తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నడ కూటమి సర్కారు భవిష్యత్తు ప్రశ్నార్థకం!

కర్ణాటక రాజకీయాలు కొద్ది రోజులుగా సస్పెన్స్​ థ్రిల్లర్​ను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రానుందంటూ ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు లోక్​సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ అంచనాలకు మించి రాణించడం కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమిని సందిగ్ధంలో పడేసింది. సంకీర్ణ కూటమి ప్రభుత్వ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది.

By

Published : May 24, 2019, 8:32 AM IST

కర్ణాటక

కన్నడ కూటమి సర్కార్​ భవిష్యత్తు ప్రశ్నార్థకం

కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్​డీ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసి సరిగ్గా ఏడాది. అయితే... ఇది ఆయనకు పెద్ద సంతోషాన్నిచ్చే విషయం కాదు. కారణం.. లోక్​సభ ఎన్నికల్లో భాజపా అంచనాలకు మించి రాణించడం. సంకీర్ణ ప్రభుత్వం స్థిరత్వంపై ఉన్న అనుమానాలు ఇప్పుడు తీవ్రమై... రాష్ట్ర రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఎన్నో మలుపులు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్​ ఫలితం తర్వాత తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్​- జేడీఎస్​ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్​ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్​ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు, కుమారస్వామి భావోద్వేగ ప్రసంగాలు, కూటమిని కూలదోసేందుకు ప్రత్యర్థి భాజపా ప్రయత్నాలు.. ఇలా ఎన్నో మలుపులకు నిలయంగా మారింది కన్నడ రాష్ట్రం. అదే లొసుగులతో సార్వత్రిక సమరం బరిలోకి దిగాయి. భాజపాను నిలువరించాలని గట్టి ప్రయత్నమే చేశాయి. ఫలితం మాత్రం శూన్యం.

ఊహించని విధంగా భాజపా 25 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. 2014 సార్వత్రికంలో 17 గెల్చుకున్న భాజపా ఇప్పుడు 8 సీట్లు మెరుగుపర్చుకుంది. కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి 2 స్థానాలకే పరిమితమైంది. 2014లో కాంగ్రెస్​ 9 స్థానాలు నెగ్గడం గమనార్హం. కూటమిలో సఖ్యత ఎలా ఉందో ఈ ఫలితాలే చెబుతున్నాయి.

జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్​డీ దేవెగౌడ, కాంగ్రెస్​ సీనియర్లు మల్లికార్జున్​ ఖర్గే, వీరప్ప మొయిలీ, మునియప్ప పరాజయం పాలయ్యారు.

అధికారంలోకి భాజపా....!

సార్వత్రిక ఫలితాల అనంతరం రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రానుందని, ప్రభుత్వం చేతులు మారనుందని ఎప్పటినుంచో కమలదళం నేతలు కూటమికి గుబులు పుట్టిస్తున్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి సదానంద గౌడ.. కుమారస్వామి ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు.

ఇప్పుడు ఎన్నికల్లో భాజపా ప్రభంజనంతో కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంకీర్ణ కూటమి స్థిరంగా ఉంటుందా...? కూలిపోనుందా..? అనే ప్రశ్నలు అందరినీ ఆలోచనలో పడేశాయి.

కర్ణాటక శాసనసభలో మొత్తం 224 సీట్లు. భాజపాకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 78 సీట్లున్న కాంగ్రెస్​, 37 మంది బలమున్న జేడీఎస్​, ఒక బీఎస్పీ సభ్యుడు, ఒక స్వతంత్ర సభ్యుని మద్దతుతో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటైంది.

ఇదీ చూడండి: కన్నడనాట ఆగని 'సంకీర్ణ కూటమి' యుద్ధం

ABOUT THE AUTHOR

...view details