తెలంగాణ

telangana

గట్టెక్కిన శివరాజ్​ సర్కార్​- 'సింధియా'కు నయా జోష్

By

Published : Nov 10, 2020, 6:24 PM IST

మధ్యప్రదేశ్​ ఉపఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. 28స్థానాలకు పోలింగ్​ జరగ్గా.. మూడింట రెండొంతులకుపైగా సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని గట్టెక్కించుకుంది. ముఖ్యంగా జోతిరాదిత్య సింధియా వర్గంలోని చాలా మంది ఈ ఎన్నికల్లో విజయం దక్కింది.

BJP wins MP BYPOLLS and stabilizes government
మధ్యప్రదేశ్​ 'ఉప'పోరులో భాజపాాదే గెలుపు

రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి పరాభవం ఎదురైంది. తాజాగా 28 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడింట రెండొంతులకుపైగా స్థానాలను సొంతం చేసుకుంది. శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది. ఉప ఎన్నికల్లో భాజపా విజయంలో యువనేత జ్యోతిరాదిత్య సింధియానే కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని వీడి, ఆయన వెంట వచ్చిన వారిలో చాలా మందిని గెలిపించుకోవడంలో సింధియా విజయం సాధించారు.

సింధియా ఎఫెక్ట్​...

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి భాజపా తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాదిత్య సింధియా వర్గం వైపే ఓటర్లు ఉన్నట్లు మధ్యప్రదేశ్‌ ఉపఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి చేరగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలింది. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో భాజపా సర్కారు ఏర్పడింది. సింధియా వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు మరో 3 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఐతే ఆయా ప్రాంతాల్లో జ్యోతిరాదిత్య సింధియా తన పట్టు నిలుపుకున్నారు. ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేయడం, సింధియా ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా పోవడం వల్ల భాజపా విజయం మరింత సులువైనట్లు తెలుస్తోంది. సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడటం వల్ల ప్రభుత్వ ఏర్పాటుపై ఆ పార్టీకి ఆశలు లేకుండా పోయాయి. ప్రస్తుతం 28 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించింది.

ఇదీ చూడండి:-బిహార్​ తీర్పు: అటు ఆనందం- ఇటు అసంతృప్తి

కమల్​నాథే దెబ్బతీశారా?

జ్యోతిరాదిత్య సింధియా వర్గం పార్టీని వీడడం వల్ల నష్టపోయిన కాంగ్రెస్‌కు, ఉప ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ వ్యవహారం ఓటమికి కారణమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీనియర్‌ నేతగా ఉన్న కమల్‌నాథ్,‌ ఓ రాష్ట్ర మహిళా మంత్రిని అసభ్య పదజాలంతో సంబోధించడం తీవ్ర వివాదానికి దారితీసింది. అంతేకాకుండా ప్రచారంలో కమల్‌నాథ్‌ ఎన్నికల కోడ్‌ను పదేపదే ఉల్లంఘించడం వల్ల స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. ఆయన ఏ నియోజకవర్గంలోనైనా ప్రచారానికి వెళ్తే కమల్‌నాథ్‌ ప్రయాణ ఖర్చులు, వసతి తదితర ఖర్చులన్నీ సంబంధిత అభ్యర్థులే భరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఉప ఎన్నికల సమయంలో కమల్‌నాథ్‌ వ్యవహారం ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భాజపా ప్రభుత్వం సేఫ్​...

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా...సాధారణ మెజార్టీకి 116 సీట్లు అవసరం. ఇప్పటికే భాజపాకు 107 సభ్యులు ఉండగా ప్రస్తుత ఉప ఎన్నికల్లో మరో 19 సీట్లు లభించాయి. ఈ నేపథ్యంలో స్థిరమైన ప్రభుత్వానికి అవసరమైన స్థానాలను శివరాజ్‌ సింగ్‌ నేతృత్వంలోని భాజపా సాధించగలిగింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌తోపాటు కమల్‌నాథ్‌కు మరోసారి తీవ్ర పరాభవం ఎదురైంది.

ఇదీ చూడండి:-బిహార్​ సమరంలో మెరిసిన కామ్రేడ్స్​!

ABOUT THE AUTHOR

...view details