"సొంత ఆసక్తుల కంటే ముందు జాతీయ, సాంఘిక ప్రయోజనాలు నెరవేర్చడమే ప్రతి పౌరుడి ప్రథమ బాధ్యత."
- ఈశ్వర చంద్ర విద్యాసాగర్, ప్రముఖ బంగాలీ సంఘ సంస్కర్త
ఈ అమృతవాక్కులు ప్రముఖ బంగాలీ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మనఃఫలకం నుంచి ఉదయించినవి.
బంగాల్ పునరుజ్జీవనోద్యమ ఆద్యుల్లో ఒకరు ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఓ గొప్ప మానవతావాది, మేధావి, సంఘ సంస్కర్త. బంగాల్లోని అన్ని వర్గాలవారికీ అత్యంత గౌరవనీయుడు.
ధ్రువతార...
అందరికీ ఆరాధ్యుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పేద బంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో 1820 సెప్టెంబర్ 26న జన్మించారు. తల్లి భాగబతి దేవి గృహిణి. తండ్రి ఠాకూర్దాస్ బందోపాధ్యాయ గుమస్తాగా పనిచేసేవారు. విద్యాసాగరుడు చిన్నతనంలో కఠిన పేదరికాన్ని అనుభవించారు. ఇది ఆయనలో పేదల పట్ల ఔదార్యాన్ని పెంచింది.
స్వగ్రామంలోనే ప్రాథమిక చదువు పూర్తిచేసిన విద్యాసాగర్... కోల్కతాలో ఆంగ్ల విద్యాభ్యాసం చేశారు. తరువాత తండ్రి కోరిక మేరకు 1829లో సంస్కృత కళాశాలలో చేరారు. వేద, వేదాంత, అలంకార శాస్త్రాలతోపాటు, భారతీయ తత్వశాస్త్రాల్లోనూ నిష్ణాతులయ్యారు.
ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1859లో 'మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్'ను స్థాపించారు. ఆంగ్ల మాధ్యమంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందించే ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పారు. 1917లో 'విద్యాసాగర్ కళాశాల'గా పేరు మార్చారు. ఈ కళాశాలలోని విగ్రహాన్నే ఇటీవల దుండగులు ధ్వంసం చేశారు.
సంఘ సంస్కరణ...
సాధారణ జీవనానికి, ఉన్నతమైన ఆలోచనలకు ఆయన ఉదాహరణ. విద్యాసాగర్ విస్తృత అధ్యయనం మాత్రమే కాకుండా, సామాజిక, విద్యా సంస్కరణలకు పాటుపడ్డారు. పేదలకు, అణిచివేతకు గురైన వారికి ప్రేమతో చేయూత అందించారు.