తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటమిని వినమ్రంగా స్వీకరించండి: భాజపా

ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల (ఈవీఎం) విశ్వసనీయతపై విపక్షాలు లేవనెత్తిన అంశాలను ఖండించింది భాజపా. నరేంద్ర మోదీని ప్రజలు మళ్లీ ప్రధానిగా కోరుకుంటే.. విపక్షాలు ఓటమినీ  వినమ్రతతో అంగీకరించాలన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​.

By

Published : May 21, 2019, 8:07 PM IST

ఓటమిని అంగీకరించాలి

ఎన్నికల సంఘాన్ని కలిసిన విపక్షాలపై మండిపడ్డారు భాజపా నేతలు. ఈవీఎంల విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, భాజపా ప్రతినిధి జీవీఎల్​ నరసింహారావు.

మమతా బెనర్జీ, అమరీందర్​ సింగ్​లు ముఖ్యమంత్రులుగా గెలిచినప్పుడు ఈవీఎంలపై రాని సందేహాలు.. ప్రజలు మోదీని మరోసారి ప్రధానిగా కోరుకుంటుంటే వస్తున్నాయా అని విమర్శించారు.

ఈవీఎంల విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నారా: రవిశంకర్​ ప్రసాద్​

''ఈవీఎంలపై ప్రశ్నిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకంటే వారు నిరాశలో ఉన్నారు. ఓడిపోతారని తెలిసే.. పైకి అలా మాట్లాడుతున్నారు. ఇలాంటి ఈవీఎంలతోనే కాంగ్రెస్​ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో గెలిచింది. అప్పుడు ఈవీఎం సరైనదే. అదే ఈవీఎంలతో మమతా రెండు సార్లు ముఖ్యమంత్రి, అమరీందర్ సింగ్​​ పంజాబ్​లో కాంగ్రెస్​​ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడూ ఈవీఎంలు బాగానే ఉన్నాయి. వారు గెలిచినప్పుడు ఈవీఎంలు సరిగ్గానే పనిచేశాయి. ఇప్పుడు మోదీని ప్రజలు మరోసారి ప్రధానిగా కోరుకుంటుంటే ఈవీఎంలపై అనుమానాలెందుకు.. విపక్షాలకు నేను చెప్పేది ఒకటే.. ఓటమిని కూడా మర్యాదపూర్వకంగా స్వీకరించాలి.''

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర మంత్రి

అంతకుముందు ఈవీఎంల విషయమై 22 పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 వీవీప్యాట్​ల స్లిప్పులను ఈవీఎంల కంటే ముందే లెక్కించాలని డిమాండ్​ చేశాయి.

ఒకవేళ అందులో ఏమైనా వ్యత్యాసముంటే.. నియోజకవర్గం పరిధిలోని 100 శాతం వీవీప్యాట్​ల స్లిప్పులు గణించాల్సిందేనని ఈసీకి నివేదించాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘం రేపు సమావేశమవుతామని హామీ ఇచ్చినట్లు విపక్ష నేతలు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details