తెలంగాణ

telangana

By

Published : Oct 5, 2020, 8:57 PM IST

ETV Bharat / bharat

'హాథ్రస్​ బాధితురాలికి వ్యతిరేకంగా భాజపా ప్రచారం'

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రస్​ హత్యాచార ఘటనలో బాధితురాలికి వ్యతిరేకంగా ఉత్తర్​ప్రదేశ్​లోని భాజపా ప్రభుత్వం ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు ప్రియాంక గాంధీ. జిల్లా మెజిస్ట్రేట్​పై ఎప్పుడు చర్యలు చేపడతారని నిలదీశారు.

BJP campaigning against Hathras victim: Priyanka Gandhi
'హాథ్రస్​ బాధితురాలికి వ్యతిరేకంగా భాజపా ప్రచారాలు'

ఉత్తర్​ప్రదేశ్​లోని భాజపా ప్రభుత్వం.. హాథ్రస్​ హత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహిస్తోందని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కేసులో న్యాయ విచారణకు ప్రభుత్వం ఇంకెప్పుడు అదేశిస్తుందని ప్రశ్నించారు. జిల్లా మెజిస్ట్రేట్​పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని నిలదీశారు ప్రియాంక.

"చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు. మరి బాధితుల కుటుంబ సభ్యుల మాటలు వింటారా? హాథ్రస్​ జిల్లా మెజిస్ట్రేట్​పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? న్యాయ విచారణ ఎప్పుడు చేపడతారు? బాధితుల బాధను అర్థం చేసుకోవడం న్యాయ ప్రక్రియలో తొలి అడుగు. కానీ భాజపా ప్రవర్తన ఇందుకు విరుద్ధంగా ఉంది. బాధితురాలికి వ్యతిరేకంగా భాజపా ప్రచారాలు నిర్వహిస్తోంది."

--- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

ఎన్​సీడబ్ల్యూ వివరణ...

ప్రియాంక హథ్రస్​ పర్యటన సందర్భంగా ఆమెపై అణుచితంగా ప్రవర్తించిన పోలీసులపై జాతీయ మహిళా కమిషన్​(ఎన్​సీడబ్ల్యూ) తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని యూపీ పోలీసులను ఆదేశించింది.

ఇదీ చూడండి:-'హాథ్రస్​'పై పోలీసులకు షాక్​​​.. అత్యాచారం జరిగినట్లు రిపోర్ట్​!​

హాథ్రస్​కు వెళుతున్న సందర్భంలో ప్రియాంక బృందాన్ని దిల్లీ-యూపీ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో హెల్మెట్​ పెట్టుకున్న ఓ పోలీసు... ప్రియాంక కుర్తాను పట్టుకున్నారు.

భద్రత పెంపు...

మరోవైపు హాథ్రస్​ బాధితురాలి నివాసం వద్ద భద్రతను మరింత పెంచింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. 24గంటల పాటు భద్రతను పర్యవేక్షించేందుకు 12-15 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. కానిస్టేబుల్​తో పాటు ముగ్గురు ఎస్​హెచ్​ఓలు, ఓ డిప్యూటీ-ఎస్​పీ స్థాయి అధికారిని అక్కడ మోహరించారు.

సుప్రీంలో పిటిషన్​...

హాథ్రస్​ ఘటనలో పోలీసుల పాత్రపై దర్యప్తు చేపట్టలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు విశ్రాంత న్యాయమూర్తి చంద్రభాన్​ సింగ్​. పోలీసులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. బాధితురాలి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును పిటిషన్​లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హాథ్రస్​కు చెందిన 19ఏళ్ల యువతిపై గత నెల 14న కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 29న ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పోలీసులు అర్ధరాత్రి ఖననం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇదీ చూడండి:-'కూతుళ్లకు విలువలు నేర్పితే అత్యాచారాలు ఆగుతాయ్'

ABOUT THE AUTHOR

...view details