తెలంగాణ

telangana

బిహార్​ బరి: వామపక్షాలు సత్తా చాటేనా?

By

Published : Oct 6, 2020, 1:47 PM IST

బిహార్​ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పట్నా​ పీఠం దక్కించుకోవటమే లక్ష్యంగా బరిలోకి దిగిన పార్టీలు.. పొత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు చూస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న కూటముల పోరులో.. వామపక్షాలు ప్రతిపక్షాల మహాకూటమిలో భాగంగా ఉన్నాయి. పొత్తులో భాగంగా 29స్థానాలు దక్కించుకున్న లెఫ్ట్​ పార్టీలు ఎట్టిపరిస్థితుల్లో నితీశ్​ సారథ్యంలోని ఎన్డీఏ గద్దెదిగటం ఖాయం అంటున్నాయి.

grand alliance
బిహార్​ బరి: 'మహాకూటమి- నితీశ్​ ప్రభుత్వాన్ని గద్దె దించుతుంది'

బిహార్​ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్​-వామపక్షాలు విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా. ఈటీవీ భారత్​ ముఖాముఖిలో.. పొత్తుకు సంబంధించిన అంశాలతో పాటు.. కూటమి గెలుస్తుందనటానికి గల కారణాలను విశ్లేషించారు రాజా. రాష్ట్రంలో భాజపా-నితీశ్​ సర్కార్​ పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూనే.. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడించారు.

"కూటమి లౌకికవాది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బలంగా కనిపిస్తోంది. అంతిమ లక్ష్యం భాజపా, మిత్రపక్షాలను ఓడించడమే. అలాగే, ప్రస్తుతం బిహార్​ అభివృద్ధికి కొత్త ప్రభుత్వం అవసరం. ప్రజా సంక్షేమం కోసం పనిచేయటంలో జేడీయూ-భాజపా పూర్తిగా విఫలమయ్యాయి."

-డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి

సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీచేయనుండగా, కాంగ్రెస్​ 70 స్థానాలు దక్కించుకుంది. వామపక్షాలకు 29 సీట్లు కేటాయించారు. ఇందులో సీపీఐ-ఎంఎల్-19, సీపీఐ-6, సీపీఎం-4 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన సీట్లలో గణనీయమైన స్థానాలు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు డి.రాజా.

'ఇవేం రాజకీయాలు?'

బిహార్​ శాసనసభ ఎన్నికలు భాజపాకు కీలకంగా నిలవనున్నాయి. గత ఐదేళ్లలో గుజరాత్​, యూపీలో తప్ప పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించలేకపోయింది కమలం పార్టీ. అందుకే, బిహార్​ అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మిత్రపక్షం జేడీయూతో కలిసి ఉద్ధృతంగా ప్రచారం చేస్తోంది. ప్రధాని మోదీ సైతం ర్యాలీలు చేపడుతున్నారు. ఎల్జేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించటం కొత్త సమస్యలు తీసుకొచ్చినా భాజపా... జేడీయూ-ఎల్జేపీ మధ్య సమాన దూరం పాటిస్తోంది.

ఈ పొత్తుపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా... ఎన్డీఏ రాజకీయ శైలిని తప్పుబట్టారు.

"వ్యూహాత్మకంగా ఈ తరహా రాజకీయ ఆటలకు పాసవాన్​ పార్టీ తెరదీసింది. కూటమి తరఫున పరిస్థితులకు అనుగుణంగా పార్టీలన్నింటినీ కులుపుకుని ముందుకెళ్తాం. మహాకూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది."

-డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి

నితీశ్​ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన రాజా... కరోనాను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర సర్కార్​లు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

ఇదీ చూడండి:నితీశ్​కు చెక్​ పెట్టేందుకే భాజపా వ్యూహం!

ఇదీ చూడండి:'జేడీయూకు ఓటేయొద్దు.. భాజపా-ఎల్​జేపీదే గెలుపు'

ABOUT THE AUTHOR

...view details