తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టులో చిదంబరం: 5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను 5 రోజుల కస్టడీకి అనుమతివ్వాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఛార్జ్​షీట్​ దాఖలు చేయలేదని, నిజానిజాలు నిగ్గుతేలాలంటే కస్టడీ అవసరమని స్పష్టం చేసింది.

By

Published : Aug 22, 2019, 5:21 PM IST

Updated : Sep 27, 2019, 9:41 PM IST

చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచారు సీబీఐ అధికారులు. పటిష్ఠ భద్రత నడుమ ఆయన్ను దిల్లీ రౌస్​ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. చిదంబరం రిమాండ్​ ప్రతిని న్యాయమూర్తికి సమర్పించిన సొలిసిటర్​ జనరల్​ తుషారు మెహతా.. సీబీఐ తరఫున వాదనలు వినిపించారు.

"అరెస్టు చేసిన 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టాం. 2 గంటల్లో హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇస్తే చిదంబరం నుంచి స్పందన రాలేదు. ఈ అంశంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులూ ఉన్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటివరకూ ఛార్జ్​షీట్​ దాఖలు చేయలేదు. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసు వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు 5 రోజుల పాటు చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వాలి. "

-తుషార్​ మెహతా, సొలిసిటర్​ జనరల్​

చిదంబరం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఆర్థిక మంత్రిగా విదేశీ పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు (ఎఫ్‌ఐపీబీ)కు సంబంధించిన విషయంలో చిదంబరం ఒక్కరే నిర్ణయం తీసుకోలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

"బోర్డులో ఆర్థిక మంత్రితో పాటు ఆరుగురు కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా అప్పుడు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు బోర్డులో సభ్యుడిగా ఉన్న ఒకరు ఆర్బీఐ గవర్నర్‌గా.. మిగిలిన వాళ్లు ఉన్నత స్థానాల్లోకి వెళ్లారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ కారణాలతోనే చిదంబరంను ఈ కేసులో ప్రశ్నిస్తున్నారు."

-కపిల్‌ సిబల్‌, చిదంబరం తరఫు న్యాయవాది

అంతకుముందు కోర్టు హాల్లో నిలబడి ఉన్న చిదంబరాన్ని కుర్చీలో కూర్చోవాలని తుషార్‌మెహతా సూచించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. కోర్టు సంప్రదాయాల ప్రకారమే తాను నడుచుకుంటానని ఈ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు చిదంబరాన్ని సీబీఐ మూడు గంటలపాటు ప్రశ్నించింది. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. చిదంబరంను కోర్టుకు తీసుకొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కపిల్‌ సిబాల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, చిదంబరం సతీమణి నళినీ చిదంబరం, కుమారుడు కార్తీ కూడా కోర్టుకు వచ్చారు.

Last Updated : Sep 27, 2019, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details