విమర్శలు, ప్రతివిమర్శలు, పోటాపోటీ ప్రచార సభలతో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
'భారత్కు ఇవే ఆఖరి ఎన్నికలు!'
"దేశంలో ప్రస్తుతం జరిగే ఎన్నికలే చివరివి. 2024లో మళ్లీ ఎన్నికలు ఉండవు" అని భాజపా ఎంపీ సాక్షి మహరాజ్ జోస్యం చెప్పారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఉన్నావ్లో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు భాజపా ఎంపీ సాక్షి మహరాజ్. 2024లో లోక్సభ ఎన్నికలు జరగకపోవచ్చని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల తరహాలో ఈసారీ మోదీ కేంద్రంగానే ఎన్నికలకు వెళ్తామని అన్నారు.
2019 ఎన్నికల్లో మోదీ సునామీ ఉంది. నరేంద్రమోదీ మొత్తం ప్రపంచానికే నేత. ఇప్పుడు జరగనున్న ఎన్నికలు పార్టీకి సంబంధించినవి కావు. దేశానికి సంబంధించినవి. మరోసారి దేశం జాగృతం అయింది. ఈ ఎన్నికల తరువాత 2024 ఎన్నికలు జరగకపోవచ్చు అని నాకు అనిపిస్తోంది. కేవలం ఈ ఎన్నికలే జరుగుతాయి. ఇందులో దేశం పేరు మీద పోరాటం జరగనుంది.
- సాక్షి మహరాజ్, భాజపా ఎంపీ