తెలంగాణ

telangana

నితీశ్​కు చెక్​ పెట్టేందుకే భాజపా వ్యూహం!

By

Published : Oct 6, 2020, 7:34 AM IST

లోక్​ జనశక్తి పార్టీని అడ్డుపెట్టుకొని నితీశ్ కుమార్​కు చెక్​ పెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్​జేపీ, జేడీయూ మధ్య విభేదాల్ని అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తోంది. బిహార్​లో రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణాలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది.

BJP uses LJP as 'B' team to corner Nitish amid Bihar poll
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు

బిహార్​లో నితీశ్ కుమార్​కు చెక్​ పెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందా? లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ)ని అందుకోసం వినియోగించుకుంటోందా? అంటే...అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. బిహార్​లో రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణాలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ నుంచి ఎల్​జేపీ బయటకు రావటం గురించి అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఏ ఒక్క భాజపా నేత కూడా నోరు విప్పకపోవటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఎల్​జేపీ, జేడీయూ మధ్య ముదురుతున్న విభేదాల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. "మోదీకి అనుకూలం-నితీశ్​కు వ్యతిరేకం" అని ఎల్​జేపీ చేస్తున్న నినాదం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

నితీశ్​ను పక్కన పెట్టేందుకే ఎల్​జేపీని భాజపా ప్రోత్సహిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిహార్​ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్​ను ఎన్డీఏ ఖరారు చేయటం కూడా ఈ వ్యూహంలో భాగమేనని వారు విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో నితీశ్​ ధిక్కార స్వరం వినిపిస్తే..ప్రారంభం నుంచీ ఆయనకు తాము ప్రాధాన్యమిచ్చామని భాజపా చెప్పుకొనేందుకు వీలుంటుంది. ఒకవేళ నితీశ్​ తనకు తానుగా తప్పుకుంటే అందుకు తమ బాధ్యత ఉండదని భాజపా చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే భాజపాతో నితీశ్​కు దూరం పెరుగుతూ వస్తోంది. మరో వైపు ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో సులభంగా గెలుస్తుందని భాజపా విశ్వసిస్తోంది.

నితీశ్​పై అసమ్మతి

బిహార్​లో నితీశ్ కుమార్​కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు పని చేస్తున్నారనేది విస్మరించలేని వాస్తవం. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భాజపా భావిస్తోంది. భాజపాకు సాయం చేయటానికి కేవలం జేడీయూ పోటీ చేస్తున్న 143 స్థానాల్లోనే ఎల్​జేపీ అభ్యర్థలను బరిలో నిలపడాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. దీంతో జేడీయూ ఓట్లు చీల్చే ప్రయత్నం జరుగుతోందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇదే జరిగితే కూటమిలో 'రెండో పార్టీ' అనే పేరును దూరం చేసుకోవటానికి భాజపాకు సువర్ణావకాశం దక్కినట్లే. అప్పుడు బిహార్​లో భాజపా పెద్ద పార్టీగా అవతరిస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే తమ పార్టీకి చెందిన వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటించే వీలు కమలదళానికి కలుగుతుంది.

వ్యూహాత్మకంగా చిరాగ్​ అడుగులు

బిహార్​ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు ప్రక్రియలో తాము కోరుకున్న స్థానాన్ని కేటాయించకపోయినప్పటికీ ఎల్​జేపీ..భాజపాను ఎందుకు విమర్మించలేదనే అంశం సర్వత్రా చర్చనీయాంశమయింది. కాషాయ పార్టీకి చిరాగ్ విధేయుడిగా వ్యవహరించటం, నితీశ్​కు వ్యతిరేకిగా మారటం వెనుక ఎల్​జేపీని ఉపయోగించుకొని భాజపా లబ్ధి పొందాలనుకుంటోందని అర్థమవుతోంది. అయితే చిరాగ్​ సైతం బిహార్​లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్నారు. మరోవైపు కూటమిలోని చిన్న పార్టీల మనుగడ సాగనీయకుండా నితీశ్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి ప్రయాణించటం ఇక ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని చిరాగ్​ భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటు సమయంలోనూ తాము కచ్చితంగా ఓడిపోయే స్థానాలనే జేడీయూ తమకు కేటాయించాలనుకోవటంతో చిరాగ్​ మరింత అప్రమత్తమయ్యారు. తన కుమారుడు బిహార్​ రాజకీయాల్లో కీలకంగా మారాలని రాంవిలాస్​ పాసవాన్​ సైతం భావిస్తున్నారు. అందుకోసం తన కేంద్రమంత్రి పదవిని కూడా త్యాగం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు.

వచ్చేది భాజపా-ఎల్​జేపీ ప్రభుత్వమే: చిరాగ్​

బిహార్​లో భాజపాతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని లోక్​జనశక్తి పార్టీ (ఎల్​జేపీ)అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ తెలిపారు. నితీశ్​ కుమార్​తో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చిరాగ్​..జేడీయూ అభ్యర్థులకు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు. జేడీయూతో ఏర్పడిన సైద్ధాంతిక విభేదాల కారణంగా నితీశ్​ నాయకత్వాన్ని అంగీకరించబోమంటూ ఆ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ పార్టీ నేతలను బరిలో నిలపడానికి ఎల్​జేపీ ఆదివారం నిర్ణయించింది. "ఇది నిర్ణయాత్మకమైన సమయం. 12కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవితవ్యం ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉంది. ఇందులో ఎల్​జేపీ పోరాడి గెలుస్తుంది.మాపార్టీ ఎమ్మెల్యేలంతా ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేస్తారు." అని చిరాగ్​ తెలిపారు.

భాజపా విజయానికి ఆర్జేడీయే తోడ్పడుతోంది

బిహార్​లో భాజపా విజయానికి ఆర్జేడీయే తోడ్పడుతోందని ఏఐఎమ్​ఐఎమ్ నేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ ఆరోపించారు. భాజపా విజయం కోసమే తాము బిహార్​లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. మైనారిటీల ఓట్లను చీల్చేందుకు వచ్చిన వ్యక్తిగా తనపై ఆర్జేడీ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ తీవ్రంగా స్పందించారు. బిహార్​లో 2019ఎన్నికల్లో ఆర్జేడీ పరాభవానికి తమ పార్టీ ఏ విధంగా కారణమని ప్రశ్నించారు. మహాకూటమిలోని మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్​పైనా ఆయన విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో తమతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్​... అనంతరం శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details