తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2020, 7:33 AM IST

ETV Bharat / bharat

వివాహం చేసుకోకుండా ప్లాస్టిక్​పై పోరాటం!

ప్లాస్టిక్​ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివాహాన్ని సైతం పక్కనబెట్టారు బిహార్​కు చెందిన సామాజిక కార్యకర్త అశుతోష్​ కుమార్​ మానవ్. 1991 నుంచే ప్లాస్టిక్​ భూతంపై పోరాటం చేస్తోన్న ఆయన.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ వెళ్తూ.. ప్లాస్టిక్​ వాడకాన్ని నిషేధిస్తామని స్థానికులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

MARRIAGE
వివాహాం చేసుకోకుండా ప్లాస్టిక్​పై పోరాటం!

వివాహం చేసుకోకుండా ప్లాస్టిక్​పై పోరాటం!

ప్లాస్టిక్​.. మనకు తెలియకుండానే మనిషి జీవితంలో భాగమైన వస్తువు. ప్లాస్టిక్​ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు భవిష్యత్​ తరాలకు హాని ఉందని తెలిసినప్పటికీ దీనిని పూర్తిగా త్యజించలేకపోతున్నాం. అయితే ప్లాస్టిక్​ వల్ల కలిగే అనర్థాలు ప్రజలకు వివరిస్తూ.. వారిలో అవగాహన కల్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారు. తాజాగా బిహార్​ నలంద జిల్లా హిస్లాకు చెందిన సామాజిక కార్యకర్త అశుతోష్​ కుమార్​ మానవ్​... ప్లాస్టిక్​ వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు.

గ్రామగ్రామానికీ వెళ్తూ ప్లాస్టిక్​ వాడితే జరగబోయే భవిష్యత్ పరిణామాలేంటో.. అందరికీ వివరిస్తున్నారు. పాఠశాలలకు వెళ్తూ.. అక్కడి విద్యార్థులతో ప్లాస్టిక్​ భూతాన్ని వాడకుండా ప్రమాణం చేయిస్తున్నారు. చిన్నప్పటి నుంచి సమాజసేవ చేయాలని నిర్ణయించుకున్న ఆయన.. 1991లోనే ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేపట్టినట్లు తెలిపారు. తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసేందుకే వివాహం కూడా చేసుకోలేదు. రాజకీయాల్లో చేరే ఉద్దేశమూ లేదన్నారు మానవ్​.

"చిన్నప్పటి నుంచే సామాజికసేవ చేయడానికి నేనెప్పుడూ ఆసక్తిగా ఉండేవాడిని. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి సమాజసేవ ప్రారంభించాను. అప్పట్లో ప్రతి ఆదివారం నేను, నా మిత్రులు మురికి కాలువలను శుభ్రం చేసేవాళ్లం. కాలువల్లో మురుగునీటి పారుదలకు ప్లాస్టిక్​ అడ్డంకిగా మారిందని అప్పుడే అర్థమైంది. అందుకే ప్లాస్టిక్​ వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా."
- అశుతోష్​ కుమార్​ మానవ్, సామాజిక కార్యకర్త

సానుకూల స్పందన

ప్లాస్టిక్​ నిషేధంపై కుమార్ చెబుతున్న​ మాటలు చిన్న పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఆయన మాటలను చుట్టుపక్కల వారికి చెబుతూ.. ప్లాస్టిక్​ను వాడొద్దంటూ ప్రచారం చేస్తున్నారు విద్యార్థులు.

గతంలో 'క్విట్ గుట్కా' ఉద్యమంపై రాష్ట్రమంతా ప్రచారం చేశారు మానవ్​. ప్రస్తుతం 'స్వచ్ఛభారత్'​తో పాటు జల్​ జీవన్​ హరియాలి అభియాన్​పైనా ప్రసంగాలు చేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details