ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని బరాక్ లోయ 104 గిరిజన గ్రామాలకు ఆవాసం. ఇండియా- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఆ ప్రాంతం టీ, చెరకు తోటలూ, వరి పొలాలతో భూమికి పచ్చని రంగేసినట్టు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి నెలవైన ఆ లోయలో ఆడా మగా అన్న తేడా లేకుండా పొగతాగడం, మద్యం సేవించడం వంటివి చేస్తుంటారు. ఫలితంగా.. అక్కడ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్యా ఎక్కువే. కానీ ఆ గిరిజనులు వైద్యం చేయించుకోవాలంటే 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న గువాహటికి వెళ్లాల్సిందే. అంత దూరం వెళ్లలేక క్యాన్సర్తో ప్రాణాలు వదిలినవాళ్లెందరో...
అడయార్లో ఉద్యోగం మానేసి
అప్పటికి చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నాడు రవి కన్నన్. ఒకసారి గెస్ట్ సర్జన్గా అసోం వెళ్లినప్పుడు క్యాన్సర్ బారినపడిన ఓ వ్యక్తి వైద్యానికి డబ్బుల్లేక ఐదువేల రూపాయలకి మూడేళ్ల కొడుకుని అమ్ముకోవడం కళ్లారా చూశాడు. అతని నేపథ్యం, పరిస్థితి గురించి తెలుసుకున్న రవి బరాక్ లోయకి వెళ్లాడు. అక్కడ క్యాన్సర్ బారిన పడిన వాళ్ల దుస్థితిని చూసి తన సేవలు వాళ్లకెంతో అవసరమని భావించాడు. అప్పటికే అక్కడ కొందరు ఓ ట్రస్టుగా ఏర్పడి నాలుగ్గదులతో ఓ ఆసుపత్రిని కట్టారు. కానీ నిధులూ, సౌకర్యాలూ లేక అది ఎవరికీ ఉపయోగపడకుండా ఉంది. దాన్నే క్యాన్సర్ ఆసుపత్రిగా మార్చేద్దామని భావించిన రవి.. అడయార్లో ఉద్యోగం మానేసి అసోం బాట పట్టాడు.
ఇంటింటికీ వెళ్లి
2007లో కచార్ క్యాన్సర్ హాస్పిటల్లో అడుగుపెట్టిన రవి కేవలం పదేళ్లలో దాని రూపురేఖలు మార్చేశాడు. 350 మంది సిబ్బందీ, వంద పడకలూ, ఆధునిక సదుపాయాలతో పెద్దాసుపత్రిగా తీర్చిదిద్దాడు. దాని వెనక రవి కృషి అంతా ఇంతా కాదు. ఓవైపు సౌకర్యాలూ, సిబ్బంది, నిధుల కొరత.. మరోవైపు వైద్యం ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల జనాలు వచ్చేవారు కాదు. ఈ క్రమంలో రవి ఒక్కో సమస్యనీ దాటుకుంటూ ప్రతి గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాడు. స్కూళ్లలో హెడ్ మాస్టర్లతో మాట్లాడి తల్లిదండ్రులు క్యాన్సర్ స్క్రీనింగ్ రిపోర్టులు చూపితేనే పిల్లల్ని స్కూల్లో చేర్చుకోవాల్సిందిగా కోరాడు. కనీసం అలాగైనా స్క్రీనింగ్ చేయించుకుంటారని రవి ఆశ.
నామమాత్రపు ఫీజుతో జీవితకాల వైద్యం