తెలంగాణ

telangana

బిహార్ బరి​: అప్పుడు తండ్రులతో- ఇప్పుడు తనయులతో

By

Published : Oct 15, 2020, 5:25 PM IST

బిహార్​లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారాల్లో మునిగితేలుతున్నాయి అన్ని పార్టీలు. ఇప్పటికే హ్యాట్రిక్​ కొట్టిన నితీశ్​ కుమార్​.. నాలుగోసారి పగ్గాలందుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం అక్టోబర్​ 12 నుంచి ఎన్నికల ప్రచారాలను ప్రారంభించారు. అభివృద్ధే ప్రధాన అజెండాగా దూసుకెళ్తున్న కుమార్​.. ఈసారి యువ ప్రత్యర్థులతో తలపడనున్నారు. తండ్రుల ఆశయాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తేజస్వీ, చిరాగ్​ పాసవాన్​తో అమీతుమీ తేల్చుకుంటున్నారు.

Bihar Polls 2020
రణభేరిలో నితీశ్​: తండ్రులతో కాదు తనయులతో పోటీ

లాలూ ప్రసాద్​ యాదవ్, నితీశ్​ కుమార్, రామ్​ విలాస్​ పాసవాన్​... బిహార్​ రాజకీయ దిగ్గజాలు. బద్ధ శత్రువుల్లా కత్తులు దూసుకున్నా... కూటమి కట్టి అపూర్వ స్నేహితుల్లా ప్రజల ముందుకు వెళ్లినా వారికే చెల్లింది. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే నితీశ్​ తనతోటి ప్రత్యర్థులతో కాకుండా వారి తనయులతో పోటీపడుతున్నారు.

రామ్​ విలాస్​ పాసవాన్​ మరణించడం, లాలూ ప్రసాద్​ యాదవ్​ క్రియాశీలకంగా లేకపోవడం వల్ల వారి కుమారులైన చిరాగ్​ పాసవాన్​, తేజస్వీ యాదవ్​ వంటి యువ నేతలు బిహార్ బరిలోకి దిగారు. నితీశ్ సీఎం పీఠం కోసం వీరితోనే​ అమీతుమీ తేల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్​ తన ప్రచార ప్రణాళికలను మార్చుకున్నారు. అయితే అందులోనూ అభివృద్ధి తంత్రాన్ని వదలకపోవడం విశేషం.

అప్పుడు అలా...

2004 సాధారణ ఎన్నికల్లో సత్తా చాటిన యూపీఏ కూటమి(ఆర్​జేడీ-కాంగ్రెస్​)పై వాజ్​పేయీ నేతృత్వంలోని ఎన్​డీఏతో కలిసి 2005 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు నితీశ్​. తొలిసారి కాంగ్రెస్​, భాజపాను మించి రెండు ప్రాంతీయ పార్టీల మధ్య భీకర పోరు నడిచింది. అయితే ఆ ఎన్నికల్లో ప్రజలు నితీశ్​కు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజార్టీతో సీఎం పీఠంపై కూర్చోబెట్టారు.

అలా 2005లో పగ్గాలు చేపట్టిన నితీశ్​ అప్పట్నుంచి ఒక్కసారీ అధికారం కోల్పోలేదు. ఇదంతా నితీశ్​ పార్ట్​-1 రాజకీయ ప్రయాణం.

ఇంటర్వెల్​ తర్వాత సీన్​ ఛేంజ్​...

2005లో అధికారంలోకి వచ్చాక.. పోలీసు, న్యాయ వ్యవస్థలపై దృష్టి సారించారు నితీశ్​. క్రైమ్​ రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి.. బిహార్​ ఇమేజ్​ను పెంచారు.

భాజపా-జేడీయూ మధ్య పొత్తు కొనసాగుతున్న క్రమంలో.. 2013లో పీఎం అభ్యర్థి ఎంపిక కొద్దిపాటి అభిప్రాయ భేదాలు తెచ్చింది. రాజ్​గిర్​ నేషనల్​ కాన్​క్లేవ్​లో గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పేరును పీఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని నితీశ్​ వ్యతిరేకించారు. ఎన్​డీఏ నుంచి విడిపోయి.. ఆర్​జేడీ అధ్యక్షుడు లాలూతో కలిసి 2015లో అధికారం చేపట్టారు. ఈ సమయంలో ఆర్​జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినా పొత్తు ఒప్పందం వల్ల నితీశ్​ను ముఖ్యమంత్రిని చేశారు. తేజస్వీ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎంతోకాలం ఆ సఖ్యత కొనసాగలేదు. అభిప్రాయ భేదాలతో యూటర్న్​ తీసుకున్న నితీశ్​ కుమార్​.. 2017లో మళ్లీ ఎన్​డీఏతో జతకట్టారు. అదే సమయంలో అటూ ఇటూ ఊగిసలాడుతున్న పాసవాన్​ పార్టీ కూడా ఎన్​డీఏలో చేరింది.

