ప్రకృతి అందాలకు నెలవైన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ప్రదేశ్లో కమలం ప్రభంజనం కొనసాగుతోంది. లోక్సభతో పాటు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది.
సూర్యుడు ఉదయించే రాష్ట్రంలో క్రితం ఎన్నికలతో పోలిస్తే తాజాగా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2014 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
రెండు సంవత్సరాలు గడవగానే 2016లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. చివరకు... పాలనా పగ్గాలే చేతులు మారాయి. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ)కు చెందిన 33మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి నాటకీయ పరిణామాల అనంతరం జరిగిన ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భాజపా ప్రచారం..
అభివృద్ధే ప్రధానాంశంగా భాజపా ఎన్నికల బరిలో దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా... రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు.
అరుణాచల్ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)... తాము పోటీచేయని స్థానాల్లో భాజపాకు మద్దతు ప్రకటించింది.