తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనుమానాలు, ఆశలతో భారత్​కు షేక్​ హసీనా - అనుమానాలు, ఆశలతో భారత్​కు షేక్​ హసీనా

గురువారం నుంచి బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా భారత్​లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ సహా మరికొందరు అగ్రనేతలతో సమావేశంకానున్నారు హసీనా. భారత ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు బంగ్లాదేశ్​ ప్రధాని.

అనుమానాలు, ఆశలతో భారత్​కు షేక్​ హసీనా

By

Published : Oct 2, 2019, 2:23 PM IST

Updated : Oct 2, 2019, 9:19 PM IST

బంగ్లాదేశ్​ ప్రధానమంత్రి షేక్​ హసీనా గురువారం నుంచి నాలుగు రోజులపాటు భారత్​లో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం హసీనా భారత్​లో పర్యటించడం ఇదే తొలిసారి.

ప్రపంచ ఆర్థిక సదస్సుకు అనుబంధంగా గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత ఆర్థిక సదస్సులో హసీనా ప్రసంగించనున్నారు. ఈ సదస్సుల్లో సింగపూర్​ ఉప ప్రధాని, ఆర్థికమంత్రి హెంగ్​ స్వీ కియట్​, దక్షిణాసియాలోని యూఎన్​ మహిళా రాయబారి, భారత్​ టెన్నిస్​ స్టార్​ క్రీడాకారిణి సానియా మీర్జా సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొనున్నారు.

5న మోదీతో భేటీ...

ఈ నెల 5న భారత ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు హసీనా. మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరు నేతలు భారత్​లో భేటీకావడం ఇదే తొలిసారి కానుంది.

వివిధ ఒప్పందాలతో పాటు ప్రధానులు ఇద్దరు కలిసి మూడు ద్వైపాక్షిక ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభిస్తారని భారత విదేశాంగశాఖ తెలిపింది.

మోదీతో పాటు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, విదేశాంగమంత్రి జయ్​శంకర్​, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బంగ్లాదేశ్​ ప్రధాని సమావేశం కానున్నారు. తన తండ్రి బంగబంధు షేక్ ముజిబర్ రెహ్మాన్​ బయోపిక్​ నిర్మాణంపై ప్రముఖ దర్శకుడు శ్యామ్​ బెనగల్​తో హసీనా చర్చించనున్నారు.

ఎన్​ఆర్​సీపై ఆందోళన...

ఎన్​ఆర్​సీపై బంగ్లాదేశీయుల్లో అందోళన వ్యక్తమవుతున్న తరుణంలో హసీనా భారత్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల న్యూయార్క్​ ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎన్​ఆర్​సీ వ్యవహారం మోదీ, హసీనా మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని హసీనాకు మోదీ హామీ ఇచ్చినట్టు బంగ్లాదేశ్​ విదేశాంగమంత్రి అబ్దుల్​ మోమెన్​ తెలిపారు. అయితే సమావేశం అనంతరం భారత విదేశాంగశాఖ జారీ చేసి ప్రకటనలో ఎన్​ఆర్​సీ అంశం లేదు.

సమస్య పరిష్కారానికి మోదీ హామీ ఇచ్చారని బంగ్లాదేశే చెబుతున్నా... ఎన్​ఆర్​సీ వ్యవహారం ఆ దేశ పాలకులను కలవరపెడుతోంది. భారత్​లో ఎన్​ఆర్​సీ చుట్టూ నెలకొన్న రాజకీయాలు.., భాజపా,ఆర్​ఎస్​ఎస్​ నేతల వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం. బంగ్లాదేశీ వలసదారులను ఉద్దేశించి భారత హోంమంత్రి అమిత్​ షా ప్రయోగించిన పదజాలం ఎంతో అవమానకరంగా ఉందని తమ దేశస్థులు భావిస్తున్నట్టు హసీనా ప్రభుత్వంలోని ఓ అధికారి తెలిపారు.

ఈ విషయంపై ఢాకా కేంద్రంగా పనిచేసే ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పాలసీ, అడ్వొకసి, గవర్నెన్స్(ఐపీఏజీ) ఛైర్మన్​ స్పందించారు.​

"ఎన్​ఆర్​సీపై భారత్ నుంచి బంగ్లాదేశీయులు స్పష్టమైన ప్రకటన ఆశిస్తున్నారు. అమిత్​ షా వ్యాఖ్యల వల్ల.. ప్రధానికి మోదీ ఇచ్చిన హామీలో విశ్వసనీయత కనిపించడం లేదు."
--​ మునిర్​ ఖాస్రూ, ఐపీఏజీ ఛైర్మన్​.

ఆగస్టు 31న విడుదలైన అసోం ఎన్​ఆర్​సీ వల్ల దాదాపు 19 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. అయితే ఎన్​ఆర్​సీ భారత అంతర్గత విషయమని బంగ్లాదేశ్​ అంగీకరించింది.

"ఎన్​ఆర్​సీ జాబితాలో లేని వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్​లో జీవించే అవకాశం లభించకపోతే.. వీరిలో అనేక మంది బంగ్లాదేశ్​కు వలస వస్తారని బంగ్లాదేశ్​ భయపడుతోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే. ఎన్నో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఎన్​ఆర్​సీ ప్రక్రియ ఇంకా అసంపూర్ణంగానే ఉంది. భాజపా, ఆర్​ఎస్​ఎస్​ ప్రకటనలు భయాన్ని పెంచుతున్నాయి."
--- పినాక్​ చక్రవర్తి, భారత మాజీ రాయబారి.

నదీ జలాల పంపకాలపై సందిగ్ధం...

తీస్తా సహా ఇరు దేశాలకు చెందిన 54 నదీజలాల పంపకాలపై ఎన్నో ఏళ్లుగా సందిగ్ధం నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు ఫలితం దక్కలేదు. హసీనా తాజా పర్యటనలో ఈ సమస్య పరిష్కారం దిశగా కీలక చర్చలు జరగనున్నాయి.

గత 5ఏళ్ల పాలన సమయంలోనే తీస్తా నదీ జలాల సమస్యను పరిష్కరించాలని మోదీ-హసీనా భావించారు.

నిజానికి తీస్తా నదీజాలలకు సంబంధించిన ఒప్పందంపై మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ 2011లోనే సంతకం పెట్టాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుపడడం వల్ల ఒప్పందం కుదరలేదు. రాజకీయాలతో ముడిపడిన సున్నితమైన అంశం ఇది.

"తమ దేశం నుంచి భారత్​లోకి జరుగుతున్న అక్రమ చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాల కట్టడిలో హసీనా విజయం సాధించారు. దీని వల్ల భారత్-బంగ్లా సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొంది. ఎంతో కాలంగా మిగిలిపోయిన తీస్తా నదీ జలాల ఒప్పందంపై భారత్​ సంతకం చేయడం, ఎన్​ఆర్​సీ సమస్యలను పరిష్కరించడం రాజకీయ గౌరవానికి సంబంధించినవి."
--​ మునిర్​ ఖాస్రూ, ఐపీఏజీ ఛైర్మన్​.

బంగ్లాదేశ్​లో ఉంటున్న రోహింగ్యాలను మయన్మార్​కు తిరిగి పంపే అంశంపై భారత్​ వైఖరి, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ప్రధానమంత్రులు ప్రధానంగా చర్చించే అవకాశముంది.

(రచయిత- స్మితా శర్మ, సీనియర్ పాత్రికేయురాలు)

Last Updated : Oct 2, 2019, 9:19 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details