వచ్చే ఏడాది ఆగస్టు కల్లా దేశంలో 30 కోట్ల మందికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు.
'వచ్చే ఏడాది తొలి నాలుగు నెలల్లోపు దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టులోపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు విధిగా పాటించాలి. ప్రపంచంలోనే భారత్లో అత్యధికంగా రికవరీ రేటు నమోదైంది. గత జనవరిలో మనవద్ద అందుబాటులో ఉన్న ప్రయోగశాలల సంఖ్య ఒకటి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 2వేలకు పైగా చేరింది. రోజూ మిలియన్ల మంది పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు మనం 14 కోట్ల కరోనా వైరస్ పరీక్షలు పూర్తి చేశాం. దీన్ని బట్టి ప్రభుత్వం కరోనా వైరస్పై ఏ విధంగా విశ్రాంతి లేకుండా పోరాడుతుందో చెప్పవచ్చు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ మాస్కులు, పీపీఈ కిట్ల ఉత్పత్తి విషయంలో స్వావలంబన దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజూ 10లక్షల పీపీఈ కిట్లు ఉత్పత్తి చేస్తున్నాం. అంతేకాకుండా మన శాస్త్రవేత్తలూ సరైన సమయానికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు నిరంతర కృషి చేస్తున్నారు' అని హర్షవర్దన్ తెలిపారు.