తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2020, 6:10 AM IST

ETV Bharat / bharat

ట్రంప్‌-మోదీల మైత్రిని చీల్చేందుకే దాడులు

భారత్‌-చైనా మధ్య తూర్పు లద్దాఖ్​​లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా సరిహద్దు విషయంలో విభేదాలున్నాయి. కానీ, చిన్న చిన్న ఘర్షణలు తప్ప ప్రాణనష్టం ఎప్పుడూ వాటిల్లలేదు. ఈ సారి మాత్రం ఇరువైపులా భారీ ప్రాణనష్టం కలిగేంత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే.. అకస్మాత్తుగా భారత్‌తో సరిహద్దుల్లో చైనా దూకుడు ప్రదర్శించడానికి కారణం ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య పెరుగుతున్న స్నేహాన్ని చీల్చడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Modi-Trump proximity
ట్రంప్‌-మోదీల మైత్రిని చీల్చాలన్న పక్కా ప్రణాళికతోనే దాడులు

భారత్‌-చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. 1962లో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధం అప్పుడే స్వాతంత్య్రం పొందిన దేశాల మధ్య జరిగిన అంశంగా పరిగణించినా ప్రస్తుతం గాల్వన్‌లో జరిగిన ఉద్రిక్తతలు వ్యూహాత్మక ఆధిపత్యం కోసమే జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఉద్రిక్తతల వెనక తమకు హాని చేసేలా భారత్‌-అమెరికాల మధ్య పెరుగుతున్న సైనిక, వ్యూహాత్మక సంబంధాలను దెబ్బకొట్టాలని చైనా భావిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. ఈ ఘర్షణలు కేవలం చైనా సైనికుల దుస్సాహసం కాదని.. దీని వెనక భారత్‌ గ్లోబల్‌ శక్తిగా ఎదగకుండా ఆపడం సహా.. ట్రంప్‌-మోదీల మైత్రిని చీల్చాలన్న పక్కా ప్రణాళిక ఉందని అభిప్రాయపడుతున్నారు.

చైనా వ్యవహార శైలే ఉదాహరణ..

ఉద్రిక్తతల అంశంలో.. భారత్‌కు అమెరికా ఎంతవరకు మద్దతిస్తుందో గమనించాలని చైనా భావిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. తదనుగుణంగా అమెరికాతో సంబంధాలపై ప్రధాని మోదీని పునరాలోచింపజేసేలా చేయాలని చైనా అనుకుంటుందన్నారు. అటు.. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేలా భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా,జపాన్‌ల మైత్రిని దెబ్బకొట్టాలని డ్రాగన్‌ ఈ తరహాలో ప్రవర్తిస్తున్నట్లు... దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు వియత్నాం, ఆస్ట్రేలియా, తైవాన్‌, హాంకాంగ్‌తో చైనా వ్యవహారశైలే ఉదాహరణ అని చెబుతున్నారు.

ఇప్పటికే చైనా వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ సహా చైనా పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ అంటూ గల్ఫ్‌ దేశాలను చేరుకునేందుకు ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ సమయంలో ఆర్టికల్‌ 370 రద్దు, పీవోకే ఆక్సాయ్‌చిన్‌, లద్దాఖ్​​ ప్రాంతాలు తమవేనని భారత్‌ వాదించడం చైనాకు కంటగింపుగా మారింది. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రాలపై ఆధిపత్యం చలాయించే అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకే చైనా ఘర్షణలకు తెరలేపిందని దౌత్యవేత్తలు ఆరోపిస్తున్నారు.

వీలైనన్ని మార్గాల్లో..

పీఓకేలోని గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ నుంచి వెళ్లే చైనా పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌పై డ్రాగన్‌ ఇప్పటికే 70 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది. అందుకే పీఓకే, లద్దాఖ్​​లపై భారత్‌ వాదనలను చైనా సహించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే, భారత్‌కు మిత్రదేశమైన నేపాల్‌ను తమవైపుకు మలచుకోవడంలో విజయవంతమైన చైనా.. వీలైనన్ని మార్గాల్లో భారత్‌ను ఇబ్బంది పెట్టాలని యోచిస్తోందంటున్నారు. గిల్గిట్‌- బాల్టిస్థాన్‌ అంశంపై మరింత రెచ్చగొట్టవద్దని.. అదే సమయంలో అమెరికాపై ఎక్కువగా ఆధారపడడంపై ఆలోచించుకోవాలని.. చైనా హెచ్చరిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు.

ఇదీ చూడండి: భారత్‌-చైనా ఘర్షణపై విదేశీ మీడియా ఏమందంటే..

ABOUT THE AUTHOR

...view details