తెలంగాణ

telangana

'ఎవరు కావాలి.. హీరోనా? అవినీతిపరులా?'

By

Published : Apr 12, 2019, 2:11 PM IST

దేశానికి నిజాయితీగా సేవ చేసే చౌకీదార్​ కావాలో లేక అవినీతిపరులు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. మహారాష్ట్ర అహ్మద్​ నగర్​లో ఎన్నికల ప్రచారం చేశారాయన. ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​పై మరోమారు విమర్శలు గుప్పించారు.

'ఎవరు కావాలి.. హీరోనా? అవినీతిపరులా?'

యూపీఏ పదేళ్ల రిమోట్​ కంట్రోల్​ పాలన కారణంగా దేశంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గడిచిన ఐదేళ్లుగా ఎన్డీఏ పాలనలో దేశం గొప్ప పురోగతి సాధించిందని తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్​ శక్తి సామర్థ్యాలు తెలిశాయని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర అహ్మద్​ నగర్​లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి దేశ ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.

దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్​ పార్టీ నుంచి విడిపోయి ఎన్సీపీని స్థాపించిన శరద్​ పవార్, ఇప్పుడు దేశానికి ఇద్దరు ప్రధానులు కావాలన్న కొందరి డిమాండ్​పై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు మోదీ.

సభలో మాట్లాడుతున్న మోదీ

" ప్రపంచ దేశాలు భారత్​ను మహా శక్తిమంత దేశంగా గుర్తించాయి. అధికారంలోకి ఎవరు రావాలో మీరే నిర్ణయించాలి. నిజాయితీపరుడైన ఈ చౌకీదారా లేక అవినీతిపరులైన వారసులా? హిందుస్థాన్​ హీరో రావాలా? లేక పాకిస్థాన్​ సానుభూతిపరులు రావాలా? గత ఐదేళ్లుగా చౌకీదార్ పాలన చూస్తున్నారు. బాంబు దాడులు ఎక్కడైనా జరుగుతున్నాయా? కాంగ్రెస్​-ఎన్సీపీ ఎలాంటి వారితో చేతులు కలిపారంటే... జమ్ముకశ్మీర్​ను భారత్​ నుంచి విడదీసి, వారికి ప్రత్యేక ప్రధాని కావాలనే వారికి మద్దతిచ్చినట్టే."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

రాహుల్​ గాంధీ, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​ నాథ్​ సన్నిహితులపై ఆదాయ పన్ను శాఖ దాడులను ప్రస్తావిస్తూ... ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ తుగ్లక్​ రోడ్​ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు మోదీ.

ఇదీ చూడండి:'ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details