఠీలోనూ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫలితంగా ప్రియాంక గాంధీ తన తొలి ప్రయత్నంలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నట్లైంది.

సోలోగా

దీంతో గత కొన్ని నెలలుగా ఒంటరిగానే పార్టీ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు ప్రియాంక. పొత్తులు లేకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బీఎస్​పీపైనా విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధినేత మాయావతిని భాజపా అనధికారిక ప్రతినిధిగా అభివర్ణించారు.

"రాష్ట్ర ప్రజల కోరుకుంటున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని యూపీ కాంగ్రెస్ సమావేశంలో ప్రియాంక స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పొత్తులు కుదుర్చుకోవడం వల్ల ప్రజలు నిరాశకు గురవుతున్నారని తెలిపారు."

-అన్షు అవస్థి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

మిషన్​ యూపీ 2022

తూర్పు ఉత్తర్​ప్రదేశ్​ బాధ్యురాలిగా ఉన్న ప్రియాంక గాంధీ... క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్​లో ఉత్తేజం నింపుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు ప్రియాంక. రాష్ట్రంలో నేరాల పెరుగుదల, పేలవమైన శాంతిభద్రతలు సహా ఇతర విషయాలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​కు మూడు దశాబ్దాల నాటి వైభవం తీసుకొచ్చేందుకు 'మిషన్ యూపీ 2022'ని ప్రారంభించారు ప్రియాంక. రాష్ట్రంలోని దళితులు, ఓబీసీలు, ముస్లింల జనాభా గణాంకాలను నియోజకవర్గాల వారీగా ఇవ్వాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు.

టార్గెట్​ 'యోగి'

ప్రియాంక గాంధీ లఖ్​నవూకు రావడం వల్ల యోగి ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షం ఎలా ఉంటుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వివేక్ తన్ఖా. ఉత్తర్​ప్రదేశ్​లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం అత్యవసరమని అన్నారు.

అయితే రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దడం అంత సులువైన విషయంలా కనిపించడంలేదు. యూపీలో కాంగ్రెస్​ను పునరుద్ధరించడం ప్రియాంకకు అతిపెద్ద సవాలు. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి కాంగ్రెస్​కు ఇప్పుడు సమర్థమైన స్థానిక నాయకులు అవసరం.

ఇదీ చదవండి-బిహార్​లో పిడుగుపాటుకు 13 మంది మృతి

Last Updated : Jul 5, 2020, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details