తెలంగాణ

telangana

ETV Bharat / bharat

​జైట్లీ పేరుతో హైదరాబాదీకి రూ. 20 కోట్లు టోకరా

అమెరికా సంస్థతో వ్యాపారం అన్నారు. 80వేల కోట్ల డాలర్ల ఒప్పందం- భారీ లాభమని నమ్మబలికారు. రూ.20కోట్లు స్వాహా చేశారు. మరో రూ.4కోట్లు కాజేసేందుకు కుట్రచేశారు. చివరకు అసలు విషయం బయటపడింది. హోంశాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగం విచారణ ప్రారభించింది. బాధితుడు హైదరాబాద్​కు చెందిన వ్యాపారి.

By

Published : Apr 1, 2019, 9:37 AM IST

Updated : Apr 1, 2019, 8:04 PM IST

అరుణ్​ జైట్లీ నకిలీ సంతకం​తో భారీ మోసం!

అరుణ్​ జైట్లీ నకిలీ సంతకం​తో భారీ మోసం!
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​జైట్లీ పేరుతో నకిలీ లెటర్​ హెడ్​, ఫోర్జరీ సంతకంతో చేసిన ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్​కు చెందిన వ్యాపారి రూ.20కోట్లు నష్టపోయిన ఈ కేసుపై ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది.

మోసం ఇలా...

హైదరాబాద్​లో నివసించే వ్యాపారవేత్త తారక్ నాథ్.... కొన్నేళ్ల క్రితం జగదీశ్​ బోలాపతి, ప్రసాద్ కృపారావును కలిశారు. తాము ఓ ప్రముఖ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని, త్వరలోనే అమెరికాలోని టెక్సాస్​లో గల ఓ సంస్థ నుంచి 80,000 కోట్ల డాలర్ల డీల్ కుదరనుందని నమ్మబలికారు జగదీశ్​, ప్రసాద్​. ఇందులో చేరితే భారీ లాభాలు ఆర్జించొచ్చన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదమూ లభించిందని చెప్పారు.

లాభాల ఆశ చూపి...

అమెరికా సంస్థ ప్రాజెక్ట్​లో చేరాలనే సాకు చెప్పి తారక్ నాథ్​ను మోసగించారు. అరుణ్ జైట్లీ నకిలీ సంతకంతో కూడిన మూడు దస్త్రాలను పంపారు. వాటిని నమ్మి బ్యాంకు ఖాతా నుంచి రూ.20 కోట్లు పంపించారు తారక్ నాథ్.

కొద్ది రోజులకు ఆర్థిక మంత్రి కార్యాలయంలో పని చేసే శంభు అనే సెక్షన్​ అధికారి పేరుతో ఆయనకు ఓ లేఖ వచ్చింది. మరో రూ.4 కోట్లు పంపించాలన్నది ఆ లేఖ సారాంశం. తారక్​నాథ్​కు అనుమానం వచ్చి ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించారు. తనకిచ్చిన మూడు పత్రాలు నకిలీవని తెలుసుకున్నారు.

హోం శాఖకు ఫిర్యాదు

జైట్లీ నకిలీ సంతకం వ్యవహారం తెలుసుకున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. సెక్షన్ ఆఫీసర్ శంభు కూడా లేఖల్లోని సంతకం తనది కాదన్నారు. మొత్తం విషయాన్ని హోం శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

హోంమంత్రిత్వశాఖ ఈ కేసు దర్యాప్తు చేయాలని దిల్లీ పోలీస్​ కమిషనర్ అముల్యా పట్నాయక్​ను ఆదేశించింది.​ ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్థిక నేరాల విభాగం విచారణ ప్రారంభించింది. వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నిఘా విభాగమూ ఈ మొత్తం విషయంపై దర్యాప్తులో నిమగ్నమైంది.

Last Updated : Apr 1, 2019, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details