దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీ నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఫలితాలకు కారణమని పేర్కొంటూ ఒకరినొకరు నేతలు నిందించుకుంటున్నారు. భాజపాపై ఆప్ విజయాన్ని స్వాగతించిన సీనియర్ నేత పి. చిదంబరం లక్ష్యంగా విమర్శలు సంధించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ. భాజపాపై ఆప్ గెలుపు అంశమై ప్రోత్సాహకరంగా మాట్లాడటంపై రాష్ట్రాల్లోని కాంగ్రెస్ విభాగాలను మూసేద్దమా అని ప్రశ్నించారు.
"భాజపాపై గెలుపునకు ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ అవకాశం కల్పిస్తోందా? అలా కాకపోతే మన ఓటమికి చింతించే బదులు ఆప్ గెలిచిందని సంతోషించడమేమిటి? ఒకవేళ ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహించడమే కాంగ్రెస్ లక్ష్యమైతే రాష్టాల్లోని పార్టీ విభాగాలను మూసేద్దామా?"
-శర్మిష్ఠ ముఖర్జీ
విభజన రాజకీయ ఎజెండాతో ప్రమాదకరంగా పరిణమిస్తున్న భాజపాను దేశ ప్రజలు ఓడించారని ఆప్ విజయంపై స్పందిస్తూ వ్యాఖ్యానించారు చిదంబరం. దీనిపైనే సమాధానమిచ్చారు శర్మిష్ఠ.