నూతన వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్లపై విమర్శలు గుప్పించారు భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. దేశంలోని ప్రతి రాష్ట్రంలో భాజపా అద్భుత పనితీరు కనబురుస్తోందని, అది చూసి ఓర్వలేకనే ఈ విధంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"అసోం బీటీసీ, కశ్మీర్ డీడీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా అద్భుత పనితీరు కనబరిచింది. భాజపా విజయాల్ని జీర్ణించుకోలేకే.. ప్రతిపక్షాలు సాగు చట్టాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. మూడు సాగు చట్టాల బిల్లులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో భాజపా గెలిచింది. పేదలు, రైతులు, ఇతరులకు పీఎం మోదీ నిజమైన సానుభూతిపరుడు. పేదలు, గ్రామాలు, రైతులు దేశానికి వెన్నెముక. రైతులు, పేదలు, కార్మికులు మాతో ఉండబట్టే వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది."
- సంబిత్ పాత్ర, భాజపా జాతీయ ప్రతినిధి.