తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యతి' అడుగుజాడలపై నిపుణుల పరిశీలన

'యతి' అడుగుజాడలుగా చెబుతున్న కాలిముద్రల చిత్రాలను నిపుణులకు పంపించాలని భారత సైన్యం నిర్ణయించింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ భారీ జీవి ఉన్నట్లు రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏప్రిల్​ 9న నేపాల్​లోని మకాలూ బేస్​ క్యాంపస్​నకు సమీపంలో భారత సైన్యం తీసిన అనుమానస్పద చిత్రాలతో మరోసారి 'యతి' పేరు తెరపైకి వచ్చింది.

By

Published : May 1, 2019, 6:39 AM IST

Updated : May 1, 2019, 9:03 AM IST

'యతి' అడుగులపై పరిశీలనకు సైన్యం నిర్ణయం

'యతి'... ఎన్నో ఏళ్లుగా చాలా మందిని తొలిచేస్తోన్న ప్రశ్న. ఎంతోమంది తాము యతి అడుగుజాడలను చూశామని చెబుతూనే ఉన్నారు. అసలు ఈ యతి ఎవరు? హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉందని ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఈ జీవి కథ కల్పితమా? లేక వాస్తవమా? ఇవన్నీ ప్రశ్నలే. అయితే తాజాగా భారత సైన్యం అనుమానస్పద వింత జీవి కాలిముద్రల చిత్రాలను ట్విట్టర్​లో పంచుకుంది. ఈ చిత్రాలను నిపుణుల పరిశీలనకు పంపాలని నిర్ణయించింది.

ఏప్రిల్​ 9న నేపాల్​లోని మకాలూ బేస్​ క్యాంప్​​​నకు సమీపంలో మన సైన్యానికి కొన్ని అనుమానస్పద పాదముద్రలు 32x15 అంగుళాల పరిమాణంలో కనిపించాయి. పర్వతారోహణ బృందం వీటి ఛాయచిత్రాలు, వీడియోలను తీసినట్లు సైన్యం వెల్లడించింది. ఆ చిత్రాలను ట్విట్టర్​లో విడుదల చేసింది.

మంచులో కనిపించిన ఈ ముద్రలు యతివా, లేక మరేదైనా వికృతాకార జీవివా తేలాల్సి ఉంది. గతంలో మకాలూ-బరూన్​ జాతీయ ఉద్యానవనం వద్ద ఇలాంటి అంతుచిక్కని జీవి కనిపించినట్లు భారత సైన్యం ట్విట్టర్​లో వెల్లడించింది.

సగటు మనిషి కన్నా పెద్దగా, ఎత్తుగా ఉండే కోతి లాంటి జీవి.. హిమాలయాలు, సైబీరియా, మధ్య-తూర్పు ఆసియా ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు నేపాలీ జానపద కథలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో మేజర్​ మనోజ్​ జోషి నేతృత్వంలోని 18 మంది సైనికుల బృందానికి దొరికిన చిత్రాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ ముద్రలు దేనికి చెందినవో తెలుసుకునేందుకు నిపుణుల సాయం తీసుకోనుంది సైన్యం. ఏ రంగంలోని నిపుణులకు వీటిని పంపిస్తున్నారో సైనిక వర్గాలు వెల్లడించలేదు. ఈ పర్వతారోహణ బృందం వచ్చే నెలలో భారత్​కు రానుంది.

ఈ అనుమానస్పద అడుగుజాడలు శతాబ్దాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అలానే దీని వెనుక అనేక కథలు తరతరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి.

Last Updated : May 1, 2019, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details