తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాహనాలకు ట్రాఫిక్​ పోలీసు.. విహంగాలకు పక్షిరాజు!

ఒడిశాకు చెందిన ఆ ట్రాఫిక్​ పోలీసు పక్షిరాజు (బర్డ్​మ్యాన్​)గా మారిపోయాడు. పదేళ్లుగా పావురాలకు ధాన్యం గింజలు అందిస్తూ పక్షి ప్రేమను చాటుతున్నాడు. ఆయన ఎక్కడ కనిపించినా పక్షులన్నీ ఆయన చెంతకు చేరతాయి. తమ ఆకలిని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞత తెలుపుతాయి!

By

Published : Jan 14, 2020, 7:08 AM IST

Updated : Jan 14, 2020, 8:22 AM IST

'Birdman' traffic cop feeds thousands of pigeons every day in Mayurbhanj
వాహనాలకు ట్రాఫిక్​ పోలీసు.. విహంగాలకు పక్షిరాజు!

చేతిలో లాఠీ పట్టుకుని, ఈల వేస్తూ కనిపించే ట్రాఫిక్​ పోలీసు ఆమడ దూరంలో ఉంటేనే.. అలికిడికి భయపడి పక్షులన్నీ తుర్రుమని ఎగిరిపోతాయి. కానీ, ఒడిశా మయూర్​భంజ్​లో ట్రాఫిక్​ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న సూరజ్​ కుమార్​ రాజ్​ వస్తే మాత్రం పక్షులన్నీ ఆనందంతో.. ఆయనపై వచ్చి వాలిపోతాయి. పదేళ్లుగా వాటికి ఆహారం అందిస్తూ, బర్డ్​మ్యాన్​గా అందరి మన్ననలు పొందుతున్నాడు ఈ పోలీసు.

వాహనాలకు ట్రాఫిక్​ పోలీసు.. విహంగాలకు పక్షిరాజు!

ఆకలి తీర్చేస్తాడు..

రోజు రోజుకూ ప్రకృతిని హరించేస్తున్న కాలుష్యం.. వీధుల్లో నిండిపోయిన విద్యుత్​ తీగలు, సెల్​ఫోన్​ టవర్లు వెదజల్లే రేడియేషన్ అన్నీ కలిసి​ ఇప్పటికే ఎన్నో అరుదైన పక్షి జాతులను అంతం చేస్తున్నాయి. ఇక నగరాల్లో సరైన ఆహారం, నీరు లభించక మరెన్నో విహంగాలు మృత్యువాత పడుతున్నాయి. స్వేచ్ఛకు ప్రతిరూపాలైన పక్షులు ఇలా నేలరాలిపోతూంటే.. 52 ఏళ్ల సూరజ్ మనసు చలించింది. తన వంతుగా వాటికి గింజలు వేస్తూ పక్షి జాతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.

వృత్తికి ట్రాఫిక్​ పోలీసే అయినా.. నిత్యం విధిగా వేలాది కాకులు, పావురాల కడుపు నింపుతున్నాడీ బర్డ్​మ్యాన్​.

"పదేళ్లవుతోంది.. నేను నా దారిలో వెళ్తున్నప్పుడు ఓ పావురం నాపై వాలింది. అప్పటి నుంచే వాటికి నేను ఆహారం పెట్టడం ప్రారంభించాను. రోజూ ఉదయాన్నే గుడికి వెళ్తాను.. ఆ తరువాత వాటికి ధాన్యం గింజలు పెడతాను. ఆ తరువాతే డ్యూటీకి వెళ్తాను. ట్రాఫిక్​ నియంత్రించడం నా విధి, అలాగే పావురాలకు ఆహారం పెట్టడం కూడా నా విధిగా మారింది. వాటిని చూడకపోతే ఆ రోజు నాకేమీ తోచదు."

- సూరజ్​ కుమార్​ రాజ్​, ట్రాఫిక్​ పోలీస్​ (పక్షిరాజు)

తమ ఆకలిని అర్థం చేసుకున్న ఈ పక్షిరాజంటే పావురాలకు ప్రాణం. సూరజ్​ ఎంతమందిలో ఉన్నా.. గుర్తుపట్టేసి మరీ తనపై వాలి, పలకరిస్తూ ఉంటాయి. రోజూ బర్డ్​మ్యాన్​ బండిని దూరం నుంచే గమనించి.. గుంపులు గుంపులుగా వచ్చి తన చుట్టూ చేరతాయి.
పక్షుల రక్షణకై తనదైన రీతిలో సేవ చేస్తోన్న సూరజ్​ను ఉన్నతాధికారులూ అభినందిస్తున్నారు..

"సూరజ్​ వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారు. ఆయన చాలా ఏళ్లుగా ఇలా పక్షులకు ఆహారం అందిస్తున్నాడు. స్థానికులు సూరజ్​ను పక్షిరాజుగా పిలుస్తుంటే.. మా పోలీస్​ శాఖకు ఎంతో గర్వంగా ఉంటుంది."

-అభిమన్యు నాయక్, అడిషనల్​ సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్

ఇదీ చదవండి:ఫేస్​బుక్ ప్రేమ: విదేశీ అమ్మాయితో మనోడి పెళ్లి

Last Updated : Jan 14, 2020, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details