తెలంగాణ

telangana

By

Published : Mar 24, 2019, 12:58 PM IST

ETV Bharat / bharat

యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్​'

సోషల్​ ఇంజినీరింగ్​..! 2014 సార్వత్రిక సమరం సమయంలో అందరి నోట ఇదే మాట. యూపీలో భాజపా సృష్టించింది ఈ వ్యూహంతోనే. ఇప్పుడు ప్రణాళిక కాస్త మారింది. గత ఎన్నికల్లో రకరకాల సామాజిక వర్గాల తోడ్పాటు కలిసొస్తే.... ఈసారి చిన్నపార్టీల మద్దతే కీలకం.

ఉత్తర్​ప్రదేశ్​లో చిన్నపార్టీల వైపు భాజపా చూపు

ఉత్తర్​ప్రదేశ్​లో చిన్నపార్టీల వైపు భాజపా చూపు
ఎన్డీఏ వర్సెస్​ మహాకూటమి...! జాతీయ స్థాయిలో పోటీ ఇది. ఉత్తర్​ప్రదేశ్​లో మాత్రం పరిస్థితి భిన్నం. అక్కడ మహాకూటమి లేదు. భాజపా తలపడేది ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్​డీ కూటమితోనే.

2014 లోక్​సభ ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్​లో ప్రభంజనం సృష్టించింది భాజపా. 80సీట్లలో మిత్రపక్షంతో కలిసి 73 స్థానాలు దక్కించుకుంది. మిగిలిన స్థానాలు దక్కింది రెండు కుటుంబాలకే... ఒకటి గాంధీ-నెహ్రూ పరివారం, మరొకటి ములాయం వంశం. అప్పుడు విడివిడిగా పోటీచేశాయి ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ. సమాజ్​వాదీ పార్టీ అతికష్టం మీద 5 సీట్లు సాధిస్తే... బహుజన సమాజ్​ పార్టీ, రాష్ట్రీయ లోక్​దళ్ అసలు ఖాతా తెరవలేదు.

సీట్లు పరంగా... ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంది భాజపా. కానీ... ఇక్కడ సమస్య సీట్లు కాదు, ఓట్లు. 2014లో భాజపాకు వచ్చిన ఓట్ల శాతం 42.63. ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీకి విడివిడిగా వచ్చి ఓట్లశాతాలు కలిపితే 42.98. ఇప్పుడు కలిసి ఒకే అభ్యర్థిని నిలబెడుతున్నాయి. అంటే... దాదాపు సమాన ఆదరణ. పోటీ హోరాహోరీ.
నువ్వానేనా అన్నట్లు జరుగుతున్న ఎన్నికల్లో... ప్రతి ఓటు కీలకమే. ప్రతి సీటు అవసరమే. అందుకే... అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది భాజపా. చిన్నపార్టీలను దగ్గర చేసుకుంటోంది. వారి డిమాండ్లలో సాధ్యమైనన్నింటికి పచ్చజెండా ఊపుతోంది. మరికొన్నింటిపై సానుకూలంగా స్పందిస్తూ... వారి మద్దతు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అప్నాదళ్​కు కుర్మీ వర్గం మద్దతు రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఎస్​బీఎస్​పీకి ఓబీసీ వర్గానికి చెందిన రాజ్​భర్ల ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఈశాన్య ఉత్తర ప్రదేశ్​లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఆ పార్టీలతో కలిసి ఎన్నికలకువెళ్తే లాభమన్నది భాజపా అంచనా.

లోక్​సభ ఎన్నికల్లో అప్నాదళ్​తో పొత్తు కుదిరినా... ఎస్​బీఎస్​పీ సీట్ల కేటాయింపుపై చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఎస్​బీఎస్​పీకి పుర్వాంచల్​ ప్రాంతంలో బాగా పట్టుంది. ఆ ప్రాంతంలోని స్థానాలను కేటాయించాలనే ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఆ ప్రాంతంలోనిదే. జనసత్తా దళ్​(లోక్​తాంత్రిక్​) పార్టీతోనూ పొత్తు కోసం ప్రయత్నిస్తోంది భాజపా.

వరాల జల్లు...

ఉత్తర్​ప్రదేశ్​లోని యోగి ప్రభుత్వంలో సుహేల్​దేవ్​ భారతీయ సమాజ్​ పార్టీ(ఎస్​బీఎస్​పీ​), అప్నాదళ్​(ఎస్​) పార్టీలు భాగస్వాములు. అయినా... రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న భావనతో.... ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది భాజపా. చిన్నపార్టీల నేతలకు మరో ఆలోచన రాకుండా మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చింది.

భాజపా, మిత్రపక్షాలకు చెందిన 75మందికి ఇటీవలే సహాయ మంత్రి హోదా కల్పించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఎస్​బీఎస్​పీ నేత అరవింద్​ రాజ్​భర్​ను రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్​కు ఛైర్​పర్సన్​ చేశారు. ఈయన ఎస్​బీఎస్​పీ అధ్యక్షుడు, యూపీ మంత్రి ఓం ప్రకాశ్​ రాజ్​భర్​ కుమారుడు. ఎస్​బీఎస్​పీ నేత రానా ప్రతాప్​ సింగ్​కు యూపీ విత్తానాభివృద్ధి సంస్థ చైర్​పర్సన్​ పదవి ఇచ్చారు.

అప్నాదళ్​కు చెందిన రామ్​లఖన్​, రేఖావర్మ ఇప్పటికే యోగి కేబినేట్​లో మంత్రులు. మరో ఇద్దరిని బీసీ కమిషన్​ సభ్యులుగా నియమించింది యూపీ ప్రభుత్వం.

క్రమంగా తగ్గి... ఒకేసారి పైకి

1991 నుంచి 1999 మధ్య భాజపా ఉత్తరప్రదేశ్​లో దాదాపు 30శాతం ఓట్లు పొందింది. అది 2004లో 22శాతానికి పడిపోయింది. 2009కి మరింత క్షీణించింది. కేవలం 17.5శాతం ఓట్లతో సరిపెట్టుకుంది సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనం-అమిత్​షా వ్యూహంతో భాజపా అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం.

ABOUT THE AUTHOR

...view details