తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య కేసు: జులై 25 నుంచి రోజూ విచారణ! - మధ్యవర్తిత్వ కమిటీ

అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వ కమిటీ వాస్తవ నివేదికను ఈ నెల 18 లోపు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అవసరమైతే ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని తెలిపింది.

అయోధ్య కేసు

By

Published : Jul 11, 2019, 12:11 PM IST

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 18లోపు నివేదిక సమర్పించాలని అయోధ్య వివాదంలో శాశ్వత పరిష్కారానికి ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీని సుప్రీంకోర్టు కోరింది. నివేదికను పరిశీలించాక అవసరమనుకుంటే ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని తెలిపింది.

అయోధ్య భూ వివాదంపై త్వరగా విచారణ చేపట్టాలని కేసులోని ఫిర్యాదుదారు గోపాల్​ సింగ్ విశారద్​ వ్యాజ్యం దాఖలు చేశారు. వివాద పరిష్కారానికి ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ ప్రయత్నాల్లో పెద్దగా పురోగతి లేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

గోపాల్​ పిటిషన్​ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ కేసు

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు మార్చి 8న కీలక నిర్ణయం తీసుకుంది. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా ఛైర్మన్​గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్​ న్యాయవాది శ్రీరామ్​ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్​ రంజన్ ​గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.​ నివేదిక సమర్పించేందుకు ప్యానెల్​కు 8 వారాల గడువు ఇచ్చింది.

జస్టిస్​ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్​... ఉత్తర్​ప్రదేశ్​ ఫైజాబాద్​ వేదికగా భాగస్వామ్యపక్షాలతో సమాలోచనలు జరిపింది. మొదటి దఫాలో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో మే నెలలో సుప్రీంకోర్టుకు అందజేసింది. ప్యానెల్​ అభ్యర్థన మేరకు మధ్యవర్తిత్వానికి గడువును ఆగస్టు వరకు పెంచింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి: అయోధ్యపై మధ్యవర్తిత్వం

ABOUT THE AUTHOR

...view details