తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2020, 8:16 AM IST

ETV Bharat / bharat

కరోనాపై పోరు: మలి దశలో మరింత జాగ్రత్త!

భారత్​లో విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మూడు వారాల దేశవ్యాప్త 'లాక్‌డౌన్‌' ఘట్టం రెండో అర్ధభాగం మొదలైంది. పరిస్థితుల్ని ఇలా క్రమంగా సాధారణీకరించే కృషితోపాటు- అనుమానితులకు పరీక్షల నిర్వహణ, వారితో సన్నిహితంగా ఉన్నవాళ్ల ఆనుపానుల వెలికితీత... ఎక్కడా వేగం తగ్గకూడదు. ఇకమీదట ప్రాణ నష్టాన్ని కనిష్ఠస్థాయికి కుదించడమే ఉమ్మడి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా ముందడుగు వేయాలి!

Be careful of   corona virus latest updates in India
మలి దశలో మరింత జాగ్రత్త!

మహమ్మారి కరోనా వైరస్‌ దూకుడుకు పగ్గాలు వేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మూడు వారాల దేశవ్యాప్త 'లాక్‌డౌన్‌' ఘట్టం రెండో అర్ధభాగం మొదలైంది. ఆయన మాటల్లో, ఇప్పటివరకు సరైన విరుగుడు లేని వైరస్‌ను కట్టడి చేయడంలో జన సంచార నియంత్రణే కీలకంగా మారింది. అమెరికా, ఐరోపాలతో పోలిస్తే దేశీయంగా కొవిడ్‌-19 కేసుల నమోదు వేగం తక్కువగానే ఉన్నా, దిల్లీ నిజాముద్దీన్‌ ఘటనానంతరం వివిధ రాష్ట్రాల్లో నిర్ధారిత బాధితుల సంఖ్య పోటెత్తుతున్న తీరు తీవ్రంగా ఆందోళనపరుస్తోంది. వైరస్‌ తాకిడి అధికంగా ఉన్న ప్రజ్వలన కేంద్రాలు (హాట్‌స్పాట్లు) విస్తరిస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రులతో వీడియో సదస్సులో ప్రధాని సంక్లిష్ట ప్రశ్న లేవనెత్తారు. లాక్‌డౌన్‌ ఉపసంహరించాక ఏప్రిల్‌ 14వ తేదీ తరవాత పరిస్థితి అదుపు తప్పకుండా కాచుకోవడానికి రాష్ట్రాల సన్నద్ధత ఏమిటని మోదీ సూటిగా ప్రశ్నించారు.

మూడు వారాల దిగ్బంధాన్ని తలపెట్టిందే కరోనా వైరస్‌ గొలుసును తెగతెంచడం కోసం. అటువంటిదిప్పుడు ఒక్కసారిగా ఆంక్షల గేట్లెత్తేయగానే, ప్రజానీకం మూకుమ్మడిగా వీధుల్లోకి వచ్చేసి ఎక్కడికక్కడ గుమిగూడితే- ఇన్నాళ్ల కట్టుబాటు బూడిదలో పోసిన పన్నీరు చందం కాకమానదు. ప్రజ్వలన కేంద్రాలుగా గుర్తించిన చోట్ల పౌరుల కదలికలపై ఆంక్షల్ని ఇంకొన్నాళ్లు కొనసాగిస్తూ, తక్కిన ప్రాంతాల్లో వీలైనన్ని జాగ్రత్తలు పాటించడం శ్రేయోదాయక వ్యూహమవుతుంది. ఈనెల 14వ తేదీ తరవాతి ప్రయాణాలకు టికెట్లు జారీచేసే స్వేచ్ఛ విమానయాన సంస్థలకు ఉందని అధికారిక వివరణ చాటుతోంది. పరిస్థితుల్ని ఇలా క్రమంగా సాధారణీకరించే కృషితోపాటు- అనుమానితులకు పరీక్షల నిర్వహణ, వారితో సన్నిహితంగా మసలినవాళ్ల ఆనుపానుల వెలికితీత... ఎక్కడా వేగం తగ్గకూడదు. ఇకమీదట ప్రాణ నష్టాన్ని కనిష్ఠస్థాయికి కుదించడమే ఉమ్మడి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా ముందడుగు వేయాలి!

అంచెలవారీ పద్ధతి

భారత్‌లో లాక్‌డౌన్‌ ప్రకటనకు రెండు నెలల ముందే కరోనా విధ్వంసక కేంద్రమైన వుహాన్‌ నగరంలో అమలులోకి వచ్చిన ఆంక్షలు, హుబే ప్రావిన్స్‌లోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. ఇక్కడ ‘జనతా కర్ఫ్యూ’ తేదీనాటికే అక్కడ కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వుహాన్‌, ఇతర నగరాల్లో రెండు నెలల నిషేధపుటుత్తర్వుల ఎత్తివేతకు చైనా ప్రభుత్వం అంచెలవారీ పద్ధతి పాటించింది. స్థానికులు బయటకు వెళ్ళడంపై ఆంక్షలు కొనసాగిస్తూ, షరతులతో వెలుపలి వ్యక్తుల రాకపోకల్ని అనుమతిస్తున్నారు. వుహాన్‌లో మినహా తక్కిన చోట్ల రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు తిరిగి పనిచేస్తున్నాయి.

