తెలంగాణ

telangana

బిహార్​ భాజపా ఆశలు మోదీ బొమ్మపైనే!

By

Published : Sep 26, 2020, 8:18 PM IST

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​కు ప్రజాదరణ తగ్గిపోతోందని అంతర్గత సర్వేలో తేలటం.. ఎన్​డీఏ ప్రధాన పక్షం భారతీయ జనతా పార్టీని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే బిహార్​ శాసనసభ ఎన్నికలకు ప్రధాని మోదీ బొమ్మ, కేంద్ర ప్రభుత్వ విజయాలే ప్రచారాస్త్రాలుగా ముందుకెళ్లాలని భావిస్తోంది భాజపా.

PM Modi
ప్రధాని మోదీ

బిహార్​ ఎన్నికల వేడి రాజుకున్న వేళ.. భారతీయ జనతా పార్టీని ఓ అంతర్గత సర్వే పునరాలోచనలో పడేసింది. మిత్రపక్షం జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​ ప్రజాదరణ రోజురోజుకీ క్షీణిస్తోందని తేలడం వల్ల భాజపా సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖచిత్రాన్నే ముందుపెట్టుకొని ప్రచారాలను హోరెత్తించాలని నిర్ణయానికొచ్చింది.

గందరగోళంలో భాజపా

ఇప్పటికే బలమైన మిత్రపక్షంగా ఉన్న జేడీయూకే పూర్తి సహకారం అందించాలా..? లేదంటే ఎన్​డీఏలో భాగంగా ఉన్న లోక్​ జనశక్తి పార్టీకి మద్దతు తెలపాలా..? అనే గందరగోళంలో ఉంది భాజపా. ప్రతిపక్షాలపై పోరాటం చేయాల్సిన దశలో ఎన్​డీఏలోనే అంతర్గత ఘర్షణ రావటం వల్ల అప్రమత్తమైన భాజపా హైకమాండ్​.. క్షేత్రస్థాయి కార్యకర్తలకు కీలక సూచనలు చేసింది. ఎన్​డీఏ అభ్యర్థులను గెలిపించటమే లక్ష్యంగా పనిచేయాలని వారికి ఆదేశాలు జారీ చేసింది.

అంతర్గత సర్వేలో నితీశ్​ కుమార్​ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని తేలటం వల్ల బిహార్​లో తమ విజయావకాశాలకు గండి పడుతుందని ఆందోళన చెందుతోంది భాజపా. ఈ నేపథ్యంలోనే బిహార్​లో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు మోదీ. త్వరలోనే రాష్ట్రానికి భారీ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

బిహార్​ భాజపా ఆశలు మోదీపైనే !

ప్రచారంలో జోరు..

బిహార్​ ప్రచార గోదాలో.. వర్చువల్​ ర్యాలీలతో భాజపా అందరికంటే ముందుంది. భాజపా శ్రేణులు ఇప్పటికే తమ ప్రచారాన్ని మండల స్థాయికి తీసుకెళ్లారు. కరోనా సంబంధించిన పనుల్లో చురుగ్గా పని చేస్తున్నారు. కరోనా కట్టడితో పాటు ఇతర అంశాలపై కేంద్ర స్థాయిలో మోదీ సర్కార్​ చేస్తున్న కృషి గురించి ప్రజలకు వివరిస్తున్నారు.

ఇప్పటికే 90మందితో కూడిన బృందాన్ని భాజపా ఏర్పాటు చేసుకుని ఈ అంతర్గత సర్వే నిర్వహించింది. బిహార్​లో కొవిడ్​ విజృంభణ, వలస కూలీల వెతలు, వరదలు వంటివి నితీశ్​ ఛరిష్మాను తగ్గించినట్లుగా ఈ సర్వే తేల్చింది. అలాగే, నితీశ్​ కుమార్ అవకాశవాద పొత్తుల పట్ల కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది..

ఈ సర్వే నేపథ్యంలేనే.. ప్రధాని మోదీని ప్రచారాస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించింది భాజపా. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్యకు సంబంధించి ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తోంది. ఈ కోణంలోనే ప్రచార బాధ్యతలను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢణవీస్​కు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఎన్నికల రణక్షేత్రంలో 'బిహార్​ కా షేర్' ఎవరు?

ABOUT THE AUTHOR

...view details