తెలంగాణ

telangana

బిహార్​ బరి: వామపక్షాలు అస్థిత్వం కాపాడుకునేనా?

By

Published : Oct 10, 2020, 8:28 PM IST

Updated : Oct 10, 2020, 9:30 PM IST

బిహార్​లో ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడింది. వామపక్ష భావజాలంతో బిహార్​లో ప్రజలను ఆకట్టుకుని.. సీట్లు కొల్లగొట్టిన పార్టీలు ఇప్పుడు పూర్తిగా డీలాపడ్డాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కంగుతిన్న కమ్యూనిస్టులు.. ఈసారి మహాకూటమి గూటికి చేరారు. మరి 2020 ఎన్నికల్లో వామపక్షాలు సత్తా చాటేనా? ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పార్టీకి ఆదరణ ఉన్న నేపథ్యంలో.. పకడ్బందీగా అడుగులేయాంటున్నారు 'ఈటీవీ భారత్'​ బిహార్​ డిప్యూటీ న్యూస్​ కో-ఆర్డినేటర్​ భూపేంద్ర దూబే.

Left parties
బిహార్​ బరి: ఉనికి కోసం పోరాడుతున్న వామపక్షాలు సత్తాచాటేనా ?

బిహార్​లో వామపక్షాలు అస్థిత్వం కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితులు గతంలోలాగా లేవు. ఏళ్లుగా ప్రజల కోసమే పోరాటం అని చెబుతూ వచ్చిన కామ్రేడ్లు.. తమ సొంత లక్ష్యాల కోసం, పార్టీని కాపాడుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని బిహారీలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులకు వామపక్షాలు వారిని వారే నిందించుకోవాల్సి వస్తోంది. దేశంలో ఉన్న కీలక సమస్యలపై పోరాడాల్సిన సమయంలో వామపక్షాలు మౌనంగా ఉండిపోవటం.. వారికి చేటు చేసింది.

స్వాతంత్ర్యం తర్వాత.. బిహార్​లోనే కాకుండా దేశవ్యాప్తంగా వామపక్షాలు బలమైన పునాదులు ఏర్పరుచుకున్నాయి. ఒక దశలో ప్రభుత్వాలను శాసించే స్థితిలో ఉండేవి. క్షేత్రస్థాయిలో నమ్మకమైన కామ్రేడ్లు ఉండేవారు. ఒక్కసారి వామపక్షాల్లోకి కూడా అవకాశవాద రాజకీయాలు ప్రవేశించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

అవకాశవాదమే అనర్థం!

ఇక జాతీయ స్థాయిలో కామ్రేడ్ల పనితీరు పరిశీలిస్తే.. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటులో 59 సీట్లు గెలుచుకున్న వామపక్షాలు కీలకపాత్ర పోషించాయి. అనంతరం పార్టీ పనితీరు క్షీణిస్తూ వస్తోంది. 2009 ఎన్నికల్లో 24 స్థానాలకే పరిమితమయ్యారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్​తో కలిసి బరిలోకి దిగటం.. క్షేత్రస్థాయిలో మద్దతుదారులకు పార్టీని దూరం చేసింది. ప్రజాపోరాటం అన్న నినాదాలకు విలువ లేకుండా పోయింది. ఇక 2014లో మోదీ మేనియాతో ఎర్రజెండాలు కేవలం 12 స్థానాల్లోనే రెపరెపలాడాయి.

బిహార్​లో ఘనచరిత్ర

ఇక బిహార్​ విషయానికి వస్తే.. ప్రభుత్వ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేది వామపక్షాల హవా. రాష్ట్రం నుంచి అత్యధికంగా 24మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలున్నాయి. 1972లో రాష్ట్రంలో సుశీల్​ ముఖర్జీ నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది సీపీఐ. 1991లో ఆ పార్టీ నుంచి 8మంది ఎంపీలు ఉండేవారు. అలాగే, సీపీఎం, సీపీఐ-ఎంఎల్​ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండేది. భూసంస్కరణలు, హక్కుల పోరాటాలు, అగ్రవర్ణాల దోపిడి-దారుణాలకు వ్యతిరకంగా గళమెత్తడం వంటి అంశాలు వారికి ప్రజల మద్దతు కూడగట్టాయి.

మొదలైన వ్యతిరేకత..

ప్రజల మద్దతు సంపాదించుకున్నా.. ప్రభుత్వ విధానాలకు వంతపాడటం వల్ల వ్యతిరేకత ఆరంభమైంది. ప్రజల హక్కుల కోసం పోరాడతామన్న కామ్రేడ్లు.. పార్టీ అంతర్గత సమస్యలతో జనాలకు దూరమవుతూవచ్చారు. 1969లో బిహార్​ మధ్యంతర ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ దక్కించుకోలేకపోయింది. ఈ దశలో కింగ్​మేకర్​గా అవతరించిన సీపీఐ.. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో సాయపడింది. ఇన్నాళ్లూ వారి విధానాలపైనే పోరాడి.. చివరకు వారికే మద్దతు ఇవ్వటం ప్రజలకు రుచించలేదు. ఈ నిర్ణయం దేశంలో కొత్త కమ్యూనిస్ట్​ రాజకీయాలకు తెరదీసింది.