కొత్త తరం నుంచి గట్టి పోటీ...

మూడు ఎన్నికల్లో తన తోటి ప్రత్యర్థులతో తలపడిన నితీశ్​.. 2020లో నాలుగోసారి మాత్రం బలమైన యువనేతలతో పోటీపడనున్నారు. అభివృద్ధి పేరుతో ఓట్లు సంపాదించిన నితీశ్​ను ప్రస్తుతం ఆయా ప్రత్యర్థి నేతల తనయులు ప్రశ్నలతో దాడి చేస్తున్నారు. 2005 నుంచి మూడుసార్లు అధికారంలో ఉన్న నితీశ్​ ఏం చేశారో చెప్పాలని లాలూ కుమారుడు తేజస్వీ డిమాండ్​ చేస్తున్నారు. వీటిపై ముఖ్యమంత్రి​ పక్కాగా మాట్లాడలేకపోతున్నారు. యువతకు ఉద్యోగాలు, 15 ఏళ్లలో బిహార్​ అభివృద్ధి, వరదల నియంత్రణ వంటి అంశాలపై ఎన్​డీఏ​ ప్రభుత్వాన్ని.. తేజస్వీ విమర్శిస్తున్నారు.

రామ్​ విలాస్​ పాసవాన్​ కుమారుడు రామ్​ విలాస్​ పాసవాన్​ సైతం నితీశ్​పై నిప్పులు చెరుగుతున్నారు. నితీశ్​ కోపిష్ఠి వ్యక్తిగా పేర్కొంటూ.. సమస్యలపై సరిగ్గా స్పందన ఉండదని మాటల దాడి చేస్తున్నారు. సీఎం​ అవినీతి పనుల వల్ల పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలు కావట్లేదనీ ఆరోపిస్తున్నారు.

7 పాయింట్ల అజెండాతో యుద్ధంలోకి..

243 స్థానాలున్న బిహార్​ శాసనసభకు మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ సారి నితీశ్​ను ఓడించాలని యువనేతలు పంతం మీదుంటే.. వారికి చెక్​ పెట్టేందుకు ఏడు పాయింట్లతో ప్రజల్లోకి వెళ్తున్నారు నితీశ్​. ప్రతిపక్షాల కౌంటర్లను తిప్పికొట్టడానికి అభివృద్ధినే అస్త్రంగా వాడుతున్నారు. స్వశక్త్​ మహిళ, సక్షమ్​ మహిళా ప్రచారంతో మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు కుమార్. మద్యం నిషేధం, కట్నం తీసుకోవడం నేరం వంటి నిర్ణయాలతో మహిళల ఓటు బ్యాంక్​ను ఒడిసి పట్టేందుకు యత్నిస్తున్నారు​. బిహార్​లో ప్రతి ఇంటికి కుళాయి నీరు, ప్రతి ఊరు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని హామీలు ఇస్తున్నారు. క్లీన్​ సిటీ-డెవలప్​మెంట్​ సిటీ, రవాణా, ఆరోగ్యం, విద్య రంగాల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్తున్నారు. అయితే నితీశ్​ ఎన్ని హామీలు, వాగ్దానాలు ఇస్తున్నా.. లాలూ, రామ్​ విలాస్​ పాసవాన్​ కుమారులు విమర్శలతో మోతెక్కిస్తున్నారు.

లాలూ, నితీశ్​, రామ్​ విలాస్​ వల్లే జేపీ ఉద్యమం ప్రారంభమైంది. అవినీతిని అంతం చేసి నిరుద్యోగం లేకుండా చేయలన్నదే దీని ధ్యేయం. అయితే ఆనాటి ఉద్యమం నీరుగారిందని.. 15 ఏళ్లలో జరిగిన అవినీతి, ఏర్పడిన నిరుద్యోగంపై విమర్శలు చేస్తున్నారు యువ నేతలు తేజస్వీ, చిరాగ్​. ఇరుపక్షాల వాదోపవాదాలు ప్రజలను ఎంతమేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

ఇదీ చూడండి: బిహార్​ బరి: ప్రజలపై నితీశ్​ 7 హామీల వర్షం

ABOUT THE AUTHOR

...view details