తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హామీ నెరవేరుతున్న వేళ 'కమలా'నందం - BJP leaders comments on Ram Mandir Bhumi poojan

భాజపా హామీల్లో ఒకటైన అయోధ్య రామ మందిరం నిర్మాణం సాకారమవుతున్న తరుణంలో కమలనాథుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తమ పార్టీ సాధించిన సైద్ధాంతిక విజయానికి ప్రతీకగా ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Ayodhya ceremony: Another core BJP promise fulfilled under Modi
హామీ నెరవేరుతున్న వేళ 'కమలా'నందం..

By

Published : Aug 5, 2020, 1:30 PM IST

తమ పార్టీ కీలక హామీల్లో ఒకటైన అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమవుతోందని భాజపా నేతలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పార్టీ సాధించిన సైద్ధాంతిక విజయంగా నేతలు అభివర్ణిస్తున్నారు. గతంలో భాజపా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటైనా.. భాగస్వామ్య పార్టీలను మచ్చిక చేసుకునేందుకు రామ మందిర నిర్మాణాన్ని ఆ పార్టీ పక్కనపెట్టింది. ఇప్పుడు అదే మందిర నిర్మాణాన్ని చేపడుతుండగా అనేక మంది విపక్ష నేతలు కూడా ప్రశంసిస్తున్నారని కమలనాథులు గుర్తు చేస్తున్నారు. హిందూత్వ విశ్వాసాలను ఈ మందిర నిర్మాణం ఇంకా ఏకీకృతం చేస్తుందని భావిస్తున్నారు.

నేటితో ఏడాది పూర్తి..

అలాగే భాజపా కీలక హామీల్లో ఒకటైన జమ్ముకశ్మీర్​లో 'ఆర్టికల్​-370 రద్దు' అయి సరిగ్గా ఏడాది కావడం గమనార్హం. 'మాకు సంబంధించి మందిర నిర్మాణం ఒక విశ్వాసం. అది రాజకీయ అంశమనేది ఎప్పుడో ముగిసిన అంకం. ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ మేం రామ మందిర నిర్మాణం, ఆర్టికల్​-370 రద్దుని గురించి ప్రముఖంగా ప్రస్తావించాం. ఆ రెండు ఆ హామీలు ఇప్పుడు నెరవేరాయి.' అని ఓ భాజపా నేత చెప్పారు.

ప్రస్తుతం కాంగ్రెస్​ నేతలు ప్రియాంకా గాంధీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు కమల్​నాథ్​, దిగ్విజయ్​ సింగ్​ తదితరులు మందిర నిర్మాణాన్ని ఆహ్వానిస్తుండగా.. 'నైతికంగా దివాళాతీసిన లౌకికవాదులు ఇప్పుడు అకస్మాత్తుగా రాముని పట్ల వారికి ఉన్న భక్తిని గుర్తిస్తున్నారు. అయితే కేవలం భాజపాకి మాత్రమే మందిర నిర్మాణం అనేది ఒక విశ్వాసంతో కూడిన నిబంధన' అని ఆ పార్టీ నేత అమిత్​ మాలవీయ చెప్పారు.

మూలాలతో అనుసంధానం..

అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారతీయ సమాజాన్ని తన సాంస్కృతిక మూలాలతో అనుసంధానం చేస్తుందని ఆర్​ఎస్​ఎస్​ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్​ వైద్య పేర్కొన్నారు. తద్వారా మానవ జాతికి మార్గనిర్దేశం చేయగల స్థాయిలో భారతీయ సమాజం ఆర్థికంగా, సాంస్కృతికంగా పరిపుష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'భారతదేశ గత వైభవానికి రామ మందిరం ఒక చిహ్నం' అని వ్యాఖ్యానించారు వైద్య. భారతీయ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన వివరించారు.

ఇకపై కీలకంగా 'హిందూత్వ'

భారత రాజకీయ కాన్వాస్​పై ప్రస్తుతం హిందూత్వ మౌలిక పూతగా మారిందని ఆర్​ఎస్​ఎస్​ మాజీ సిద్ధాంతకర్త, భాజపా మాజీ ప్రధాన కార్యదర్శి కె.ఎన్​ గోవిందాచార్య సూత్రీకరించారు. సామ్యవాదం, లౌకికవాదం ఇక ఎంత మాత్రం రాజకీయాలకు ఇరుసుగా ఉండవని పేర్కొన్నారు. 'జాతీయ రాజకీయాలు తమ మూలాలైన 'హిందూత్వ'వైపు మళ్లుతున్నాయి.' అని వ్యాఖ్యానించారు. దేశంలో సామాన్య ప్రజల్లో మందిర నిర్మాణం పట్ల ఉన్న సైద్ధాంతిక, భావోద్వేగ అనుబంధాన్ని అనేక మంది విపక్షనేతలు గుర్తించారని, అందుకే దీనిని ఆహ్వానిస్తున్నారని గోవిందాచార్య పేర్కొన్నారు. అడ్వాణీ రథయాత్ర నిర్వహణలో గోవిందాచార్య కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి:పునాది రాయితో పులకించిన అయోధ్య

ABOUT THE AUTHOR

...view details