తెలంగాణ

telangana

నాయకత్వ మార్పిడి వ్యూహంలో భాజపా తలమునకలు

By

Published : Jul 6, 2020, 8:28 AM IST

మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌, కర్ణాటకలో యడియూరప్ప, రాజస్థాన్‌లో వసుంధర రాజె, ఝార్ఖండ్‌లో రఘువర్‌దాస్‌.. భాజపాలో ఇలాంటి కొందరు బలమైన ప్రాంతీయ నేతల ప్రాధాన్యం పార్టీ తగ్గించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వీరికి దీటుగా ఉపప్రాంతీయ నేతలకు ప్రాధాన్యం దక్కుతోంది. ఈ నెల రెండో తేదీన మధ్యప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణకు కొద్ది గంటల ముందు సీఎం శివరాజ్‌సింగ్‌ మాట్లాడుతూ... సముద్ర మథనం జరుగుతున్నప్పుడు అమృతం, గరళం రెండూ ఉద్భవిస్తాయని, గరళాన్ని స్వీకరించే బాధ్యత శివుడిదేనని వ్యాఖ్యానించారు. తన పేరులో శివుడు ఉండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ విధేయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో తన అశక్తతను ఇలా వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు.

bjp strategic plan on changing leaderchip in few states
నాయకత్వ మార్పిడి వ్యూహంలో భాజపా తలమునకలు

భాజపాలో ప్రాంతీయ స్థాయిలో బలమైన నేతల ప్రాబల్యాన్ని తగ్గించే దిశగా ఆ పార్టీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌, కర్ణాటకలో యెడ్యూరప్ప, రాజస్థాన్‌లో వసుంధర రాజె, ఝార్ఖండ్‌లో రఘువర్‌దాస్‌ల ప్రాధాన్యం తగ్గిపోతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వీరికి దీటుగా ఉపప్రాంతీయ నేతలకు ప్రాధాన్యం దక్కుతోంది. భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ఆధ్వర్యంలో రాష్ట్రశాఖల్లో వికేంద్రీకరణ వ్యూహాన్ని బలంగా ముందుకు తెస్తున్నారు. ఈ నెల రెండో తేదీన మధ్యప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణకు కొద్ది గంటల ముందు సీఎం శివరాజ్‌సింగ్‌ మాట్లాడుతూ... సముద్ర మథనం జరుగుతున్నప్పుడు అమృతం, గరళం రెండూ ఉద్భవిస్తాయని, గరళాన్ని స్వీకరించే బాధ్యత శివుడిదేనని వ్యాఖ్యానించారు. తన పేరులో శివుడు ఉండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ విధేయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో తన అశక్తతను ఇలా వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు. శివరాజ్‌ మంత్రివర్గంలో ప్రస్తుతం 34 మంది మంత్రులు ఉన్నారు. ఇకపై విస్తరణకు అవకాశం తక్కువే. 34 మందిలో 14 మంది జ్యోతిరాదిత్య సింధియా అనుయాయులే. మిగతా 20 మందిలో 12 మంది భాజపాలోని ఉపప్రాంతీయ వర్గాలకు చెందిన నేతలు. ఇండోర్‌ ప్రాంతానికి చెందిన కైలాస్‌ విజయవర్గీయ, భోపాల్‌ నుంచి బి.డి.శర్మ, బుందేల్‌ఖండ్‌కు చెందిన నరోత్తమ్‌మిశ్ర వంటి నేతల అనుచరులే పదవులు దక్కించుకున్నారు. 2018లో శివరాజ్‌ ఓడిపోయి కాంగ్రెస్‌కు పగ్గాలు దక్కేంతవరకు, విజయవర్గీయ, శర్మ, మిశ్ర తమ శిబిరాలు నిర్లక్ష్యానికి గురైనప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడలాంటి బాధను అనుభవించడం చౌహాన్‌ వంతయింది.

