తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాపై పోరులో భారత్ మెరుగైన పనితీరు' - harshavardhan on corona virus

కరోనా మహమ్మారిపై పోరు అంశమై మంత్రుల బృందంతో 16వ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలోనే ఉందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఎంతమాత్రం తగదని చెప్పారు.

harshavardhan
'కరోనాపై పోరులో భారత్ మెరుగైన పనితీరు'

By

Published : Jun 10, 2020, 5:31 AM IST

కొవిడ్‌-19పై పోరులో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగైన స్థానంలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. అయితే నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆయన సూచించారు. కరోనా కట్టడి చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై 16వ సారి మంత్రుల బృందంతో భేటీ అయ్యారు హర్షవర్ధన్‌. దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను వాడాలని పేర్కొన్నారు.

కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్న 15 రాష్ట్రాల్లోని 50 జిల్లాలు, పురపాలికలకు కేంద్రం తరపున ఉన్నత స్థాయి బృందాలను పంపినట్లు వెల్లడించారు హర్షవర్ధన్. ఈ బృందాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక సాయం అందిస్తాయని పేర్కొన్నారు. కరోనా పరీక్షల్లో ప్రతిబంధకాలు, పరీక్షల సంఖ్య తక్కువగా ఉండడం సహా మరణాలు, కేసులు పెరగడం వంటి అంశాల్లో కేంద్ర బృందాలు రాష్ట్రాలకు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.

వైద్య సదుపాయాలపై సంతృప్తి..

దేశంలో కరోనా వైరస్​పై పోరు కోసం తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది మంత్రుల బృందం. కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా 958 ఆసుపత్రులు, 1,67, 883 పడకలు, 21,614 ఐసీయూ, 73,469 ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలను సిద్ధం చేసినట్లు మంత్రులకు హర్షవర్ధన్ వివరించారు.

ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్, పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్​ పూరీ, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సహా వివిధ శాఖల సహాయ, స్వతంత్ర హోదా మంత్రులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:భారత్​-చైనా రాజీ... వెనక్కి మళ్లిన బలగాలు

ABOUT THE AUTHOR

...view details