తెలంగాణ

telangana

బిహార్​ ఫలితాలు: ఎన్​డీఏ 125.. మహాకూటమి 110

By

Published : Nov 10, 2020, 7:31 AM IST

Updated : Nov 10, 2020, 11:08 PM IST

bihar assembly poll results live updates
బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

23:05 November 10

ఎన్​డీఏ 125.. మహాకూటమి 110

బిహార్​ శాసనసభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ 125 స్థానాలు గెల్చుకుంది. మహాకూటమి 110 చోట్ల విజయం సాధించింది. ఎల్​జేపీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇతరులు 7 చోట్ల గెలిచారు. 

ఆర్​జేడీ, భాజపా సమంగా చెరో 74 స్థానాలు దక్కించుకున్నాయి. 

22:20 November 10

ఈసీ క్లారిటీ...

ఎన్నికల ఫలితాలను నితీశ్​కుమార్​ ప్రభావితం చేశారన్ని ఆర్​జేడీ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. తమపై ఎవరి ఒత్తిడి లేదని.. ఫలితాలను వెల్లడించడానికి అధికారులు, సిబ్బంది.. నిజాయతీగా కృషిచేస్తున్నారని పేర్కొంది.

22:11 November 10

ఆర్​జేడీ నిరసన...

ఆర్​జేడీ మద్దతుదారులు.. పట్నాలోని పార్టీ నేత రబ్రీదేవీ నివాసం వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఎన్నికల ఫలితాలను నితీశ్​ ప్రభావితం చేశారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

21:46 November 10

'ఎన్​డీఏ ఎలా గెలిచింది?'

బిహార్​లో ఎన్​డీఏ గెలుపుపై ఆర్​జేడీ ప్రశ్నల వర్షం కురిపించింది. మహాకూటమి మొత్తం 119 స్థానాల్లో గెలిచిందని చెబుతూ.. అందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేసింది ఆర్​జేడీ. తమ అభ్యర్థులు గెలిచినట్టు ఈసీ చెప్పి.. ఇప్పుడు ధ్రువీకరణపత్రాలు ఇవ్వడం లేదని ఆరోపించింది. ఇలాంటి వ్యవహారం ప్రజాస్వామ్యంలో పనికిరాదని తేల్చిచెప్పింది.

20:48 November 10

బిహార్‌లో మెజారిటీ మార్కు దాటిన ఎన్డీఏ

  • బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం
  • బిహార్‌లో మెజారిటీ మార్కు (122) దాటిన ఎన్డీఏ
  • బిహార్‌లో మొత్తం శాసనసభ స్థానాలు 243
  • బిహార్‌లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎన్డీఏ
  • ఎన్డీఏ కూటమికి చివరివరకు గట్టి పోటీ ఇచ్చిన మహాకూటమి
  • బిహార్‌లో కేవలం ఒకే స్థానంతో సరిపెట్టుకున్న ఎల్‌జేపీ
  • బిహార్‌లో ఏడు చోట్ల విజయం సాధించిన ఇతరులు

19:54 November 10

'200శాతం ఆర్​జేడీనే...'

బిహార్​లో హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆర్​జేడీ ఎంపీ మనోజ్​ ఝా. బిహార్​లో గెలుపు ఆర్​జేడీదేనని.. 200శాతం కచ్చితమని పేర్కొన్నారు.

కౌంటింగ్​ లెక్కల ప్రకారం.. ఎన్​డీఏ ముందంజలో ఉంది. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముంది. అయితే ఆర్​జేడీ నేతృత్వంలోని మహాకూటమి- ఎన్​డీఏ మధ్య సీట్ల వ్యత్యాసం తక్కువగా ఉండటం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

19:13 November 10

నితీశ్​ ఇంటికి సుశీల్...

ఓటింగ్ కీలక దశలో ఉన్న తరుణంలో బిహార్​లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం నితీశ్​ ఇంటికి ఉపముఖ్యమంత్రి సుశీల్​ మోదీ వెళ్లారు.

19:12 November 10

సీఎం నితీశ్​కు అమిత్ షా ఫోన్...

ఇరు కూటముల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోన్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. సీఎం నితీశ్​కు ఫోన్​ చేశారు.

