తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేరుకే 'కలిసుందాం రా'.. ఎప్పుడూ కలహాలే! - congress

కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయే గానీ ఏనాడు సఖ్యత కనిపించలేదు కాంగ్రెస్, జేడీఎస్‌ మధ్య. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇదే పరిస్థితి. ఇరుపార్టీల నేతల మధ్య నిత్యం పరస్పర విమర్శలు, ఆరోపణలే. సీఎం కుమారస్వామి అయితే... చాలా సార్లు బాహాటంగానే కాంగ్రెస్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏదో విధంగా ఏడాది పాటు నెట్టుకొచ్చినా... చివరకు రెండు పార్టీల ప్రభుత్వం అర్ధంతరంగా కుప్పకూలింది.

పేరుకే 'కలిసుందాం రా'.. ఎప్పుడూ కలహాలే!

By

Published : Jul 23, 2019, 8:30 PM IST

తెల్లారితే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో? నలుగురు కలిసి చర్చిస్తున్నారని తెలిస్తే అవి కూలదోయడం గురించిన చర్చలేమోననే సందేహం..! ఇలా కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వ భవిత దినదినగండం... నూరేళ్ల ఆయుష్షు తరహాలో నడిచింది. చేయి చేయి కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్‌ మధ్య మొదటి నుంచి విభేదాలే. ఓ పార్టీ నేత మరో పార్టీ నేతపై ఆరోపణలు చేయటం... తీవ్ర స్థాయిలో విమర్శించుకోవడం వారి మధ్య సర్వ సాధారణం.

దినదినగండం...

ముఖ్యమంత్రి పీఠం పూల పాన్పు కాదు... ముళ్ల పాన్పు! ఆ మధ్య కర్ణాటక సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలివి. ఏదో పదవిలో ఉన్నాననే కానీ... రోజుకో సమస్య చుట్టుముడుతోందన్నది ఆయన మాటల్లోని అంతరార్థం.

కుమారస్వామి పాలనపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందని, అందుకే జేడీఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉందన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపించాయి. కుమారస్వామి మాత్రం... తమ కూటమిలో ఎలాంటి విభేదాలు రాలేదని ఎప్పటికప్పుడు సర్ది చెబుతూ వచ్చారు. ఆయన ఎన్ని విధాలుగా సమర్థించుకున్నా... పార్టీల మధ్య ముసలం నడిచిందన్నది బహిరంగ రహస్యం.

కన్నీరు పెట్టిన కుమారస్వామి...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మెజారిటీ సీట్లు రాకపోవడం వల్ల భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. నాటి నుంచి ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుస్తీ పడ్డాయి.

ఆరంభం నుంచి చివరి వరకు విభేదాలతోనే కాలం వెళ్లదీశాయి. విభేదాలను తట్టుకోలేక సీఎం కుమారస్వామి ఓసారి ఏకంగా కన్నీరు కూడా పెట్టుకున్నారు. కాంగ్రెస్‌తో కలిపి ప్రభుత్వం నడపడం కష్టమే అని ఆయన అనడమూ అప్పట్లో సంచలనమైంది. మొదట్లో సాధారణంగా కనిపించినా.. రోజులు గడుస్తున్న కొద్దీ కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

అసంతృప్తి... ఆవేదన...

సంకీర్ణంలో విభేదాలున్నాయనటానికి నిదర్శనంగా... గత కొంతకాలంగా రోజుకో నేత మీడియా ముందుకొచ్చి అసంతృప్తి, ఆవేదన వెళ్లగక్కుతూ వచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌ నేత కే హెచ్‌ మునియప్ప లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సింది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుండెల్లో ఎంతో బాధ ఉన్నా.. ముఖ్యమంత్రిగా పని చేస్తున్నానంటూ కుమారస్వామి చెప్పిన కొన్ని రోజులకే మునియప్ప ఇలా అనటం చర్చనీయాంశమైంది. స్థానిక ఎన్నికల్లో కూటమిగా కాకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని కూడా ప్రకటించారు మునియప్ప.

అదే దారిలో దేవెగౌడ...

మాజీ ప్రధాని, జేడీఎస్‌ దళపతి దేవెగౌడ అయితే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు తథ్యమంటూ బాంబుపేల్చి... అంతలోనే దిద్దుబాటు చర్యలకు దిగారు. కన్నడ నాట ఈ మాటలు చర్చనీయాంశం అవడం వల్ల అంతలోనే తాను అన్నది స్థానిక సంస్థల ఎన్నికల గురించి అంటూ మాటమార్చారు.

కాంగ్రెస్‌ మాకు ఐదేళ్ల పాటు మద్దతు ఇస్తామని చెప్పినా... వారి వైఖరి ఏ మాత్రం అలా కనిపించడం లేదని కొద్ది రోజుల తర్వాత బహిరంగంగానే అన్నారు దేవెగౌడ. ఆ తరవాత అదేమీ లేదంటూ సమర్థించుకున్నారు.

వీరప్ప మొయిలీ విమర్శలు...

కూటమిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ కూడా విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి.... ప్రభుత్వ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఓ కారణం అని మొయిలీ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పాలకవర్గంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని వ్యాఖ్యానించటమూ చర్చకు దారితీసింది.

78 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ను కాదని జేడీఎస్‌కే ఎక్కువ ప్రాధాన్యమివ్వటం..., చాలా మందికి మంత్రి పదవులు ఇవ్వకపోవటమూ అసమ్మతికి కారణమైంది. ఇది జేడీఎస్‌పై కక్ష సాధింపు చర్యగా పరిణమించి... మొత్తంగా కూటమినే ముంచింది.

ABOUT THE AUTHOR

...view details