యెడ్యూరప్పకు కష్టకాలం

కర్ణాటక సీనియర్‌ నేత బీఎస్‌ యెడ్యూరప్ప కేంద్ర నాయకత్వం నుంచి గత రెండేళ్లుగా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో సైతం ఇదే పరిస్థితి. కర్ణాటక భాజపాలో సుదీర్ఘకాలంగా తన ప్రత్యర్థిగా ఉన్న బీఎల్‌ సంతోష్‌ భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. తద్వారా కర్ణాటకలో యెడ్యూరప్ప వేగానికి అధిష్ఠానం పగ్గాలు వేసినట్లయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో యెడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు టికెట్‌ దక్కలేదు. ప్రఖ్యాత దక్షిణ బెంగళూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ అభ్యర్థి ఎంపికలో కేంద్రనాయకత్వం నిర్ణయమే ఖరారైంది. ఆ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన సీనియర్‌ నేత అనంతకుమార్‌ మరణంతో ఆయన భార్య తేజస్వినికి టికెట్‌ సాధించేందుకు యెడ్యూరప్ప తీవ్రంగా యత్నించారు. రాష్ట్రశాఖ సైతం ఆమె పేరునే సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనల్ని తోసిపుచ్చిన కేంద్ర నాయకత్వం 28 ఏళ్ల తేజస్వి సూర్యకు అవకాశం కల్పించింది. జూన్‌ 8న కర్ణాటక నుంచి రెండు రాజ్యసభ సీట్లకు పార్టీ రాష్ట్ర శాఖ ప్రభాకర్‌ కోరే, ప్రకాష్‌శెట్టిల పేర్లను సిఫార్సు చేయగా, ఎరన్న కడాడి, అశోక్‌ గస్తిల పేర్లను ఎంపిక చేస్తూ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం యెడ్యూరప్పకు భారీ ఎదురుదెబ్భ ఈ ఉదంతాలవల్ల 77 ఏళ్ల బలమైన లింగాయత్‌ నేత ప్రాభవంలో క్షీణత మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యాక కర్ణాటక రాజకీయాల నుంచి ఆయన గౌరవప్రదంగా నిష్క్రమించేందుకు సిద్ధపడాల్సి ఉంటుందని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

రాజస్థాన్‌లోనూ...

రాజస్థాన్‌లో కమలదళాన్ని ముందుండి నడిపిస్తున్న వసుంధర రాజేదీ ఇలాంటి పరిస్థితే. 2014లో కేంద్రంలో భాజపా గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వసుంధర తన కుమారుడు, ఝలావర్‌ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన దుష్యంత్‌కు కేంద్రమంత్రి పదవిని ఆశించినా దక్కలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవడంతో వసుంధరకు సమస్యలు చుట్టుముట్టాయి. అసెంబ్లీలో విపక్ష నేతగానూ అవకాశం దక్కలేదు. గతంలో వసుంధరను వ్యతిరేకించిన నేతలకే ముఖ్యమైన పదవులు దక్కాయి. వసుంధర కుమారుడు దుష్యంత్‌ను తోసిరాజని గజేంద్రసింగ్‌ షెకావత్‌, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌లను కేంద్రమంత్రి పదవులు వరించాయి. ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకున్నారు. 2019లో సతీష్‌ పూనియాను రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నిర్ణయాలన్నీ వసుంధరకు తీవ్ర శరాఘాతాలేనని చెప్పొచ్ఛు రాజస్థాన్‌ భాజపాలో ఆమె ప్రాభవం చివరిదశకు చేరిందనేది పరిశీలకుల అభిప్రాయం. జోతిరాదిత్య కేంద్ర మంత్రివర్గంలో చేరితే, వసుంధరకుగాని, ఆమె కుమారుడు దుష్యంత్‌కుగాని స్థానం దక్కడం దాదాపు అసాధ్యంగానే చెప్పవచ్ఛు

ఝార్ఖండ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్‌ ప్రాబల్యానికి రెక్కలు కత్తిరించే దిశగా భాజపా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు దాస్‌ పార్టీ రాష్ట్రశాఖను పూర్తిగా తన అదుపులో ఉంచుకునేందుకు యత్నించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఝార్ఖండ్‌ భాజపాలో అగ్రనేత సరయురాయ్‌ను రఘువర్‌దాస్‌ బహిష్కరించినప్పుడు సైతం అగ్రనేతలు మౌనం దాల్చారు. కేంద్రమంత్రి అర్జున్‌ముండా అనుచరులకూ దాస్‌ టికెట్లు నిరాకరించారు. అర్జున్‌ముండా, సరయు రాయ్‌ అనుచరులకూ తగిన ప్రాధాన్యం దక్కింది. ఈ రాష్ట్రాల్లో తదుపరి ఎన్నికల్లో కొత్త నాయకత్వం ఆధ్వర్యంలో పోరాడాలని భాజపా అధిష్ఠానం తలపోస్తున్నట్లు తెలుస్తోంది.

-రాజీవ్‌ రాజన్‌

ABOUT THE AUTHOR

...view details