జేపీ ప్రభావం

అయితే, రాష్ట్రంలో సీపీఐ 1972లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన మద్దతు కూడగట్టుకుంది. 1975లో జయప్రకాశ్​ నారాయణ​ ఉద్యమం బిహార్​ రాజకీయాలను మలుపు తిప్పింది. ఇందిరా గాంధీకి మద్దతు తెలిపిన వామపక్షాలు.. జేపీ ఉద్యమంతో భారీగా ప్రజల మద్దతు కోల్పోయారు.

అప్పటికే ప్రజల్లో ఆకర్షణ కోల్పోతున్న వామపక్షాలను.. 1979 మండల్​ కమిషన్​ మరింత దెబ్బతీసింది. సామాజిక న్యాయం పేరుతో కొత్త నేతలు పుట్టుకొచ్చారు. ఆ నేతలు ఇప్పటికీ నాటి ఉద్యమ ఫలితాలు అనుభవిస్తుండగా, ఎన్నో ఏళ్లు ప్రజా ఉద్యమాలు సాగించిన కామ్రేడ్లు నేడు ఉనికి కోసం పోరాడుతున్నారు. కర్పూరీ ఠాకూర్​, లాలూ యాదవ్​, నితీశ్​ కుమార్​, రాంవిలాస్​ పాసవాన్​.. పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి నినాదంతో బిహార్​ రాజకీయాల్లో దిగ్గజాలుగా మారారు. ముఖ్యంగా లాలూ.. తన మార్కు రాజకీయాలతో వామపక్షాల ఓటు బ్యాంకు కొల్లగొట్టారు. ఈ పరిస్థితుల్లో అస్థిత్వం కోసం ఎర్రజెండాలు పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది.

పడిపోయిన గ్రాఫ్​

లాలూ రాజకీయాలు.. కాంగ్రెస్​, వామపక్షాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించాయి. అయితే, మారుతున్న కాలంతో పాటే.. ఆర్జేడీ మద్దతు కూడా మారిపోయింది. వామపక్షాలకు మరిన్ని ఇబ్బందులు వచ్చిపడ్డాయి. 2005లో నితీశ్​ హవా మొదలైన తర్వా కామ్రేడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

పార్టీ పోటీ చేసిన స్థానాలు డిపాజిట్​ కోల్పోయినవి ఓట్ల శాతం
సీపీఐ-ఎంఎల్ 104 96 1.79%
సీపీఐ 56 48 1.69%
సీపీఎం 30 28 <1%

2005 ఎన్నికల్లో సీపీఐ ఒక్క స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది.

ఇక నితీశ్​ కుమార్​ అభివృద్ధి మంత్రం.. వామపక్షాలను మరింత కుంగదీసింది.

  • నితీశ్​ కుమార్​ ఘనవిజయం సాధించిన 2010 ఎన్నికల్లో.. మరింత దారుణ పరిస్థితులు ఎదుర్కున్నాయి లెఫ్ట్​ పార్టీలు. ఒక్క సీటు గెలవలేకపోయాయి.
  • ఇక 2015లో నితీశ్​-లాలూ పార్టీలు కలిసి పోటీ చేయగా.. 3 స్థానాల్లో గెలుపొందాయి వామపక్షాలు.
  • 2020 నాటికి డీలాపడిన ఎర్రజెండాలు.. మహకూటమిలో చేరిపోయాయి. ఆర్జేడీ-కాంగ్రెస్​ల ఓటు బ్యాంకుతో ఓట్లు రాబట్టాలని ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా 29 సీట్లలో పోటీ చేయనున్నారు.

అస్థిత్వ పోరాటం

ఇక వామపక్షాల ఓటు బ్యాంకును అత్యధికంగా లాగేసుకున్న బిహారీ నేతలు.. నితీశ్​ కుమార్​, రాంవిలాస్​ పాసవాన్. ఇప్పుడు ఇరువురి పార్టీలు భాజపాతో కలిసి పనిచేస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో.. వామపక్షాలు కంచుకోటలా ఉన్న బెగుసరయి స్థానంలోనూ విజయం సాధించలేకపోయారు.

మొత్తంగా.. వామపక్షాలు బిహార్​లో అస్థిత్వం కోసం పోరాడుతున్నాయి. 2020-శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్​లతో కలిసి ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోనున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో ఎంతమేరకు ప్రభావం చూపుతాయన్నది చెప్పలేని పరిస్థితి. ఈ ఎన్నికలు బిహార్​లో వామపక్షాల భవిష్యత్తుపై భారీగా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: బిహార్​ బరి: వామపక్షాలు సత్తా చాటేనా?

ఇదీ చూడండి: బిహార్​ బరి: తేజస్వీ ఓటమే లక్ష్యంగా భాజపా వ్యూహం

Last Updated : Oct 10, 2020, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details