తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగం వీడాడు.. ప్లాస్టిక్​కు వ్యతిరేకంగా సైకిల్​ పట్టాడు - Brajesh Kumar started a cycle journey

ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్​ను నిషేధిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా తెలిపారు. ప్రధాని ప్రసంగానికి ఆకర్షితుడైన ఓ యువకుడు.. ఉద్యోగాన్ని వదిలి ప్లాస్టిక్​పై అవగాహన కల్పించేందుకు నడుంబిగించాడు. దేశం మొత్తం సైకిల్​ యాత్ర చేపట్టాడు.

'ఉద్యోగం వదిలి ప్లాస్టిక్​పై అవగాహన కోసం సైకిల్​ యాత్ర'

By

Published : Nov 3, 2019, 3:54 PM IST

Updated : Nov 3, 2019, 6:31 PM IST

ఒక ప్రసంగం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఎన్నో పనులకు ప్రేరేపిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​(సింగిల్ యూజ్ ప్లాస్టిక్) నిషేధించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు ఓ యువకుడు ఆకర్షితుడైయాడు. ప్లాస్టిక్​పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సంకల్పించుకున్నాడు. అనుకోవటమే తడవుగా.. యూరప్​లో ఉద్యోగాన్ని వదులుకొని స్వదేశానికి తిరిగొచ్చి దేశవ్యాప్తంగా సైకిల్​ యాత్ర చేపట్టాడు. ఆయనే.. గుజరాత్​కు చెందిన బ్రజేశ్​ కుమార్​.

'ఉద్యోగం వదిలి ప్లాస్టిక్​పై అవగాహన కోసం సైకిల్​ యాత్ర'

గాంధీనగర్​ నుంచి..

స్వరాష్ట్రం గుజరాత్​లోని గాంధీనగర్​ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్​ 17న సైకిల్ యాత్రను ప్రారంభించాడు బ్రజేశ్​. సుమారు 23వేల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో యాత్రను ఆరంభించాడు.

"పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి సింగిల్​ యూజ్ ప్లాస్టిక్​ రహిత భారత్​పై అవగాహన కల్పిస్తున్నా. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​ వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న హాని గురించి ప్రచారం చేస్తున్నాను. ప్లాస్టిక్​ వదిలేయాలని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నా. దేశవ్యాప్తంగా ఇలాగే చేస్తాను. ఇప్పటి వరకు గుజరాత్ సౌరాష్ట్రలో 500 కి.మీ పూర్తి చేసుకుని.. అక్కడి నుంచి రాజస్థాన్​, హరియాణా, దిల్లీ, మధుర బృందావన్​ దాటి 46 రోజుల తర్వాత ఆగ్రా చేరుకున్నాను. ఇక్కడ కూడా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను."
-బ్రజేశ్​ కుమార్​.

25 వేల విద్యార్థులకు..

ప్లాస్టిక్​ వాడకంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని సంకల్పించుకుని.. తాను వెళ్లే ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను సందర్శిస్తున్నాడు బ్రజేశ్​. ప్లాస్టిక్​ వాడకం వల్ల వాతావరణంలో కలిగే మార్పులు, మూగ జీవాలకు కలుగుతున్న నష్టాల గురించి వివరిస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 25 వేల విద్యార్థులకు అవగాహన కల్పించాడు.

ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న బ్రజేశ్​.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్​మహాల్​ వద్ద పర్యటకులకు సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాడు. అనంతరం ధౌల్పుర్​, మోరెనా వెళ్లనున్నట్లు తెలిపాడు​.

ఇదీ చూడండి:

Last Updated : Nov 3, 2019, 6:31 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details