సంక్షుభిత కేంద్రంగా పరువు మాసి కుమిలిపోయి తేరుకున్న వుహాన్‌లో సబ్‌వే వ్యవస్థకు పచ్చజెండా ఊపిన యంత్రాంగం, మలి అంచెలో దుకాణ సముదాయాల పునరారంభానికి అనుమతించింది. బ్యాంకులు, బస్సులపై ఆంక్షలు సడలించినప్పటికీ- 65 ఏళ్లకు పైబడినవారిని అత్యవసరమైతేనే తప్ప ప్రజా రవాణా వినియోగానికి అనుమతించడం లేదు. కొత్తగా కేసులేవీ వెలుగు చూడనంత మాత్రాన వైరస్‌ ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనుకునే వీల్లేదన్న హుబే ఆరోగ్య కమిషన్‌ సారథి లూ డొంగ్రూ వ్యాఖ్య అక్షర సత్యం. స్థానిక స్థితిగతులకు అనుగుణంగా ఇక్కడా అటువంటి అంచెలవారీ కార్యాచరణ వ్యూహాలకు ప్రభుత్వాలు పదునుపెట్టాలి. విస్తృత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో నిర్దిష్ట విధి నిషేధాలను కచ్చితంగా అమలుపరచగల నిబద్ధతే, ఈ నిర్ణయాత్మక దశలో జాతికి రక్షరేకు అవుతుంది!

లాక్‌డౌన్‌ నిర్ణయం ఎంతో సాహసోపేతం

నిర్బంధ మూసివేత కొనసాగినన్నాళ్లు ప్రతి రోజూ దేశార్థికానికి రూ.35 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతున్నదని అంచనా. మూడు వారాల వ్యవధిలో అది దాదాపు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకుతుందన్న విశ్లేషణ, లాక్‌డౌన్‌ నిర్ణయం ఎంత సాహసోపేతమైందో చాటుతోంది. ఆర్థికంగా లాభనష్టాల బేరీజు కన్నా తమకు ప్రజల ప్రాణాల సంరక్షణే ప్రాధాన్యాంశమని ప్రధాని మోదీ లోగడే స్పష్టీకరించారు. ఈ లోతుపాతుల్ని గాలికొదిలేసి, లాక్‌డౌన్‌ గడువు ముగియగానే- యుద్ధంలో విజయం సాధించేశామంటూ జనం హర్షాతిరేకాలతో రోడ్డెక్కారా... కొరివితో తల గోక్కున్నట్లే. వ్యక్తిగత జాగ్రత్తలను పాటించకపోయినా, పర్యవసానాల సంగతి విస్మరించి అలవాటులో పొరపాటుగా సమూహాలతో సన్నిహితమైనా- దేశంలో పట్టపగ్గాల్లేని కరోనా విజృంభణకు బాటలు పరచినట్లే.

అంటువ్యాధిగా కొవిడ్‌-19 కోరలు తొడుక్కుంటే సువ్యవస్థిత ఆరోగ్య వసతులున్న యూకే, అమెరికా, ఇటలీ వంటివే దిక్కుతోచక అల్లాడిపోవడం చూస్తున్నాం. అటువంటి దుస్థితి ఇక్కడ దాపురించకూడదన్న పట్టుదలతో జాతి యావత్తూ ఏకతాటిపై కదలాల్సిన తరుణమిది. బెంగళూరు, మైసూరు, చిక్కబళ్లాపుర ప్రభృత జిల్లాల్లోని కరోనా ప్రజ్వలన కేంద్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగించదలచినట్లు కర్ణాటక చెబుతోంది. ఏ రాష్ట్రానికా రాష్ట్రం హాట్‌స్పాట్ల జాబితాలో కొత్తవి వచ్చి చేరకుండా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది. ధాన్య సేకరణ మొదలు మతపరమైన సమావేశాల వరకు సమూహాల రూపేణా పొంచి ఉన్న భారీ ఉపద్రవంపై పలువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే విలువైన సూచనలు చేశారు. ‘ఒక్కరి కోసం అందరు... అందరి కోసం ఒక్కరు’ అన్న సంక్షేమ రాజ్యభావనకు గొడుగు పడుతూ, కరోనా నియంత్రణలో విదేశీ అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చి- ప్రజలు, ప్రభుత్వాలు సంఘటితంగా విజయం సాధించాలి. మునుపెన్నడెరుగని ఈ ఆపత్కాలంలో, కరోనాపై ఉమ్మడి పోరు ఒక్కటే... దేశానికి దిక్సూచి!

ఇదీ చూడండి :మహారాష్ట్రపై కరోనా పంజా.. ఒక్క రోజులో ఆరుగురు బలి

ABOUT THE AUTHOR

...view details