18:53 November 10

హోరాహోరీ...

బిహార్​లో ఓట్లలెక్కింపు ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్ది ఎన్​డీఏ-మహాకూటమి మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. ఇంతసేపు వెనకంజలో ఉన్న మహాకూటమి.. అనూహ్యంగా పుంజుకుంది. ఫలితంగా అధికార-విపక్షాల ఆధిక్యంలో వ్యత్యాసం భారీగా తగ్గింది. దాదాపు 1.3కోట్ల ఓట్లు లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని నేతలతో సహా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

18:21 November 10

'తొందరేమీ లేదు..'

కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని కౌంటింగ్​ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఫలితాల ప్రకటనలో తొందరేమీ లేదని.. ప్రశాంతంగా పని చేయాలని ఎన్నికల సిబ్బందికి సూచించినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని స్పష్టం చేశారు.

17:51 November 10

'విజయం మాదే...'

బిహార్​లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుందని.. దానిని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు ఆర్​జేడీ ఎంపీ మనోజ్​ ఝా. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​పై తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఎన్నికల అధికారులకు నితీశ్​ కుమార్​ ఫోన్లు చేసి.. ఓట్ల లెక్కింపును ఆలస్యం చేయమని ఆదేశిస్తున్నట్టు విమర్శించారు. అలా చేస్తే నితీశ్​.. తన ఓటమిని తానే ఆలస్యం చేసుకున్నట్టు అవుతుందని ఎద్దేవా చేశారు ఝా.

17:41 November 10

తేజ్ ప్రతాప్ గెలుపు

లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హసన్​పుర్ స్థానం నుంచి గెలుపొందారు.

17:20 November 10

కౌంటింగ్​ కేంద్రం వద్ద ఉద్రిక్తత...

మధ్యప్రదేశ్​ ఇండోర్​లోని ఓ కౌంటింగ్​ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈవీఎంల ట్యాంపరింగ్​ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్​ అభ్యర్థి ప్రేమ్​చంద్​ గుడ్డూ కౌంటింగ్​ కేంద్రం వద్ద గందరగోళం సృష్టించారు. ఆయన మద్దతుదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఎన్నికల అధికారులు భాజపాతో చేతులు కలిపారని మండిపడ్డారు.

మధ్యప్రదేశ్​లో 28 స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా... ఓట్లలెక్కింపు కొనసాగుతోంది. అయితే అనేక సీట్లల్లో భాజపా హవా కనపడుతోంది.

17:11 November 10

'వచ్చే ఎన్నికల్లోనూ..'

2017 అసెంబ్లీ, 2019 లోక్​సభ ఎన్నికల మాదిరిగానే ఉత్తర్​ప్రదేశ్​లో ఈసారి జరిగిన ఉపఎన్నికల్లోనూ భాజపా మెరుగైన ప్రదర్శన కనబరిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అభిప్రాయపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపాయే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

16:57 November 10

మధ్యప్రదేశ్​లోనూ..

మధ్యప్రదేశ్​లోనూ భాజపా హవా కొనసాగుతోంది. మొత్తం 28 స్థానాలకు 'ఉప'పోరు జరగ్గా.. ఫలితాల్లో భాజపా జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భాజపా కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. అటు ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ నివాసం వద్ద కూడా పార్టీ శ్రేణులు భారీగా చేరుతున్నారు. వారందరికీ ఆనందంతో అభివాదం చేశారు సీఎం.

16:33 November 10

బిహార్​లో భాజపా జోరు...

బిహార్​ ఓట్లలెక్కింపులో భాజపా దూసుకుపోతోంది. పోటీ చేసిన అనేక ప్రాంతాల్లో భాజపా ఆధిక్యాన్ని సంపాదించింది. ఎన్​డీఏ కూటమిలోని కీలక పార్టీ అయిన జేడీయూను భాజపా వెనక్కి నెట్టడం గమనార్హం.

మరోవైపు సునాయసంగా గెలుస్తామని భావించిన విపక్షాల్లో ఆనందం సన్నగిల్లుతోంది. భాజపా కార్యాలయాలు సంబరాలతో కళకళలాడుతుంటే.. ఆర్​జేడీ- కాంగ్రెస్​ క్యాంప్​లు బోసిపోతున్నాయి.

15:06 November 10

భాజపా గెలిచేసింది...

గుజరాత్​ ఉపఎన్నికల్లో భాజపా విజయఢంకా మోగించింది. మొత్తం 8కి 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంబరాలు ప్రారంభమయ్యాయి.

14:49 November 10

భాజపా సందడి...

బిహార్​ సమరంలో ఎన్​డీఏ ఆధిక్యం సంపాదించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతల సంబరాలు మొదలయ్యాయి. రాజధాని పట్నాలో భాజపా మహిళా మోర్చా సభ్యులు ధోలక్​ వాయుస్తూ సందడి చేస్తున్నారు. 

14:33 November 10

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో ఎన్డీఏ 11 స్థానాల్లో విజయం సాధించింది. భాజపా 7, జేడీయూ 4 సీట్లు గెలిచాయి. ఆర్జేడీకి 2 సీట్లు దక్కాయి.

14:28 November 10

  • బిహార్‌ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం
  • కొవిడ్‌ నిబంధనల కారణంగా లెక్కింపులో జాప్యం
  • బిహార్‌లో గతంలో 20 రౌండ్లలోనే పూర్తయిన ఓట్ల లెక్కింపు
  • గతానికి భిన్నంగా ప్రస్తుతం 35 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • బిహార్‌లో ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు సాగే అవకాశాలు

14:21 November 10

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ 8 స్థానాల్లో గెలిచింది. మహాకూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. భాజపా 6, జేడీయూ 2, ఆర్జేడీ 2 సీట్లు కైవసం చేసుకున్నాయి.

14:15 November 10

ఎన్డీఏకు 3 సీట్లు

ఇప్పటివరకు వెల్లడైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా 2, జేడీయూ , ఆర్జేడీ ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.

14:10 November 10

బిహార్​ మంత్రి, జేడీయూ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్​.. సుపౌల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. జేడీయూ తరఫున తొలి విజయం నమోదు చేశారు.

14:05 November 10

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా బోణీ కొట్టింది. కేవటీ నియోజక  వర్గం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి మురళీ మోహన్ ఝా.. 8వేలకుపైగా ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థిపై గెలుపొందారు.

13:57 November 10

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా

మరికొన్ని గంటల్లో బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా. తాను చెప్పిన మాటలు రుజువు అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

13:42 November 10

కోటికిపైగా ఓట్ల లెక్కింపు..

బిహార్​లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా సాగుతోందని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. ఇప్పటివరకు కోటికిపైగా ఓట్లను లెక్కించినట్లు చెప్పారు. ఇంకా చాలా ఓట్లు లెక్కించాల్సి ఉందన్నారు.

13:31 November 10

ఆధిక్యంలోకి మాంఝీ

హిందుస్థాన్​ ఆవామ్ మంచ్​ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్​ రామ్​ మాంఝీ పుంజుకున్నారు. ఇమామ్​గంజ్​ స్థానంలో ఇంతకుముందు వరకు వెనుకంజలో ఉన్న ఆయన... ప్రత్యర్థి, ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ నారాయణ్​ చౌదరిపై 2,400ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.

12:58 November 10

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20 శాతం ఓట్లు లెక్కించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 80 శాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. 

ప్రస్తుతం ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతున్నా... తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠభరితంగా మారింది. అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదు.

12:27 November 10

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిపై ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతోంది.

12:03 November 10

వామపక్షాల పూర్వ వైభవం..

బిహార్​లో​ వామపక్షాలు పూర్వవైభవం సాధించాయి. మొత్తం 19 స్ధానాల్లో ఆ పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

11:59 November 10

పట్నాలో భాజపా కార్యాలయం

బిహార్ పట్నాలోని భాజపా కార్యాలయం వద్దకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమిపై ఎన్డీఏ అధిక్యం కనబరుస్తున్న నేపథ్యంలో సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

11:47 November 10

రఘోపుర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయన సోదరుడు తేజ్​ ప్రతాప్ యాదవ్​ కూడా హసన్​పుర్​ అసెంబ్లీ స్థానంలో ముందంజలో ఉన్నారు.

11:31 November 10

బిహార్ అసెంబ్లీ స్పీకర్, జేడీయూ నేత విజయ్ కమార్ చౌదరి వెనుకంజలో ఉన్నారు. సరాయ్​రంజన్​ నుంచి పోటీ చేస్తున్న ఆయనపై ఆర్జేడీ నేత అర్వింద్ కుమార్​ సహ్ని 230 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

11:00 November 10

తేజస్వీ ఆధిక్యం

మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​.. రఘోపుర్​ అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

10:52 November 10

భాజపా ఆధిక్యం

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి 125 సీట్లకు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. 100కిపైగా సీట్లలో మహాగట్‌బంధన్ ముందంజలో ఉంది.

10:48 November 10

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ఆధిక్యం కనబరుస్తోంది. మహాకూటమి గట్టి పోటీనిస్తోంది.

10:36 November 10

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభైన రెండు గంటలకే ఓటమిని అంగీకరించారు ఆ పార్టీ సీనియర్​ నేత కేసీ త్యాగి. కేవలం కరోనా ప్రభావం వల్లే తాము ఓడిపోతున్నామని చెప్పారు.

10:26 November 10

భాజపా విజయం

మణిపుర్​లో ఐదు శాసన సభ స్ధానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాజపా ఓ చోట గెలిచింది. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

10:26 November 10

బిహార్​లోని వాల్మీకీ నగర్​ పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో జేడీయూ ఆధిక్యంలో ఉంది.

10:21 November 10

ఆర్జేడీ నేత తేజ్​ ప్రతాప్ యాదవ్​

బిహార్​లోని హసన్​పుర్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ నేత తేజ్​ ప్రతాప్ యాదవ్​ వెనుకంజలో ఉన్నారు. జేడీయూ అభ్యర్థి రాజ్​కుమార్​ రాయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

09:35 November 10

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికార పీఠం కోసం ఎన్డీఏ, మహాకూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్డీఏ కంటే మహాకూటమే కాస్త ఆధిక్యం కనబరుస్తోంది.

09:03 November 10

బిహార్​లోని దర్భంగా అసెంబ్లీ స్థానంలో  భాజపా అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.

08:57 November 10

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పట్నాలోని తేజస్వీ యాదవ్ నివాసానికి చేరుకున్నారు పలువురు ఆర్జేడీ కార్యకర్తలు. తమ నాయకుని విజయాన్ని ఆకాంక్షిస్తూ ఫొటోలతో ప్రదర్శన చేపట్టారు.

08:27 November 10

తేజస్వీ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు
  • బిహార్‌లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • బిహార్‌: 243 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • బిహార్‌ వాల్మీకినగర్ లోక్‌సభ స్థానానికి ఓట్ల లెక్కింపు
  • బిహార్‌: 38 జిల్లాల్లో 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
  • బిహార్: పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు
  • బిహార్: పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు
  • బిహార్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
  • అధికార జేడీయూ, భాజపా కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ
  • ఎన్డీఏ కూటమి: జేడీయూ 115, భాజపా 110 స్థానాల్లో పోటీ
  • ఎన్డీఏ కూటమి: హిందుస్థానీ అవామ్‌ మోర్చా 7, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ 11 స్థానాల్లో పోటీ
  • మహాగట్ బంధన్‌గా బరిలోకి దిగిన ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు
  • మహాగట్ బంధన్‌: ఆర్జేడీ-144, కాంగ్రెస్‌-70, వామపక్షాలు 29 స్థానాల్లో పోటీ
  • 134 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగిన చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ
  • బిహార్ : అధికారం చేపట్టడానికి 122 స్థానాల్లో గెలుపు అవసరం

08:21 November 10

  • మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు
  • మధ్యప్రదేశ్‌: ఉపఎన్నికలు జరిగిన 28 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • భాజపా అధికారం నిలబెట్టుకునేందుకు 9 స్థానాలు గెలవడం తప్పనిసరి
  • జ్యోతిరాదిత్య వర్గం 25 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరికతో ఉపఎన్నికలు
  • మరో 3 అసెంబ్లీ స్థానాల్లోని ఎమ్మెల్యేల మృతితో ఉపఎన్నికలు
  • మధ్యప్రదేశ్‌ శాసనసభలో 230 అసెంబ్లీ స్థానాలు
  • మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బలాబలాలు: భాజపా- 107, కాంగ్రెస్‌- 87, మ్యాజిక్‌ మార్క్‌ 116
  • ఉపఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న 12 మంది మంత్రులు

08:03 November 10

  • బిహార్‌ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • బిహార్‌: 243 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • బిహార్‌ వాల్మీకినగర్ లోక్‌సభ స్థానానికి ఓట్ల లెక్కింపు
  • మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు
  • గుజరాత్‌లో 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు
  • మరో 8 రాష్ట్రాల్లో కలిపి 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు

07:20 November 10

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​

బిహార్​ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశలుగా పోలింగ్​ నిర్వహించగా.. నేడు ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్​డీఏలోని అనుభవజ్ఞుల నుంచి మహాకూటమి నేతృత్వంలోని యువశక్తికి 'అధికార పీఠం' చేతులు మారుతుందన్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాల నేపథ్యంలో.. దేశ ప్రజలు బిహార్​ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి..

ఓట్ల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 55 కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. సీఆర్​పీఎఫ్​కు చెందిన 19 కంపెనీలను రంగంలోకి దించింది. స్ట్రాంగ్​ రూమ్​లు, ఓట్ల లెక్కింపు హాళ్ల వద్ద ఈ భద్రతా సిబ్బందిని మోహరించనుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరో 59 కంపెనీలను దింపింది. ప్రతి కంపెనీలో 100 మంది సిబ్బంది ఉండనున్నారు. దీనితో పాటు స్థానిక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు తమ సహకారాన్ని అందించనున్నారు.

అయితే ఇక్కడ చిక్కంతా కరోనాతోనే. వైరస్​ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించింది ఈసీ. కానీ ఓట్ల లెక్కింపు వేళ.. కేంద్రాల వద్ద ఆయా పార్టీల సభ్యులు గుమిగూడకుండా చూసుకోవడం ఇప్పుడు ఈసీ ముందు ఉన్న అతిపెద్ద సవాలు.

ఎగ్జిట్​ పోల్స్​ మాట...

బిహార్​లో గత 15ఏళ్లుగా నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని ఎన్​డీఏ అధికారంలో ఉంది. అయితే ఈసారి ఆర్​జేడీ నేతృత్వంలోని మహాకూటమికే ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు అనేక ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​.. దేశంలో అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ నేతల్లో ఒకరైన నితీశ్​ను ఓడిస్తారని తేల్చిచెబుతున్నాయి. ఈ పరిణామాలు బిహార్​ సమరానికి మరింత ఉత్కంఠను జోడించాయి.

మహాకూటమి గెలిస్తే.. కాంగ్రెస్​, సీపీఐ, సీపీఐ-ఎమ్​, సీపీఐ ఎమ్​ఎల్​ వంటి పార్టీలకు రాజకీయంగా కొంత ఊరట లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖుల పోరు...

ఇప్పుడు అందరి చూపు ఆర్​జేడీ యువనేత తేజస్వీ యాదవ్​ పోటీచేస్తున్న రాఘోపుర్​ పైనే. సిట్టింగ్​ స్థానంలో మరోమారు గెలుపు రుచి చూడాలనుకుంటున్నారు తేజస్వీ. ఆయన తల్లిదండ్రులు లాలూప్రసాద్​ యాదవ్​, రబ్రీ దేవీ కూడా గతంలో ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి చేరారు. తేజస్వీ సోదరుడు తేజ్​ప్రతాప్​ యాదవ్​.. హసన్​పుర్​ నుంచి పోటీచేస్తున్నారు.

వీరితో పాటు రాష్ట్ర మంత్రులైన నంద్​ కిషోర్​ యాదవ్​(పట్నా సాహెబ్​), ప్రమోద్​ కుమార్​(మోతిహరి), రాణా రణ్​దిర్​(మధుబన్​), సురేశ్​ శర్మ(ముజఫర్​పుర్​), శర్వణ్​ కుమార్​(నలంద), జై కుమార్​ సింగ్​(దినార), కృష్ణనందన్​ ప్రసాద్​ వర్మ(జెహానాబాద్​) భవితవ్యం ఇవాళ తేలనుంది.

Last Updated : Nov 10, 2020, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details