మత్తుమందుకు బానిసై ఛిద్రమౌతున్న చిన్నారుల బాల్యం దేశంలోని వివిధ ప్రాంతాల్లో పిల్లలు కార్మికులుగా మారి జీవనం సాగించడం సర్వ సాధారణమైంది. ఎంతో మంది బాలలు రోడ్లపై భిక్షమెత్తుకుంటున్నారు.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్లో కోటి పదమూడు లక్షల మంది బాల కార్మికులున్నారు. హరియాణా కురుక్షేత్రలో వీధి బాలలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని తెలుసుకునేందుకు ఈటీవీ భారత్ ప్రతినిధి బృందం ప్రయత్నించింది.
కురుక్షేత్రలోని సెక్టార్-17 మార్కెట్లో ఎక్కువ మంది బాలలు రోడ్లపై భిక్షాటన చేస్తున్నారు. డబ్బుకోసం అవసరమైతే దొంగతనానికి వెనుకాడట్లేదు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా, పిల్లల్లో మార్పు కనిపించట్లేదు. యథావిధిగా రోడ్లపై అడుక్కుంటూనే ఉన్నారు.
వారిలో కొంత మందిని అనుసరించింది ఈటీవీ భారత్ బృందం. భిక్షాటన డబ్బుతో ఏం చేస్తున్నారని ప్రశ్నించిన బృందానికి విస్తు పోయే నిజాలు తెలిశాయి. వచ్చిన డబ్బుతో వారు మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. కారు పంక్చర్ అతికించేందుకు ఉపయోగించే లోషన్ను కొని, దాన్ని పాలిథీన్పై అంటించి వాసనను పీల్చుతూ మత్తులోకి జారుకుంటున్నారు.
ఇలా చేస్తే ఎలాంటి సమస్య రావడంలేదా అని ప్రశ్నించగా, ఆ వాసన పీల్చాక కలిగే అనుభూతి చాలా హాయిగా ఉంటుందని బదులిచ్చాడు ఓ పిల్లాడు.
ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి వెళ్లింది ఈటీవీ భారత్ బృందం. దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.
దేశ వ్యాప్తంగా 5నుంచి 18ఏళ్ల వయసున్న 3కోట్ల 30లక్షల మంది బాల కార్మికులుగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్ ఫయాజ్ అరెస్ట్