తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిజర్వేషన్ల అంశంపై 'దద్దరిల్లిన లోక్​సభ' - supreme latest verdicts

సుప్రీంకోర్టు 'రిజర్వేషన్ల తీర్పు'పై లోక్​సభ దద్దరిల్లింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భాజపా ప్రభుత్వం వ్యతిరేకమని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది. తాము రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. సుప్రీం విచారణ జరిపిన పిటిషన్​ను దాఖలు చేసింది 2012లో ఉత్తరాఖండ్​లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేసింది.

centre-failed-to-defend-reservation-system-oppn-parties
రిజర్వేషన్ల అంశంపై 'దద్దరిల్లిన లోక్​సభ'

By

Published : Feb 10, 2020, 6:27 PM IST

Updated : Feb 29, 2020, 9:37 PM IST

రిజర్వేషన్ల అంశంపై 'దద్దరిల్లిన లోక్​సభ'

ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లోక్​సభలో విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తాయి. భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లింది.

విపక్షాల ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్​ నేతలపై మండిపడింది.

సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని లోక్​సభలో స్పష్టం చేశారు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్​ చంద్ గహ్లోత్​. 2012లో ఉత్తరాఖండ్​లో​ కాంగ్రెస్​ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ అంశం తెరపైకి వచ్చిందని వివరణ ఇచ్చారు.

"ఈ విషయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం అఫిడవిట్​ను దాఖలు చేయలేదు. ఈ వివాదం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2012లో దాఖలు చేసిన పిటిషన్​ ద్వారా తెరపైకి వచ్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వద్దని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉంది. సుప్రీంతీర్పుపై మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం."

-థావర్​ చంద్ గహ్లోత్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి

గహ్లోత్ ప్రకటనపై సంతృప్తి చెందని కాంగ్రెస్.. సభ నుంచి వాకౌట్ చేసింది.

'9వ షెడ్యూల్​లో చేర్చాలి'

ఈ విషయంపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎన్డీఏ భాగస్వామి పార్టీ ఎల్​జేపీ నేత చిరాగ్​ పాసవాన్​ అన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్​లో చేర్చితే ఎవరికీ సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉండదని కేంద్రానికి సూచించారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి..

రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ అన్నారు. కేంద్రం రిజర్వేషన్లకు వ్యతిరేకమని నమ్మేందుకు కారణాలున్నాయని డీఎంకే నేత ఏ రాజా ఆరోపించారు. సుప్రీంతీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీఎస్​పీ ఆరోపించింది. సుప్రీం తీర్పు దురదృష్టకరమని అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్​ అన్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని సూచించారు.

ఈ విషయంపై మాటలు కాదు చేతలు అవసరమని ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే.. కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Last Updated : Feb 29, 2020, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details