సుమలతకు మద్దతుపై అధిష్టానం ఆమోదం లభించిందని.. భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. సుమలతకు మద్దతుతో కాంగ్రెస్ అసంతృప్తుల్ని తమ పార్టీలో చేర్చుకోవచ్చని భావిస్తోంది భాజపా. మండ్య స్థానాన్ని జేడీఎస్కు ఇచ్చినందుకు ఇప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు.
మండ్యలో సుమలతకు భాజపా మద్దతు - nikhil
కర్ణాటకలోని మండ్య లోక్సభ స్థానం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దివంగత అంబరీష్ భార్య సుమలత, ముఖ్యమంత్రి హెచ్డీ. కుమారస్వామి కుమారుడు నిఖిల్, భాజపాల మధ్య పోటీ ఉంటుందని ఇప్పటివరకు అందరూ భావించారు. కానీ.. ఇప్పుడు సుమలతకు భాజపా మద్దతు ప్రకటించడం వల్ల పరిణామాలు వేగంగా మారిపోయాయి. వీరినెలా ఎదుర్కోవాలో వ్యూహాలు రచించే పనిలో పడింది కాంగ్రెస్-జేడీఎస్ కూటమి.

కన్నడ సినీ పరిశ్రమ నుంచి సుమలతకు ఊహించని మద్దతు లభిస్తోంది. యశ్, దర్శన్ వంటి అగ్రకథానాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. మండ్యలోని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ మద్దతునూ కోరారు సుమలత.
దేవెగౌడ కుటుంబంలో మూడో తరం.. నిఖిల్ రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే అదరగొట్టాలన్న ఉద్దేశంతో కంచుకోట లాంటి స్థానం మండ్యలో పోటీకి దించింది జేడీఎస్. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుమలత రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది. కాంగ్రెస్ టికెట్ నిరాకరించగా.. రెబల్గా మారారు సుమలత. దివంగత రాజకీయ నేత, ప్రముఖ నటుడు అంబరీష్ భార్యనే సుమలత. వీరిని ఎదుర్కోవాలంటే సంకీర్ణ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిందే.