తెలంగాణ

telangana

భోపాల్‌ విషాదాన్ని ఎదుర్కొని.. కొవిడ్‌తో ఓటమి!

భోపాల్ గ్యాస్‌ లీక్ బాధితుల పరిస్థితి హృదయవిదారకంగా మారింది. కరోనాతో మరణిస్తున్నవారిలో ఎక్కువ మంది గ్యాస్​లీక్ బాధితులే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. గడిచిన 15రోజుల్లోనే ఆరుగురు గ్యాస్‌ లీక్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం భోపాల్‌ మెమోరియల్‌ ఆస్పత్రి (బీఎంహెచ్‌ఆర్‌సీ) నిర్లక్ష్యమేనంటూ స్థానిక స్వచ్ఛంద సంస్థలు విమర్శిస్తున్నాయి.

By

Published : Sep 20, 2020, 7:23 AM IST

Published : Sep 20, 2020, 7:23 AM IST

Bhopal Victims dies more due to Corona
భోపాల్‌ విషాదాన్ని ఎదుర్కొని, కొవిడ్‌తో ఓటమి!

భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ విషాద ఘటన భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచాన్నే దిగ్భ్రాంతి పరిచిన విషయం తెలిసిందే. వేల మంది ప్రాణాలను బలితీసుకున్న ఆ దుర్ఘటన ప్రభావం లక్షల మంది భోపాల్‌ వాసులపై పడింది. అయితే, తాజాగా భోపాల్‌లో కరోనా వైరస్‌తో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది (దాదాపు 60-70శాతం) గ్యాస్‌లీక్‌ బాధితులేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి. జీవితంలో విషాదాన్ని మిగిల్చిన దుర్ఘటన నుంచి బయటపడినప్పటికీ మరో ముప్పు రూపంలో కరోనా వైరస్ వీరిని వెంటాడటం కలవరపెడుతోంది.‌

ఇదీ చదవండి-భోపాల్​లో 19 కరోనా మరణాల్లో 17మంది వారే

కరోనా వైరస్‌తో మృతి చెందుతున్న వారిలో ఎక్కువగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడుతోంది. ఈ సమయంలో భోపాల్‌ గ్యాస్‌లీక్ బాధితులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. 1984నాటి గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన నుంచి బతికి బయటపడినా, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం వీరికి కష్టంగా మారింది. కేవలం జూన్‌ నెలలో భోపాల్‌లో 60మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోగా వారిలో 45మంది గ్యాస్‌ లీక్‌ బాధితులే ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా గడిచిన 15రోజుల్లోనే ఆరుగురు గ్యాస్‌ లీక్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. దీనికి భోపాల్‌ మెమోరియల్‌ ఆస్పత్రి (బీఎంహెచ్‌ఆర్‌సీ) నిర్లక్ష్యమే ప్రధాన కారణమంటూ స్థానిక స్వచ్ఛంద సంస్థలు విమర్శిస్తున్నాయి.

నిర్మించిన ఆస్పత్రి గాలికే!

భోపాల్ గ్యాస్‌ లీక్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఈ బీఎంహెచ్‌ఆర్‌సీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని అప్పట్లో నిర్మించారు. అయితే, ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఈ ఆసుపత్రిలో వైద్య సేవలను గాలికొదిలేశారు. దీంతో గ్యాస్‌ లీక్‌ బాధితులకు సరైన సమయంలో వైద్యం అందక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిని ఈ ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదనే వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌, ఐసీయూ సేవలను అందించడంలో ఆసుపత్రి వర్గాలు విఫలమయ్యాయనే విమర్శలున్నాయి. ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతోపాటు అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడంతో భోపాల్‌ గ్యాస్‌ లీక్ బాధితులు చనిపోతున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.

హృద్రోగ, శ్వాసకోశ సమస్యలూ

ఇదిలాఉంటే, 1988 నుంచి 2016వరకు సేకరించిన సమాచారం ప్రకారం, గ్యాస్‌ లీక్‌ బాధితుల్లో దాదాపు 50శాతం మందికి హృద్రోగ సమస్యలతో బాధపడుతుండగా, 59శాతం మంది శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ప్రస్తుతం వీరికి కరోనా మహమ్మారి మరింత ముప్పుగా వాటిల్లింది. సాధారణ ప్రజల కంటే గ్యాస్‌ లీక్‌ ప్రభావానికి లోనైన భోపాల్‌ వాసులకు కరోనా ముప్పు భారీగా ఉంటుందని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.

తాజాగా కరోనా సోకి గ్యాస్‌ లీక్‌ బాధితుల చనిపోతున్న విషయాన్ని అక్కడి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అంతేకాకుండా గ్యాస్‌లీక్‌ బాధితుల పరిహారం విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన పర్యవేక్షణ కమిటీకి స్వచ్ఛంద సంస్థలు ఈ నివేదికలు అందించాయి. వైరస్‌ బారినపడ్డ గ్యాస్‌లీక్‌ బాధితుల ప్రాణాలకు కాపాడటం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్వచ్ఛంద సంస్థలతోపాటు భోపాల్‌వాసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఇదీ చదవండి-నేటికీ వెంటాడుతున్న భోపాల్ పాపాల్​

ABOUT THE AUTHOR

...view details